ఏలూరు(మెట్రో): జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లాలోని 1,744 పోలింగ్ కేంద్రాల్లో వేకువజామునే మాక్ పోలింగ్తో ప్రారంభించిన ఓటింగ్ సరళి, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించారు. సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు తక్షణమే ఈవీఎంల సమస్యలు పరిష్కరించి పోలింగ్ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో సుమారు 20 వేల మంది అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అర్ధరాత్రి వరకూ చేరుతూ..
జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్కు అర్ధరాత్రి వరకు చేరుకుంటూనే ఉన్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ కలెక్టర్, ఎస్పీల సమక్షంలో ఈవీఎంలను ఏలూరు సీఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచారు. ఈవీఎంలు భద్రపరిచే ప్రక్రియ మంగళవారం వేకువజాము వరకు సాగనుంది. ఏలూరు చేరుకున్న పోలింగ్ సిబ్బందికి వారికి కేటాయించిన రూట్లలో బస్సులను సైతం తిరిగి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడంచెల భద్రత నడుమ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లో ఈవీఎంలు, పోలింగ్ మెటీరియల్ను భద్రపరిచారు.
ఎన్నికల కమిషన్ కితాబు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఎన్నికలపై అవగాహన కల్పించే విధుల్లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారుల తీరును ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొనియాడింది. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో సంప్రదాయ వస్త్రాలతో ఓటర్లను స్వాగతం పలకడాన్ని అభినందించింది. అలా గే మారుమూల కొండరెడ్డి ప్రాంతమైన కాకిసనూరుకు గోదావరి నదిపై బోటుపై వెళ్లి విధులు నిర్వహించిన పోలింగ్ సిబ్బందిని సత్కరించడం వంటి కార్యక్రమాలకు ప్రశంసలు కురిపించింది.
14 సార్లు ఓటు వేశా
భీమడోలు: ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరూ ఓటు హక్కును బాధ్యతతో ఉపయోగించుకోవాలని 90 ఏళ్ల వయసున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు పాలేటి బ్రహ్మారావు అన్నారు. భీమడోలులో సోమవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు. తాను 1957 సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు 14 సార్లు ఓటు వేశానని అన్నారు. ఎన్నికల సంఘం తనకు హోమ్ ఓటింగ్కు అవకాశం ఇచ్చిందని, అయినా తాను పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకే మొగ్గు చూపానన్నారు. తనకు ఓపిక ఉండటంతో క్యూలైన్లో నిలుచుకుని ఓటు హక్కు వినియోగించుకున్నానన్నారు. 14 సార్లు ఓటు వేసే భాగ్యాన్ని భగవంతుడు కలిగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కోరారు.
ఓటేసేందుకు ఆస్ట్రేలియా నుంచి..
గణపవరం(నిడమర్రు): సముద్రాలు దాటి ఆస్ట్రేలియా నుంచి స్వగ్రామం చిలకంపాడు గ్రామానికి ఓ టు వేసేందుకు వచ్చి నట్టు మురళీ రామ్మో హన్రావు అనే యువకుడు తెలిపారు. 11న రాత్రి ఆస్ట్రేలియా నుంచి బయలుదేరి సోమవారం మధ్యాహ్నానికి చిలకంపాడు చేరుకున్నానని, ఓటు విలువ గ్రామస్తులకు తెలియజేసేందుకు వ్యయప్రయాసలతో వచ్చానని అన్నారు.