పోలింగ్ ప్రశాంతం
● 79 శాతం పోలింగ్ నమోదు ● జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ● రాత్రి 9 గంటల వరకు సాగిన ఓటింగ్ ప్రక్రియ ● స్ట్రాంగ్రూమ్కు చేరుతున్న ఈవీఎంలు, వీవీప్యాట్లు ● పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా ఓ (పో) టెత్తింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తిస్థాయి ప్రశాంత వాతావరణంలో సాగింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,774 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. మండుటెండలో సైతం క్యూలైన్ల్లో ఓటర్లు బారులు తీరడం విశేషం. రాత్రి 9 గంటల సమయానికి జిల్లావ్యాప్తంగా 79 శాతం పోలింగ్ నమోదైంది. సుమారు 40 బూత్ల్లో 8 గంటలు దాటే వరకు పోలింగ్ కొనసాగింది. ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు, ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకోగా కేంద్ర ఎన్నికల సంఘ పరిశీలకులు, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ డి. మేరీ ప్రశాంతి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సరళిని, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఉదయం 7 గంటల నుంచి..
ఉదయం 7 గంటలకే జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు 10.53 శాతం, ఉదయం 11 గంటలకు 24.23 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 40.05 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 59.14 శాతం, సాయంత్రం 5 గంటలకు 72.03 శాతం, సాయంత్రం 6 గంటలకు 75.05 శాతం పోలింగ్ నమోదైంది. 16,37,430 మంది ఓటర్లకుగాను 12,28,973 మంది ఓటర్లు సాయంత్రం 6 గంటల సమయానికి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 5,95,441 మంది పురుషులు, 6,33,478 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో పురుషులు కంటే మహిళలే ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నారు. సుమారుగా 5 నుంచి 7 శాతం మహిళా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు
ఏలూరు జిల్లా యంత్రాంగం పోలింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన సదస్సులు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. కలెక్టరేట్లో భారీ డిజిటల్ కౌంట్డౌన్ గడియారాన్ని విద్యుత్ శాఖ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. అలాగే ఏలూరుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయిదా గ్రామ పంచాయతీలోని కాకిసనూరు పోలింగ్ కేంద్రంలో 472 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ పోలింగ్ అధికారులకు, సిబ్బందికి గిరిజన సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. అలాగే ఏలూరు జిల్లా కేంద్రంలో 2,044 వెబ్ కాస్టింగ్ కెమెరాలతో పోలింగ్ సరళిని పరిశీలించే ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు గ్రో గ్రీన్ నినాదంతో కొన్నిచోట్ల మొక్కలు పంపిణీ చేశారు. అలాగే డీపీఓ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, బాలల సంరక్షణాధికారి సూర్యచక్రవేణి సంప్రదాయ వస్త్రధారణతో ఓటర్లను స్వాగతించారు. సోమవారం ఉదయం 5.30 గంటల్లోపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్పోల్ నిర్వహించే సాంకేతిక సమస్యలున్న ఈవీఎంలను సరిచేశారు. అలాగే 415 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 2,044 వెబ్కాస్టింగ్ కెమెరాలను ఏర్పాటుచేశారు. సీనియర్ సిటిజన్లు, విభిన్న ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఓటింగ్ సరళి ఇలా..
జిల్లాలో ఉదయం నుంచి పోలింగ్ శాతం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య, మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 1,774 పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్ల నాని, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో అత్యధికంగా నూజివీడు నియోజకవర్గంలో 81.01 శాతం, అత్యల్పంగా ఏలూరు నగరం 66.25 శాతం పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు నమోదైంది.
ఓటు వేశానంటూ
సెల్ఫీ తీసుకుంటూ..
పోలింగ్ శాతం ఇలా..
నియోజకవర్గం ఉ. 9 గంటలు 11 గంటలు మ.1 గంట 3 గంటలు సా.5 గంటలు 6 గంటలు
చింతలపూడి 9.07 22.80 38.66 55.45 69.00 71.41
దెందులూరు 11.20 26.85 42.90 60.66 74.25 77.00
ఏలూరు 10.74 27.96 38.04 54.22 64.59 66.25
కై కలూరు 9.10 24.13 39.69 61.73 73.78 78.53
నూజివీడు 9.88 24.91 42.11 64.62 77.08 81.01
పోలవరం 9.91 22.03 37.13 58.86 72.29 75.37
ఉంగుటూరు 11.31 25.18 42.64 59.38 74.22 77.05
మొత్తం 10.53 24.32 40.05 59.14 72.03 75.05