● పట్టణంలో ఐదేళ్లుగా
గణనీయమైన అభివృద్ధి
● రూ.376.64 కోట్లతో వివిధ పనులు
● రూ.359.26 కోట్లతో సంక్షేమం
● పరిశుభ్రతతో ఆహ్లాదకర వాతావరణం
నిడదవోలు: జిల్లా కేంద్రం, ప్రధాన వాణిజ్య ప్రాంతంగా ఉన్న రాజమహేంద్రవరం.. అటు పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో వ్యాపార కేంద్రం తాడేపల్లిగూడెంతో పాటు తణుకు తదితర పట్టణాలకు చేరువగా ఉన్న నిడదవోలు గడచిన ఐదేళ్లుగా జోరుగా అభివృద్ధి చెందుతోంది. జిల్లాలోని ఏకై క రైల్వే జంక్షన్ అయిన ఈ పట్టణంలో రూ.371.33 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పలు పనులు పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వీటితో పాటు పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేశారు. ప్రగతి పనులతో పాటు ప్రజా సంక్షేమానికి కూడా పెద్ద పీట వేయడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. పట్టణంలోని 28 వార్డుల్లో అర్హతే ప్రామాణికంగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.359.26 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఫలితంగా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో పరిశుభ్రతతో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు.
ఆర్ఓబీ నిర్మాణం
ఉభయ గోదావరి జిల్లాల చిరకాల కోరిక నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఆర్ఐఎఫ్ నిధులు రూ.185 కోట్లు మంజూరు కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. దీని భూసేకరణలో భాగంగా నిడదవో లు పట్టణంతో పాటు సమిశ్రగూడెం గ్రామంలో స్థలా లు, నిర్మాణాలు కోల్పోయిన వారికి పరిహారంగా ఇప్పటికే రూ.10.55 కోట్లు అందజేశారు. దీంతో వ్యా పారులు, నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది.
పేదలకు కార్పొరేట్ వైద్యం
పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో రూ.91.16 లక్షలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందనున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందాలనే సంకల్పంతో ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించింది.
నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ
పట్టణంలోని పాటిమీద సెంటర్ నుంచి గణపతి సెంటర్ వరకూ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణతో పాటు గణపతి జంక్షన్ అభివృద్ధి పనులను రూ.6 కోట్లతో చేపట్టారు. గణపతి జంక్షన్ అభివృద్ధిలో భాగంగా విశాలమైన నాలుగు లేన్ల రోడ్డు, వాటర్ ఫౌంటైన్, అందమైన పార్కు, మంచినీటి పైపులైన్, డ్రైనేజీ, బస్ షెల్టర్, పచ్చదనంతో ఆహాదకరంగా ఉండేలా సుందరీకరణ పనులు చేపట్టారు.
ఎన్నడూ లేనంతగా అభివృద్ధి
నిడదవోలు పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానంగా రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే ప్రతి వార్డులో పనులు చేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వార్డుల్లోని సమస్యలు గుర్తించి, పరిష్కరించారు. కొన్నేళ్ల నుంచి డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు లెగసీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ నిల్వ ఉన్న 40 వేల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు. సుమారు రూ.కోటితో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ చెంతన చినకాశిరేవు వద్ద చేపట్టిన రివర్ ఫ్రంట్ పార్కు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది.
వార్డులు : 28
విస్తీర్ణం : 14.15 చదరపు కిలోమీటర్లు
జనాభా : 43,809
పురుషులు : 21,281
మహిళలు : 22,528
ఓటర్లు : 35,112
పురుషులు : 16,584
మహిళలు : 18,112
మున్సిపల్ పాఠశాలలు : 15
ప్రభుత్వ ఆసుపత్రులు : 3
వార్డు సచివాలయాలు : 13