నిడదవోలు: బైక్ రేసింగ్లు అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నిడదవోలు వైఎస్సార్ కాలనీలో 12న దీపావళి రోజు రాత్రి దివ్యాంగుడు వల్లూరి శ్రీనివాసరావు బంధువులతో ఆనందంగా గడిపి, పాల ప్యాకెట్ల కోసం అక్కడి వినాయక గుడి వద్ద దుకాణానికి వచ్చాడు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న అతన్ని వేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. దీంతో శ్రీనివాసరావు ఎగిరి కిందపడ్డాడు. వెనుక నుంచి మరో బైక్ వచ్చి అక్కడున్న వారిని ఢీకొంది. ఒక బైక్పై ఇద్దరు, మరో బైక్పై ముగ్గురు కుర్రోళ్లు ఉన్నారు. శ్రీనివాసరావు కాలు విరగడమే కాకుండా, పొట్టలోని పేగులు బయటకు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న అతని బంధువులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బైక్ నడిపిన యువకుడు బషీర్కు కూడా గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో రోజువారీ కూలీగా పనిచేస్తున్న దివ్యాంగుడు శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నిడదవోలు పట్టణ ఎస్సై పి.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫ దివ్యాంగుడిని ఢీకొన్న బైక్
ఫ కేసు నమోదు చేసిన పోలీసులు