● ముగ్గురు కౌన్సిలర్లతో కలిసి పొంగులేటితో మంతనాలు ● నేడో రేపో కాంగ్రెస్ తీర్థం
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు బీఆర్ఎస్కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కొందరు కౌన్సిలర్లతో కలిసి ఆయన టీపీసీసీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించారు. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. డీవీ బాటలోనే మరి కొందరు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పయనమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే హరిప్రియకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దన్న వారిలో డీవీ కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే అనంతరం పరిణామాల్లోనూ పార్టీ నాయకులు తనపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పొమ్మనలేక పొగ పెడుతున్నారని మథనపడుతున్న ఆయన.. పొంగులేటితో మంతనాలు జరిపినట్లు తెలిసింది.
నేడు తుమ్మల, పొంగులేటి రాక..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఇల్లెందుకు రానున్నారు. మున్సిపల్ చైర్మన్ డీవీని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అయితే డీవీ తదితరులు కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఎమ్మెల్సీ తాతా మధు అడ్డుకుంటున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో డీవీ ఇంట పొంగులేటి, తుమ్మల అల్పాహార విందు చేసి, పార్టీలోకి ఆహ్వానిస్తారని సమాచారం. ఇప్పటికే జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య డీవీ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు.