● ఫలించిన రాజంపేట,కడప ఎంపీల కృషి
● భక్తుల్లో హర్షాతిరేకాలు
రాజంపేట/కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్సార్ ఉభయ జిల్లాల్లో అయ్యప్పల కోసం రైల్వేశాఖ శబరిమలైకు తొలిసారిగా ప్రత్యేకరైలును పట్టాలెక్కిస్తున్నారు. ఈ విషయంపై రాజంపేట,కడప ఎంపీలు పీవీ మిధున్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, చేసిన కృషి ఫలించింది. ఇప్పటికే అయ్యప్పలబండిగా పేరొందిన జయంతి ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్గా కొనసాగుతోంది. జిల్లాలో వేలాదిమంది స్వాములు వివిధ మార్గాల మీదుగా శబరిమలైకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మీదుగా రద్దీ అధికంగా ఉండటంతో శబరిమలైకు స్పెషల్ట్రైన్ రన్ చేయాలని రైల్వేశాఖను ఎంపీలు కోరారు.కాగా గతంలో భక్తులు రేణిగుంటకు వెళ్లి స్పెషల్ట్రైన్స్ను ఆశ్రయించేవారు.
స్పెషల్ట్రైన్ ఇలా: కాచిగూడ నుంచి కొల్లం మధ్య అయ్యప్పల బండి నడిచేలా సౌత్సెంట్రల్ రైల్వే రూపకల్పన చేసింది. 11, 13 తేదీల్లో 07187 కాచిగూడ నుంచి కొల్లం (సోమవారం), కొల్లం నుంచి కాచిగూడ (బుధవారం)కు నడపనున్నారు. ఎర్రగుంట్ల, కడప, రాజంపేటలో ఈ స్పెషల్ ట్రైన్కు హాల్టింగ్ ఇచ్చారు.01787 నంబరుతో కాచిగూడ నుంచి వచ్చేటప్పుడు ఎర్రగుంట్లకు ఉదయం 9.05. కడపకు 9.39, రాజంపేటకు 10.28కు చేరుకుంటుంది. 07188 నంబరుతో శబరిమలై నుంచి వచ్చేటప్పుడు రాజంపేటకు తెల్లవారుజామున 4.38, కడపకు 5.38, ఎర్రగుంట్ల 6.13కు చేరుకుంటుంది. అయ్యప్పస్వాములు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మిధున్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గతంలో జిల్లా మీదుగా శబిరిమలైకు స్పెషల్ట్రైన్స్ నడిచేవి కాదు. సర్కారు ఏరియా నుంచి అధికంగా శబిరిమలైకు స్పెషల్స్ వెళ్లేవి. ఈసారి జిల్లా మీదుగా శబిరిమలైకు ప్రత్యేకరైలు నడపడం వల్ల అయ్యప్పస్వామలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రద్దీని బట్టి మరో స్పెషల్ట్రైన్ కూడా వేసేందుకు ఎస్సీ రైల్వే యోచిస్తోందని డీఆర్యుసీసీ సభ్యుడు తల్లెం భరత్రెడ్డి తెలిపారు.