● వైఎస్ జగన్ సర్కార్లో బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి విశేష కృషి
● ప్రతి పేదవాడి తలుపు తట్టిన సంక్షేమ పథకాలు
● నేడు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో సామాజిక సాధికారత యాత్ర
సాక్షి ప్రతినిధి, కడప: సామాజిక మార్పు, అణగారిన వర్గాల అభ్యున్నతి...ఇది ఒకప్పుడు మాటలకే పరిమితం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ వీటిని ఆచరణలో చూపెట్టింది. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు పల్లకీ మోసే బోయీలుగా మిగిలిపోకూడదని సంకల్పించింది. ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకా ల్లో అత్యధిక భాగస్వామ్యమిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సమున్నత గౌరవం కట్టబెట్టింది. ఆదరించిన ప్రజలకు అండగా నిల్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేషంగా శ్రమించారు. నాలుగున్నర్రేళ్ల పాలనలో సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.7,984.48 కోట్లు అందించారు. అందులో ఎస్సీలకు రూ.2,000.92 కోట్లు, ఎస్టీలకు రూ.212.47 కోట్లు, బీసీలకు రూ.5,263.09 కోట్లు, మైనార్టీలకు రూ.508 కోట్లు దక్కింది. జిల్లాలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఇంత పెద్దఎత్తున సంక్షేమం లభించిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు. అదే విషయమై చేసిన మేళ్లు చెప్పుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఏకమయ్యాయి. ఆమేరకు సామాజిక సాధికార యాత్రను సోమవారం మైదుకూరు కేంద్రంగా నిర్వహించనున్నారు.