● కలెక్టర్ రవిపట్టాన్శెట్టి
తుమ్మపాల: స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి నేటి వరకు సాయుధ దళాలు దేశం లోపల, వెలుపల ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వీరోచితమైన సేవలు అందిస్తూ దేశ రక్షణకు ఎంతగానో శ్రమిస్తున్నాయని కలెక్టర్ రవిపట్టాన్ శెట్టి తెలిపారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవానులపై ఆధారపడిన వారి సంక్షేమం కోసం విరాళాలు అందించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. మాజీ సైనికులు, వితంతువుల సంక్షేమం కోసం ఈనెల 7న నిర్వహిస్తున్న సాయుధ దళాల పతాక దినోత్సవానికి అందరూ సహాయం అందించాలని పేర్కొన్నారు. పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, వాణిజ్య సంస్థలు, సినిమా థియేటర్ల యజమానులు భారీగా విరాళాలు ఇవ్వాలని కోరారు. మన దేశ రక్షణలో తుది శ్వాస విడిచిన వీర జవానుల కుటుంబాల సంక్షేమానికి, మాజీ సైనికుల సంక్షేమానికి, వారి పునరావాసానికి ఈ విరాళాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ (ఆంధ్రప్రదేశ్), మొగల్రాజపురం, విజయవాడ పేరిట డీడీ రూపంలో గాని, ఈసీఎస్. ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్డు, విజయవాడ అకౌంట్ నంబర్.33881128795, ఎస్బీఐ ఎన్0016857 పంపుతూ జిల్లా సైనిక సంక్షేమధికారి, విశాఖపట్నం వారికి తెలియజేయాలని కోరారు. ఈ విరాళాలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.