● వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేసిన ఆఫీసర్లు
కై లాస్నగర్: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగియగా ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను ప్రత్యేక భద్రత మధ్య జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రానికి తరలించారు. ఈ ప్రక్రియ గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. నియోజకవర్గాల వారీగా వేర్వేరుగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో ఈవీంఎలను భద్రపరిచారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సాధారణ, పోలీస్ పరిశీలకులు నితిన్ కే పాటిల్, అశోక్ గోయల్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూంలకు తాళాలు, సీల్ వేశారు. స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెలతో కూడిన పకడ్బందీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు బీ స్రవంతి, చాహత్ బాజ్పాయ్, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.