భూ దందాలకు సహకరిస్తే క్రిమినల్ చర్యలు
► తక్షణమే ప్రభుత్వ భూములను ప్రకటించాలి
► పత్రికల్లో వచ్చినా పట్టించుకోరా..
► అధికారులపై కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం
బీచ్రోడ్ : ‘విశాఖపట్నం అర్బన్లో భూ దందాలపై అనేక ఫిర్యాదులందుతున్నాయి. కొంత మంది తహసీల్దార్లు సహకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను హెచ్చరించారు. ‘సాక్షి’లో వరుసగా ప్రచురితమైన భూ ఆక్రమణల కథనాలపై ఆయన స్పందించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రభుత్వ భూముల పరిరక్షణపై పది అర్బన్ మండలాల తహసీల్దార్లు, సర్వేర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంతమంది అధికారులకు తమ కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలియకపోవటం దారుణమన్నారు. ఇంకొంత మంది తహసీల్దార్లు, పోలీసులు, సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తెచ్చి భూ కబ్జాదారులకు సహాయమందిస్తున్నారని మండిపడ్డారు. పత్రికల్లో పదే పదే వస్తున్న వార్తలపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, వాస్తవాలను ప్రజలకు తెలపాలని ఆదేశించారు.
ప్రభుత్వ భూములు ఎక్కడ?
మండలాల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయే తక్షణమే ముసాయిదా వేసి, అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. వచ్చిన వాటిపై రిమార్కులతో సహా రాసి, తక్షణమే తుది ప్రచురణ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయి? ఎవరి ఆధీనంలో, ఎప్పటి నుంచి ఉన్నాయి? వంటి పూర్తి వివరాలతో రికార్డులు తయారు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలంటే ముందు వాటి రికార్డులను భద్రపరచాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను సంరక్షించాలి
ప్రతి వారం ప్రభుత్వ భూములను తనిఖీలు చేసి వాటిపై కన్నేసి ఉంచాలన్నారు. వెబ్ల్యాండ్లో పేర్లు లేకుండా నమోదు చేసిన కొన్ని భూములను కూడా సవరించాలని సూచించారు. రెవెన్యూలో రికార్డులు లేని వాటికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సహకారాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాలను ఫారం–22 ఏలో నమూనా ప్రకారం తయారు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణ తహసీల్దార్లదేనని అన్నారు.
కచ్చితమైన రిపోర్ట్ ఇవ్వాలి
కొన్ని సందర్భాల్లో కబ్జా భూముల విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని తహసీల్దార్లను కోరితే వారు అది ప్రభుత్వ భూమా.. ప్రైవేట్ భూమా.. చెప్పకుండా ఆన్ పొజిషన్ అంటూ రిపోర్టులు ఇస్తున్నారని తెలిపారు. అలా కాకుండా కచ్చితమైన రిపోర్టు ఇవ్వాలని సూచించారు. రికార్డుల వివరాలు ఎలా నమోదు చేయాలో తెలియకపోతే వారికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ జి.సృజన, సహాయ కలెక్టర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.