-
జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
సాక్షి, హైదరాబాద్: జిల్లా జడ్జి పోస్టుల నియా మకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. 9 జిల్లా జడ్డి పోస్టు (ఎంట్రీ లెవల్)లను వర్టికల్ పద్ధతిలో నియమించేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వగా, పూర్తిస్థాయి(డిటెయిల్డ్) నోటిఫికేషన్ ఈనెల 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచ నున్నట్టు అధికారులు వెల్లడించారు.ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9 ఉద్యో గాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రకటించింది. అయితే ఈ రోస్టర్ వర్టికల్ రిజర్వేషన్ల పద్ధతిలో ఉండడం గమనార్హం. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా జిల్లాజడ్జి పోస్టుల భర్తీలో వర్టికల్ రిజర్వేషన్ విధానం ఉండడంతో అయోమయం నెలకొంది.జిల్లా జడ్జి పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నట్టు అందులో వివరించారు. మే 13వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుందని, ఈ ఏడాది ఆగస్టు 24, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రాథమికంగా ప్రకటించారు. అయితే 9 జిల్లా జడ్జి పోస్టుల్లో మహిళలకు నాలుగు పోస్టులు రిజర్వు చేసింది. ఖాళీ పోస్టులు, రోస్టర్ పాయింట్ల వారీగా ఎలా ఉంటుందో ప్రభుత్వం వెల్లడించింది. -
జూన్లో జాబ్ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్ల జాతరకు లైన్క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్ఈఐఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
రూ. 2 కోట్లకు ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షా పత్రాలు!
రాజస్థాన్లో మరో అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను గత గెహ్లాట్ ప్రభుత్వం నిర్వహించింది. 2021 సెప్టెంబరులో ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తాజాగా వెల్లడైంది. గత ఏడాది మే నెలలో ఈ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. విజయం సాధించినవారు ప్రస్తుతం రాజస్థాన్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇన్నాళ్లకు ఈ పరీక్షలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరీక్షలో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అభ్యర్థులు మోసపూరితంగా ఉత్తీర్ణులయ్యారని ఆధార పూర్వకంగా తేలిందని కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా తెలిపారు. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 42 మంది భాగస్వాములు పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో 20 మందిని అరెస్టు చేశారు. రాజధాని జైపూర్లోని హస్నుపర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఈ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ను వాట్సాప్లో పంపారు. ఇందుకోసం సదరు స్కూల్ డైరెక్టర్ పది లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ పేపర్ రూ. 2 కోట్లకు పైగా మొత్తానికి అమ్ముడుపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
9 వేల ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ రికార్డు స్థాయి వేగంతో జరిగింది. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) భర్తీ చేసింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియ మొదట్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించింది. కానీ భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని భావించిన ప్రభుత్వం గురుకుల నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శుల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ బోర్డు దూకుడుగా భర్తీ ప్రక్రియ చేపట్టింది. గతంలో దాదాపు 4 వేల ఉద్యోగ నియామకాలను ఏడాది కాలంలో పూర్తి చేయగా.. ఇప్పుడు ఏకంగా 9వేల ఉద్యోగాల భర్తీని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసింది. గత నెలలో 2 వేలకు పైగా ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందజేయగా.. ఇప్పుడు మరో 6,500 మందికి అందించనుంది. గత ఏప్రిల్లో ప్రకటనలు జారీ చేసి.. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఆర్ఈఐఆర్బీ గతేడాది ఏప్రిల్ 5వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. 9 వేల ఉద్యోగాలకు ఏక కాలంలో 9 నోటిఫికేషన్లు విడుదల చేసి రికార్డు సృష్టించింది. అదే నెల 17వ తేదీ నుంచి దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరించి గతేడాది ఆగస్టులో పరీక్షలను నిర్వహించింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానం అవలంభించింది. సెప్టెంబర్ నెలలో అర్హత పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలను విడుదల చేసింది. దీనితో పాటు క్షేత్రస్థాయి నుంచి అభ్యంతరాలు స్వీకరించడం, తిరిగి తుది కీలను ఖరారు చేయడం దాదాపు నెలరోజుల వ్యవధిలో పూర్తి చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో కొంత జాప్యం జరిగింది. తాజాగా రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి జీవోలు విడుదల చేయడంతో నియామకాల ప్రక్రియకు మార్గం సుగమమైంది. అర్హత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వివిధ కేటగిరీల్లో 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాలు ప్రకటించడం, అనంతరం డెమో పరీక్షలు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను వెబ్సైట్లో ప్రచురించడం లాంటివన్నీ కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. నేటి మధ్యాహ్నం నియామక పత్రాలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 6,500 మంది ఎంపికయ్యారు. వీరికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని లాల్ బహద్దూర్ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు ఇతర మంత్రులు, గురుకుల సొసైటీ కార్యదర్శులు, సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సోమవారం నియామకపత్రాలు ఇస్తారా? లేదా? అనే విషయమై స్పష్టత లేకుండా పోయింది. అయితే ఆయా జిల్లాల అభ్యర్థులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. -
TSPSC: ఏ క్షణమైనా సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (175), డ్రగ్ ఇన్స్పెక్టర్ (18), హార్టీకల్చర్ ఆఫీసర్ (22), ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని లైబ్రేరియన్ (77), అసిస్టెంట్ మోటార్ Ððవెహికిల్ ఇన్స్పెక్టర్ (117), గ్రూప్–4 (8180) పోస్టులకు సంబంధించి వెబ్సైట్లో జీఆర్ఎల్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కేటగిరీల వారీగా మెరిట్ సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను కమిషన్ అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి ఆ తర్వాత తుది జాబితాలు విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కోసం అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాలి. అదేవి ధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవా లి. ఏ క్షణంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చునని టీఎస్పీఎస్సీ తెలిపింది. మున్సిపల్ శాఖలో వివిధ పోస్టులకు జీఆర్ఎల్ విడుదల పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితాను కమిన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మహిళలకు రిజర్వేషన్లు.. ప్రతి కేటగిరీలో 33.3%
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామ కాల్లో మహిళలకు హారిజాంటల్ (సమాంతర) పద్ధతిలో 33 1/3 శాతం (33.333%) రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఆ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు జారీ (జీఓ.ఎంఎస్.3) చేశారు. వీటి ప్రకారం మహిళలకు ఓపెన్ కాంపిటీషన్ (ఓసీ)తో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, దివ్యాంగులు, ఎక్స్ సర్విస్మెన్, క్రీడాకారుల కోటాలో హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పట్టికలో ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఇప్పటివరకు వర్టీకల్ పద్ధతి (పట్టికలోని పోస్టుల్లో కొన్నిటిని ప్రత్యేకంగా మహిళలకంటూ మార్కింగ్ ఇచ్చేవారు)లో ఉద్యోగ నియామ కాలు చేయగా.. ఇకపై ఎలాంటి మార్కింగ్ చేయకుండా 33 1/3శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం సూచించిన మెథడాలజీ ప్రకారం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలుకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం. 56/1996 ఉత్తర్వులు రద్దు చేసింది. ఈ పద్ధతిని ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేకంగా జీవో జారీ చేయనుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మెమోకు అనుగుణంగా ఉత్తర్వులు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సాధారణ పరిపాలన శాఖ తరపున ఒక మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెమోను అన్ని నియామక సంస్థలకు పంపించారు. ఈ విషయంలో న్యాయ వివాదాలు తలెత్తకుండా మహిళా శిశు సంక్షేమశాఖ 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలు కోసం 1996లో జారీ చేసిన జీవో నం.41కు, రాష్ట్ర సబార్డినేట్ సర్విసు నిబంధనలు రూల్.22కు సవరణలు చేయాలని పేర్కొంటూ టీఎస్పీఎస్సీ ఈనెల 8న మహిళా శిశు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది. -
జీఓ 46 రద్దు ఇప్పటికి లేదు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా జీవో46 రద్దుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలంచాలని సీఎంకు అధికారులు సూచించడంతో రేవంత్రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ నియామకాల్లో జీవో నెం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో హైపవర్ కమిటీతో రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహా సూచనలను సీఎం రేవంత్రెడ్డి కోరారు. 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడమే.. : పోలీస్ నియామక ప్రక్రియ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్ అధికారులు తేల్చి చెప్పారు. ’’మార్చి 2022లో పోలీసు నియామకాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 4, 2023 నాటికి 15,750 పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తయినా.. కోర్టు కేసుతో ప్రక్రియ పెండింగ్ లో పడింది’’అని అధికారులు తెలిపారు. అయితే సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని సీఎం దృష్టికి అధికారులు తెచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్, అధికారులు స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు అధికారులు సూచించారు. జీఓ 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టుల కేటాయింపు ఉండడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ కానిస్టేబుల్ పోస్టులు స్థానికులకు దక్కుతున్నాయనే వాదనను కొందరు వినిపిస్తున్నారు. ఫలితంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అయితే నియామక ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ఇప్పుడు జీఓ 46 ర ద్దు అసాధ్యం అన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. -
కొలువుల పట్టిక తారుమారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లలో కొలువుల పట్టిక తారుమారు కానుంది. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లలో నిర్దేశించిన పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ మాయం కానుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజాంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి, ఉద్యోగాలను భర్తీ చేయని వాటిల్లో హారిజాంటల్ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ)లు నోటీసులు ఇచ్చాయి. వీలైనంత వేగంగా పోస్టుల క్రమాన్ని మార్చి పంపించాలని స్పష్టం చేశాయి. ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు దిగనున్నట్లు స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, గురుకుల కొలువులు, సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సవరణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు అనుసరించిన వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు 33 1/3 శాతం పోస్టులను ఆయా వరుస క్రమంలో రిజర్వ్ చేసి (నిర్దిష్ట పాయింట్ కింద ఉన్న పోస్టును మహిళలకని ప్రత్యేకంగా మార్క్ చేసి) చూపించేవారు. కానీ తాజా హారిజాంటల్ విధానంలో మహిళలకు ఎక్కడా పోస్టులను రిజర్వ్ చేయరు (ఎలాంటి మార్కింగ్ ఉండదు). భర్తీ సమయంలోనే ప్రతి మూడింటా ఒక్క పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు. అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్తో కూడిన కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలకు సమర్పించాల్సి ఉంది. ఉదాహరణకు గతంలో ఓ శాఖలో పది ఉద్యోగాలకు సంబంధించి 3 పోస్టులను మహిళలకు రిజర్వ్ చేసి పంపినట్లైౖతే, తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్ను తొలగించి పది పోస్టులను జనరల్కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలి. అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు. కేవలం మహిళలకు రిజర్వ్ చేసిన స్థానం సంబంధిత వర్గ జనరల్ కేటగిరీకి మారుస్తారు. ఇలా శాఖలన్నీ హారిజాంటల్ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనుంది. -
క్యాంపస్ రిక్రూట్మెంట్లపై ఫ్రెషర్స్లో కంగారు
-
పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీపై పిటిషన్ కొట్టివేత
సాక్షి, అమరావతి: రైతుభరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గతనెలలో జారీచేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ పలువురు వెటర్నరీ మెడికల్ ప్రాక్టీషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. నోటిఫికేషన్ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన 37 మంది వెటర్నరీ వైద్యులకు రూ.5 వేల చొప్పున ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని రెడ్క్రాస్కు చెల్లించాలని ఆ వైద్యులను ఆదేశించింది. గురువారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీచేశారు. విచారణలో పిటిషనర్ల న్యాయవాదులు జడా శ్రవణ్కుమార్, ఆర్.వెంకటేష్ వాదనలు వినిపిస్తూ.. పశుసంవర్ధక సహాయకులకు విస్తృతాధికారాలు, వెటర్నరీ సర్జన్లకు ఉన్న అధికారాలు కల్పిస్తున్నారని, ఇది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులు నేరుగా వెటర్నరీ సర్జన్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందని జాబ్చార్ట్ చెబుతున్నప్పటికీ, వాస్తవరూపంలో సహాయకులకు విస్తృత అధికారాలు కల్పించారని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వర్రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది జి.వి.ఎస్.కిషోర్కుమార్ వాదనలు వినిపిస్తూ.. పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్కు, వెటర్నరీ చట్ట కౌన్సిల్ నిబంధనలకు సంబంధం లేదన్నారు. సర్వీసు సంబంధిత క్రమశిక్షణ చర్యలకే వెటర్నరీ కౌన్సిల్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులకు విస్తృతాధికారులు ఇవ్వడం లేదన్నారు. రైతులకు సహాయ సహకారాలు అందించడమే వారి ప్రధాన బాధ్యతని తెలిపారు. పోస్టుల భర్తీని అడ్డుకోవడమే లక్ష్యంగా పిటిషనర్లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఈ పోస్టుల భర్తీలో కేవలం ఈడబ్ల్యూఎస్ వర్గానికి మాత్రమేగాక, అన్ని వర్గాలకు స్థానం కల్పించామని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వెటర్నరీ వైద్యుల పిటిషన్ను కొట్టేసింది. -
ఎస్ఐ అభ్యర్థులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్లు వేయాలన్న తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎస్ఐ అభ్యర్థులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్లో కేసు పూర్వాపరాలను ప్రస్తావించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా దాఖలు చేసిన అఫిడవిట్ను ఉపసంహరించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. దిగొచ్చిన ఎస్ఐ అభ్యర్థుల తరఫు న్యాయవాది ప్రస్తుత అఫిడవిట్లను ఉపసంహరించుకుని, తిరిగి అఫిడవిట్లు దాఖలు చేస్తామని తెలిపారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐ నియామక ప్రక్రియకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల్లో భాగమైన ఎత్తు, ఛాతి చుట్టు కొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్గా కొలిచిన అధికారులు అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్ మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి ఎస్ఐ నియామకాల కోసం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను వెల్లడించవద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ నరేంద్ర ధర్మాసనం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తమని తేలితే రూ.లక్ష జరిమానా విధిస్తామని, అందుకు సిద్ధమైన అభ్యర్థులే ఎత్తు పరీక్షకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మందిలో 19 మంది తాము పరీక్షకు హాజరవుతున్నామని, రూ.లక్ష జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ లిఖితపూర్వకంగా కోర్టుకు వివరించారు. దీంతో హైకోర్టు స్వయంగా ఎత్తు పరీక్ష నిర్వహించింది. పోలీసుల కొలతలతో తాజా కొలతలు సరిపోవడంపై ఆ 19 మంది అభ్యర్థులపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.లక్ష జరిమానా చెల్లించాల్సిందేనంది. అంత స్థోమత తమకు లేదని, తాము పేదలే కాక నిరుద్యోగులం కూడానని వారు తెలిపారు. దీంతో ధర్మాసనం జరిమానా స్థానంలో సామాజిక సేవ శిక్ష విధిస్తామని తెలిపింది. చేసిన తప్పుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అíఫిడవిట్లు వేయాలని వారిని ఆదేశించింది. తాజాగా గురువారం ఈ అప్పీల్ విచారణకు రాగా, అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించిన ధర్మాసనం వాటిపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. -
మరో 1,890 స్టాఫ్ నర్స్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక మొదటిసారిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 1,890 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 5,204 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టుల కోసం రాత పరీక్ష కూడా పూర్తయింది. 40 వేల మందికి పైగా పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 1,890 స్టాఫ్ నర్స్ ఖాళీలను కూడా ప్రభుత్వం కలిపింది. దీంతో ఈ పరీక్ష ద్వారా మొత్తం 7,094 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి తెలిపారు. త్వరలో ఫలితాలు వెలువడతాయని ఆయన పేర్కొన్నారు. -
ఎస్సై రాత పరీక్ష ఫలితాలపై స్టే ఎత్తివేత
సాక్షి, అమరావతి: ఎస్సై అభ్యర్థుల ‘ఎత్తు’ వివాదం కీలక మలుపు తిరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తమ ‘ఎత్తు’ను సరిగా కొలవలేదంటూ పలువురు అభ్యర్థులు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎస్సై రాత పరీక్ష ఫలితాల వెల్లడిపై సింగిల్ జడ్జి విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. మంగళవారం కోర్టు హాలులో నిర్వహించిన ఎత్తు పరీక్ష ఫలితాలు, రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు గతంలో నిర్వహించిన ఫలితాలతో సరిపోలడంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై ఆరోపణలు చేస్తూ కోర్టుకొచ్చిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెచ్చి.. కోర్టు ముందుంచడంపైనా మండిపడింది. ఈ పత్రాల యథార్థతపై దర్యాప్తు చేయాలని గుంటూరు ఐజీ పాలరాజును ఆదేశించింది. ఆ వైద్యులను విచారించాలని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎత్తు, ఛాతీ కొలతలపై వివాదం ఎస్సై నియామక ప్రక్రియకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షల్లో భాగమైన ఎత్తు, ఛాతీ చుట్టుకొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్గా కొలిచిన అధికారులు తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్, మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్లో ఎత్తు విషయంలో అర్హులుగా ప్రకటించిన తమను తాజా నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించారని ఆరోపించారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఎస్సై నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు వెల్లడించవద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ చేశాయి. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ నరేంద్ర ధర్మాసనం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే రూ.లక్ష జరిమానా విధిస్తామని, అందుకు సిద్ధమైన అభ్యర్థులే ఎత్తు పరీక్షకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మందిలో 19 మంది పరీక్షకు హాజరవుతున్నామని, రూ.లక్ష జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపారు. రూ.లక్ష చొప్పున కట్టాల్సిందే కాగా.. న్యాయస్థానంలో కొలతలకు హాజరైన అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై తాము చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలితే రూ.లక్ష జరిమానా చెల్లిస్తామని రాసిచ్చిన నేపథ్యంలో ఆ మొత్తం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. తమకు అంత స్థోమత లేదని కొందరు అభ్యర్థులు చెప్పడంతో.. కోర్టు అంటే తమాషాగా ఉందా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. రూ.లక్ష చొప్పున చెల్లించాల్సిందేనని.. లేదంటే జైలుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. న్యాయవాది జడా శ్రవణ్కుమార్పై ఆగ్రహం మంగళవారం న్యాయస్థానంలోనే అభ్యర్థుల ఎత్తును ధర్మాసనం కొలిపించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కొలతలు సరిగానే ఉన్నాయని స్పష్టం చేసింది. అభ్యర్థుల తరఫు న్యాయవాది జడా శ్రవణ్కుమార్ స్పందిస్తూ.. పిటిషనర్లు నిబంధనల ప్రకారం ఉండాల్సినంత ఎత్తు ఉన్నారని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నవ్వుతూ కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టునే శంకిస్తారా? అంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు అంటే నవ్వులాటగా ఉందా అంటూ శ్రవణ్కుమార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తేలిగ్గా తీసుకుంటే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంది. -
నేడు కోర్టు సమక్షంలోనే ఎత్తు, ఛాతి కొలతలు
సాక్షి, అమరావతి: కోర్టును ఆశ్రయించిన ఎస్ఐ అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతలను మంగళవారం తమ సమక్షంలోనే తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు డిస్పెన్సరీలో పనిచేసే డాక్టర్కు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎత్తు విషయంలో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలితే కోర్టుకొచ్చి న ఒక్కో అభ్యర్థి ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలంటూ తాము ఇచ్చి న ఆదేశాలకు అంగీకారం తెలుపుతూ అందరి సంతకాలతో మెమో దాఖలు చేయాలని, మెమో దాఖలు చేస్తేనే తదుపరి విచారణ జరుపుతామని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చి ంది. 19 మంది సిద్ధంగా ఉన్నారు.. ఎస్ఐ నియామక ప్రక్రియలో భాగమైన దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టు కొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ కొలిచిన అధికారులు.. అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్ మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్లో అర్హులుగా ప్రకటించిన తమను ఎత్తు విషయంలో తాజా నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించారని పేర్కొన్నారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్.. ఎస్ఐ నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు వెల్లడించొద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు.. ధర్మాసనం ముందు అప్పీల్ చేశాయి. ఈ అప్పీల్ సోమవారం విచారణకు రాకపోవడంతో, అభ్యర్థుల తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఇందుకు జస్టిస్ నరేంద్ర నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించి సోమవారం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, హైకోర్టును ఆశ్రయించిన 24 మంది అభ్యర్థుల్లో 19 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎత్తు, ఛాతి కొలతలకు సంసిద్ధమై వచ్చారని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది(సర్విసెస్–3) వాదనలు వినిపిస్తూ మధ్యాహ్నం విచారణ గురించి తమకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్తో పాటు ఆరుగురు కమిటీ సభ్యులు కోర్టు ముందు హాజరవుతారని.. విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వ న్యాయవాది విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని పలుమార్లు అభ్యర్థించారు. చివరకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పిటిషనర్లు ఎత్తు విషయంలో అర్హత సాధించిన పక్షంలో వారికి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తగిన విధంగా పరిహారం ఇప్పిస్తూ ఆదేశాలిస్తామని ధర్మాసనం తెలిపింది. -
ప్రభుత్వోద్యోగ గణాంకాలతో వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్సైట్ www.telanganajobstats.in ను మంత్రి కె. తారక రామారావు మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వోద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్... దీనిపై వాస్తవ సమాచారాన్ని వెల్లడించేందుకే ఈ వెబ్సైట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యోగాల భర్తీ వివరాలను అందులో పొందుపరిచినట్లు వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతీ యువకులు ఈ వెబ్సైట్ను సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కోరారు. గత తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించామని, వాటిలో 1.60 లక్షలకుపైగా ప్రభుత్వోద్యోగాల భర్తీని పూర్తి చేశామని కేటీఆర్ తెలిపారు. జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. -
480 మంది సీనియర్ రెసిడెంట్స్ నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతోపాటు వచ్చే ఏడాది ప్రారంభించనున్న మరో ఐదు కళాశాలల్లో 480 మంది సీనియర్ రెసిడెంట్స్(ఎస్ఆర్) నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎస్ఆర్లను ఎంపిక చేయనున్నారు. వైద్య విద్య పీజీలో వచి్చన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్వోఆర్) ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. వీరికి రూ.70వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. మొత్తం 21 విభాగాల్లో 480 మంది సీనియర్ రెసిడెంట్స్ను నియమించనుండగా, అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్లో 75, అనాటమీలో 49, బయోకెమిస్ట్రీలో 39, జనరల్ మెడిసిన్లో 34 ఖాళీలు ఉన్నాయి. -
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు. -
3,282 వర్సిటీ పోస్టులకు నోటిఫికేషన్
రాజానగరం: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితో పాటు డిప్యుటేషన్పై మరో 70 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ తదితర ప్రతి పోస్టునూ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్సిటీల్లో ఇంత భారీ ఎత్తున ఖాళీల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. యూనివర్సిటీలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీకి సోమవారం వచ్చిన హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 18 వర్సిటీల్లో చదువుతున్న 12 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వారిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ వర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని హేమచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో సుమారు 2,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో బోధిస్తున్నరన్నారు. వీరిలో సుమారు వెయ్యి మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ (విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజుల నుంచి జీతాలు పొందేవారు) కింద పని చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం చేపట్టే పోస్టుల భర్తీ ప్రక్రియలోకి వీరు రారని, వారి విధులకు ఎటువంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన వారు ఓపెన్ రిక్రూట్మెంట్లో ఇతరులతో పాటే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. వారి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఇచ్చే 10 శాతం వెయిటేజీ మార్కులను ఏడాదికి ఒకటి చొప్పున లెక్కిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తారన్నారు. వారి నుంచి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఒక పోస్టుకు నలుగురిని ఎంపిక చేస్తారని చెప్పారు. వర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీని కోసం ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రెహమాన్ అధ్యక్షతన కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భర్తీ ప్రక్రియను ప్రకటిస్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసమే ఇంటర్న్షిప్ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం విద్యార్థుల్లో కొరవడుతోందనే ఉద్దేశంతోనే చదువుకునే సమయంలోనే ఇంటర్న్షిప్ చేయాలనే నిబంధన పెట్టామని ఆచార్య హేమచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేందుకు కలెక్టర్ చైర్మన్గా కమిటీలుంటాయన్నారు. వారు ఇచ్చిన నివేదిక మేరకు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయనే సమాచారాన్ని ఐఐసీ పోర్టల్లో ఉంచుతున్నామని వివరించారు. ఇవి కాకుండా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు వర్చువల్ విధానంలో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నమని చెప్పారు. ఏడాదికి 3.50 లక్షల మంది ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుండగా సుమారు 5 లక్షల అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. -
TCS Recruitment Scam: లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!
దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 16 మందిపై వేటు వేసింది. వారిని విధుల నుంచి తొలగించింది. కంపెనీతో వ్యాపారం సాగిస్తున్న ఆరుగురు విక్రేతలపై నిషేధం విధించింది. లంచాలు తీసుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నారనే స్కామ్లో వీరి పాత్ర ఉన్నట్లు సంస్థ గుర్తించింది. జూన్ 23న ప్రారంభమైన విచారణ నివేదిక ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మొత్తం 19 మంది ఉద్యోగులు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం అయినట్లు టీసీఎస్ తెలిపింది. అయితే వీరిలో 16 మందిని తొలగించారు. మరో ముగ్గురిని సంస్థ రీసోర్స్ మేనేజ్మెంట్ విధుల నుంచి బదిలీ చేసింది. దాంతోపాటు ఆరుగురు విక్రేతలు సహా వారి అనుబంధ యజమానులు కంపెనీతో ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొంత మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ ఏడాది జూన్లో ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఉద్యోగులకు భారీ ఎత్తున డబ్బు ముట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారానే ఈ సమాచారం బయటకు వచ్చింది. కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొన్నేళ్లుగా సిబ్బంది నియామకాలకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తులు కమీషన్ల ద్వారా దాదాపు రూ.100 కోట్లు సంపాదించవచ్చని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్కు లేఖలు అందాయి. దాంతో ప్రాథమిక దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కంపెనీ..జూన్ 23న సమగ్ర విచారణకు కమిటీని నియమించింది. సదరు కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించింది. దాని ఆధారంగానే కంపెనీ చర్యలు చేపట్టింది. ఈ స్కాంతో కంపెనీకి ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పాలనా విధానాల్లో మార్పులు చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కుంభకోణంలో మేనేజర్ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని గుర్తించినట్లు వెల్లడించింది. భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు రీసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలోని ఉద్యోగులను మారుస్తూ ఉంటామని తెలిపింది. ఉద్యోగులు సహా కంపెనీతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ సంస్థ నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పింది. హెచ్ఆర్ అండ్ టాలెంట్ అక్విజేషన్, రిసోర్స్ అలోకేషన్ గ్రూప్ ద్వారా 55 దేశాల్లో దాదాపు 6లక్షల మంది ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని, వర్క్ఫ్రంహోంకు స్వస్తి పలికినట్లు టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ గతంలో ఆఫర్ లెటర్లు ప్రకటించిన వారిని తప్పకుండా ఉద్యోగంలోకి తీసుకుంటుందని చెప్పింది. -
నేడు, రేపు ఎస్ఐ పోస్టులకు మెయిన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల భర్తీకోసం మెయిన్ పరీక్షలను శని, ఆదివారాల్లో నిర్వహించేందుకు పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల నిర్వహణపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ మెయిన్ పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపదని పోలీసు నియామక మండలి తెలిపింది. ఈ మేరకు వెబ్సైట్లో కూడా ప్రకటించింది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఇప్పటికే నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలపై నిర్ణయాన్ని తరువాత ప్రకటించనుంది. రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో.. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలుల్లో శని, ఆదివారాల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనుంది. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మెయిన్ పరీక్షలకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590, మహిళలు 3,603. పరీక్షలకు సంబంధించి సందేహాలుంటే హెల్ప్లైన్ నంబర్లు 9441450639, 9100203323కు ఫోన్ చేయవచ్చని, ఈమెయిల్: mail- slprb@ap.gov.in లో సంప్రదించవచ్చని సూచించింది. ఈ పరీక్షల వివరాలు.. అక్టోబరు 14: పేపర్–1 (డిస్క్రిప్టివ్ ) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పేపర్–2 (డిస్క్రిప్టివ్ ) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అక్టోబరు 15: పేపర్–3 (ఆబ్జెక్టివ్) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పేపర్–4 (ఆబ్జెక్టివ్) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు -
APPSC: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: వయసు మీరిన నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: తత్తరపాటు.. బిత్తర చూపులు! -
ఆ నినాదం తెలంగాణ ప్రజలది కాదు.. కేసీఆర్ది
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకా లన్నది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదని, అది కేసీఆర్ నినాదం మాత్రమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి అన్నారు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇక్కడి ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసమని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పీఏసీ కన్వీనర్ షబ్బీర్అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, మరో నేత మల్రెడ్డి రాంరెడ్డిలతో కలసి రేవంత్రెడ్డి మాట్లాడుతూ విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డు హామీలతో బీఆర్ఎస్ నేతలు కకావికలం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ‘పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టి, బిల్లు పేపర్లు చింపేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. నిజంగా బీఆర్ ఎస్కు రాజకీయ విజ్ఞత ఉన్నట్టయితే సోనియాను గౌరవంగా స్వాగతించి ఉండాల్సింది. కానీ, మేం మీటింగ్ పెట్టుకోగానే బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్లు ఏకమై కుట్రలు చేశాయి. సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాయి. సోనియా తెలంగాణకు రావడంతో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయి. వీళ్లంతా కలసి సభను అడ్డుకోవాలని చూశారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. సభ విజయవంతం కావడంతో ఇప్పుడు అందరూ చొక్కాలు చించుకుంటూ రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. తాము ప్రజలకు ఏం చేస్తామో చెప్పుకుంటూ వెళతామని, తమ ట్రాక్ రికార్డు ఏమిటో తెలిసిన ప్రజలు.. తగిన నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. తాము తెలంగాణ ఇచ్చామని, రైతులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేశామని, అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించామని, అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదల ఆరోగ్యాన్ని కాపాడామని, ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన చరిత్ర తమదని రేవంత్ పేర్కొన్నారు. ‘2004 నుంచి 2014 వరకు మేము అధికారంలో ఉన్న కాలంలో ప్రజలకు ఎలాంటి హామీలిచ్చామో, ఏమి నెరవేర్చారో చెపుతాం. 2014లో తెలంగాణ ఏర్పాటయిన తర్వాత బీఆర్ఎస్ ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారో వారినే చెప్పమనండి. మేం చర్చకు సిద్ధం’అని అన్నారు. బీఆర్ఎస్కు మిగిలింది ఇక 99 రోజులేనని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రాల అవసరాల్లో తేడాలుంటాయి తాటిచెట్టంత పెరిగితే.. మెదడు మోకాళ్లలోకి వస్తుందని రాష్ట్ర మంత్రి హరీశ్రావును చూస్తే అర్థమవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘ఇంటింటికీ ప్రణాళికలు మారినట్టే, రాష్ట్రాల అవసరాల్లో కూడా తేడాలుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలు, ఆదాయం ఆధారంగా పార్టీల కార్యాచరణ ఉంటుంది. జాతీయ పార్టీలు అయినంత మాత్రాన దేశమంతా ఒకే విధానం అమలు కాదు. అలా చేయడం వృథా అవుతుంది. ఏ రాష్ట్రంలో ఏ అవసరం ఉందో గుర్తించి, వాటిని నెరవేర్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది’అని అన్నారు. బుర్ర లేకుండా వితండ వాదం చేయవద్దని, వెర్రిమాటలు మాట్లాడితే ప్రజలు చీరి చింతకు కడతారని వ్యాఖ్యానించారు. ధరణిని రద్దు చేస్తామన్న వ్యాఖ్యలను రేవంత్ పునరుద్ఘాటించారు. ‘తెలంగాణలో భూమి సమస్యే ప్రధానమైంది. భూమి కోసమే సాయుధ పోరాటం జరిగింది. కేసీఆర్ పాలనను బొందపెట్టడం ధరణితోనే మొదలు పెడతాం. ధరణిని రద్దు చేసి మెరుగైన విధానం తీసుకువస్తాం’అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
ఖమ్మం: సైన్యంలో నియామకాలకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 8వ తేదీ వరకు ర్యాలీ జరగనుండగా, రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హాజరుకానున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోటీలు ప్రారంభించారు. తొలి రోజు 1,225 మంది అభ్యర్థులకు 926 మంది హాజరయ్యారు. వీరిలో వైద్య పరీక్షలకు 329 మంది అర్హత సాధించారు. పోటీలను కలెక్టర్ వీపీ గౌతమ్, ఆర్మీ అధికారి దాస్, డీవైఎస్వో టి.సునీల్కుమార్రెడ్డి పర్యవేక్షించారు. కాగా, అభ్యర్థులకు వసతి సౌ కర్యం కలి్పంచినట్లు చెబుతున్నా.. అవగాహన క ల్పించకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు రహదారుల వెంటే సేదదీరాల్సి వచ్చింది. -
70 శాతం మార్కులు వస్తేనే.! జేపీఎస్ రెగ్యులరైజేషన్లో సర్కార్ మెలిక
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమై, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపులో 70 శాతం మార్కులు వచ్చిన వారినే క్రమబద్దికరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ అధికారిక మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. జేపీఎస్ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని జేపీఎస్ల పనితీరును సమీక్షించి మార్కులు ఇస్తున్నాయని, కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో 70శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్రమబద్దికరిస్తూ నియామక ఉత్తర్వులు అందజేయాలని ఈ మెమో లో స్పష్టం చేశారు. ఒకవేళ 70శాతం మార్కులు రాకపోతే ఆయా జేపీఎస్లకు మరో ఆరునెలల గడువు ఇవ్వాలని, అప్పుడు మరోమారు పనితీరు మదింపు చేసి అప్పటి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలి జిల్లా స్థాయిలో ఆయా కమిటీల మదింపు నివేదికలను గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలని, పనితీరు సంతృప్తిగా ఉన్న జేపీఎస్లకు ఇచ్చే నియామక ఉత్తర్వులను కూడా ఇదే యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు అప్పగించారు. అర్హత పొందిన జేపీఎస్లకు ఇవ్వాల్సిన నియామక ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదాను కూడా ఈ మెమోతో జతచేసి జిల్లాలకు పంపారు. ప్రభుత్వ నిర్ణయం విడ్డూరం: టీపీఎస్ఏ పనితీరు మదింపులో 70శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే క్రమబద్దికరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నా యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) వ్యాఖ్యానించింది. డైరెక్ట్గా రిక్రూట్ అయి మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్లను అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్రెడ్డి, ఇ. శ్రీనివాస్లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీ ణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో అనేక గందరగోళాలకు తావిస్తోందని, తమ డిమాండ్ ప్రకారం అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయకుంటే పోరాటా నికి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
గురుకుల పరీక్షలకు 86.54 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9వేల ఉద్యోగాల భర్తీకి ఈనెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీఆర్ఈఐఆర్బీ అధికారులు పక్కాగా ఏర్పాటు చేశారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో ఈసారి కొత్తగా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో పరీక్షలు నిర్వహించారు. గురుకుల బోర్డు ద్వారా నిర్వహిస్తున్న మొట్టమొదటి సీబీఆర్టీ పరీక్షలను టీఆర్ఈఐఆర్బీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు తొలిరోజు సజావుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం కాగా మొదటి రోజున మూడు సెషన్లలో సగటున 86.54 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజున మూడు సెషన్లలో ఆర్ట్ టీచర్ పేపర్–1, క్రాఫ్ట్ టీచర్ పేపర్–1, మ్యూజిక్ టీచర్ పేపర్–1 పరీక్షలు జరిగాయి. ఈ మూడు పరీక్షలకు మొత్తంగా 10,920 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా... కేవలం 9,450 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఇచ్చారని ఆందోళన మంగళవారం ప్రారంభమైన పోటీ పరీక్షల్లో మొదటిరోజు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ప్రశ్నపత్రం పూర్తిగా ఆంగ్లంలో మాత్రమే ఇచ్చారు. నోటిఫికేషన్లో మాత్రం తెలుగు, ఆంగ్లంలో ప్రశ్నపత్రం ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు ఇలా చేయడమేమిటని పలుచోట్ల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. పైగా సరిపడా కంప్యూటర్లు లేకుండానే ఆఫ్లైన్కు బదులు ఆన్లైన్ విధానంలో పరీక్షలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల కేటాయింపుపై గందరగోళం.. ఆప్షన్ ఇచ్చిన జిల్లా, చుట్టుపక్కల జిల్లాలు కాకుండా 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళా, గర్భిణి, బాలింత అభ్యర్థులు పరీక్షలను రాయలేని పరిస్థితి నెలకొంది. ఇతర అభ్యర్థులు సైతం వేల రూపాయలు చార్జీలకోసం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు అభ్యర్థులు డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి పేపర్–1, పేపర్–2, పేపర్–3 రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సైతం ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో వందల కిలోమీటర్ల దూరం వెళ్లి రాయాల్సిన విధంగా కేంద్రాలు ఇచ్చారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై స్పందించిన ఎమ్మేల్యే
తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు
AP:మండుటెండను లెక్క చేయకుండా.. పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
లోక్సభ ఎలక్షన్స్.. నామినేషన్ దాఖలు చేసిన మిసా భారతి
అన్న రెండోసారి సీఎం గ్యారంటీ
ప్రముఖ కమెడియన్ మంచి మనసు.. ఏకంగా లక్షల సాయం
పోలింగ్ ఏజెంట్ పై టీడీపీ మూకల దాడి
ఓటు హక్కు వినియోగించుకున్న టాలీవుడ్ ప్రముఖులు
మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
చాబహర్ పోర్ట్ నిర్వహణకు ఒప్పందం
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement