కొత్త ఏడాది.. కొలువుల జోరు!
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం కొత్త ఆశలనే కాకుండా కొత్త ఉద్యోగాలను కూడా భారీగానే తెస్తోంది. అధిక సంఖ్యలో కొత్త కొలువులు రావడంతో పాటు వేతనాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. వచ్చే మూడు నెలల్లో భారత్లో కొత్త ఉద్యోగాలకు అనుకూల వాతావరణం ఉందని మ్యాన్పవర్గ్రూప్ పేర్కొంది. కొత్త ఉద్యోగాలకు అత్యంత ఆశావహమైన దేశాల్లో ఒకటిగా భారత్ అవతరించిందని వివరించింది. ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిగా ఉన్నప్పటికీ వచ్చే ఏడాది జనవరి-మార్చి కాలానికి భారత కంపెనీలు కొత్త ఉద్యోగాలివ్వాలని యోచిస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా మైనింగ్, నిర్మాణ, సేవా రంగాల్లో కొత్త ఉద్యోగాలు అధికంగా రానున్నాయని వివరించింది. ఐటీ రంగంలో కూడా కొత్త ఉద్యోగాలు భారీగానే రానున్నాయని, భారత, అంతర్జాతీయ ఐటీ కంపెనీలు కూడా కొత్త ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలోనే ఇవ్వనున్నాయని పేర్కొంది. అంతేకాకుండా వచ్చే ఏడాది తొలి 3 నెలల్లో జీతాలు పెంచాలని కూడా భారత కంపెనీలు యోచిస్తున్నాయని మ్యాన్పవర్ గ్రూప్ పేర్కొంది.
నవంబర్లో ఓకే..: మరో వైపు ఉద్యోగ నియామక కార్యకలాపాలు నవంబర్లో కాస్త పుంజుకున్నాయని నౌకరీడాట్కామ్ పేర్కొంది. గత ఏడాది నవంబర్ హైరింగ్తో పోల్చితే ఈ ఏడాది నవంబర్ హైరింగ్ 16% పెరిగిందని, వివిధ పరిశ్రమల్లో కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సానుకూలంగానే ఉన్నప్పటికీ, కాస్త బలహీనంగా ఉందని వివరించింది. ఐటీ రంగంలో హైరింగ్ జోరుగా ఉందని, చమురు, గ్యాస్, బ్యాంకింగ్ రంగాల్లో హైరింగ్ సానుకూలంగా ఉండగా, బీపీవో, వాహన రంగాల్లో మాత్రం ప్రతికూలంగా ఉందని వివరించింది. ఎన్నికలు వస్తుండటంతో భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మారుతున్నాయని వివరించింది. ఇక నగరాల పరంగా చూస్తే బెంగళూరు, చెన్నైల్లో హైరింగ్ వృద్ధి ఓ మోస్తరుగా ఉండగా, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైల్లో హైరింగ్ 2% తగ్గిందని పేర్కొంది.
భారత్ వైపు గ్లోబల్ కంపెనీల చూపు
కొత్త టెక్నాలజీలు, బిజినెస్ మోడళ్లు అందుబాటులోకి వస్తుండడంతో ప్రతిభగల ఉద్యోగులకు భార త్లో కొదవ లేదని అంతర్జాతీయ కంపెనీలు భావి స్తున్నాయని నౌకరీడాట్కామ్ తెలిపింది. అందుకే ఉద్యోగుల నియామకం కోసం అంతర్జాతీయ కంపెనీలు భారత్వైపు చూస్తున్నాయని వివరించింది.