-
ఒకటి కాదు, రెండు కాదు.. రూ.2.25 కోట్లు మోసపోయిన టెక్కీ
సాక్షి, బెంగళూరు: ఓవైపు రోజురోజుకీ టెకాల్నజీ కొత్త పుంతలు తొక్కుతుంటే..మరోవైపు ఆన్లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సెల్ఫోన్కు వచ్చిన లింకును ఓపెన్ చేయడం, తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మి సైబర్ వలలో చిక్కుకొని లక్షలు పోగొట్టుకున్నారు. ఈజీ మనీ కోసం అలవాటుపడుతున్న జనం తమ ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా పలువురు అమాయకులు మాత్రం నేరగాళ్ల చేతుల్లో ఇట్టే మోసపోతున్నారు. తాజాగా ఓ యువకుడు సైబర్ మోసగాడి మాటలు నమ్మి రూ. 2 కోట్లు కోల్పోయాడు. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని టెక్కీని భయపెట్టి రూ.2.25 కోట్లు దోచుకున్నారు సైబర్ వంచకులు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. అమృతహళ్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్కు వారం రోజుల క్రితం కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారి పేరుతో ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీ పేరుతో కొరియర్ వచ్చిందని, అందులో ఏడీఎంఏ మత్తు పదార్థాలు ఉన్నాయని, పార్శిల్ ఢిల్లీలో ఉందని, త్వరలో మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించాడు. ఈ పార్శిల్ మీది కాకుంటే యాంటి నార్కొటిక్ బ్యూరోకి ఫిర్యాదు చేయవచ్చని అందుకు స్కైప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు. యాప్లో చాట్ చేసిన అపరిచిత వ్యక్తి మీపై అక్రమ డబ్బు రవాణా కేసు కూడా ఉందని, కేసులు కొట్టివేయాలంటే డబ్బు ఇవ్వాలని, ఆ నగదును తిరిగి మీ ఖాతాకు బదిలీ చేస్తామని నమ్మబలికాడు. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ 8 దఫాలుగా రూ.2.25కోట్లు బదిలీ చేశాడు. వారం తరువాత తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్ను పొందేందుకు ట్రోలింగ్ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్ను ఎంచుకుంటారు. ట్రోల్స్లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. సైబర్ నేరాల నియంత్రణకు పోలీసులు కృత్రిమ మేధను వాడుతున్నారు. దీని ద్వారా అనుమానిత సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి బ్లాక్ చేయించి.. సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలనేది వారి ఆలోచన. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అండతో నేరాలకు పాల్పడుతున్నవారికి అదే ఆయుధంతో చెక్ పెట్టనున్నారు. ప్రత్యేక ముఠాలు ఏర్పాటు సైబర్ నేరాలు ఇటీవలి కాలంలో అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇవి సామాన్యులనే కాదు పోలీసులనూ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మోసాల బారిన పడకుండా ప్రజలను ఎన్ని రకాలుగా చైతన్యపరుస్తున్నా.. నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి మరీ.. ఇక్కడి వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్ కాల్తో బురిడీ కొట్టించి.. ఖాతాలో ఉన్న సొత్తు అంతా ఊడ్చేస్తున్నారు. తప్పుడు చిరునామాలతో సిమ్కార్డులు తీసుకొని, బోగస్ ఖాతాల్లోకి డబ్బు మళ్లించి.. కొల్లగొడుతున్నారు. ఒక్కో నేరగాడు వందల సంఖ్యలో సిమ్కార్డులు సమకూర్చుకుంటున్నాడు. సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా ముఠాలే ఉన్నాయి. నిరక్షరాస్యులు, నిరుద్యోగులను నమ్మించి.. బ్యాంకు ఖాతా వాడుకునేందుకు అనుమతి ఇస్తే మంచి కమీషన్ ఇస్తామని ఆశపెడుతున్నారు. బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బును ఈ ఖాతాల్లోకి, వాటిలో నుంచి వేరే ఖాతాలోకి మార్చి.. డ్రా చేసుకుంటున్నారు. కష్టమ్మీద ఆచూకీ కనిపెట్టినా.. నేరగాళ్ల ఆచూకీని పోలీసులు అతికష్టమ్మీద కనిపెట్టినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేరగాళ్లు వాడుతున్న సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి.. వాటిని రద్దు చేయించగలిగితే వారిని కట్టడి చేయచ్చని అధికారులు భావిస్తున్నారు. సిమ్కార్డు లేకపోతే మోసం చేసేందుకు కాల్ చేయలేరు. బ్యాంకు ఖాతా లేకపోతే మళ్లించిన డబ్బు దోచుకోలేరు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నేరగాళ్ల సిమ్కార్డులను అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 28,610 సిమ్కార్డులను బ్లాక్ చేయించగలిగారు. వాటిని వాడిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్ను గుర్తించి, వాటిని కూడా బ్లాక్ చేయిస్తున్నారు. దాదాపు 2 వేల బ్యాంకు ఖాతాలనూ రద్దు చేయించారు. తమకు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే ఇవన్నీ చేయించారు. ప్రక్షాళన షురూ.. సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను ముందుగానే గుర్తించేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)కు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయి. బాధితులకు వచ్చిన ఫోన్ కాల్స్, డబ్బు మళ్లించిన బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఇక్కడ నమోదవుతుంటాయి. ఈ సమాచారంతోపాటు బ్యాంకింగ్ డేటా ఆధారంగా అనుమానాస్పద ఖాతాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం కృత్రిమమేధ సాయం తీసుకోనున్నారు. ఇదీ చదవండి: బెంట్లీ కార్లను ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా..? చాలాకాలంగా పనిచేయని బ్యాంకు ఖాతాలోకి ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అయినా, ఒక ఖాతాలోకి దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి డబ్బు జమ అవుతున్నా అటువంటి వాటిని గుర్తించి, ఆయా బ్యాంకులను అప్రమత్తం చేయనున్నారు. అలాగే సిమ్కార్డుల విషయంలో సర్వీస్ ప్రొవైడర్లను ఇప్పటికే అప్రమత్తం చేశారు. -
పెట్టుబడుల పేరుతో టోకరా!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో ఎర వేసి, అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడులు పెట్టించి అందినకాడికి దండుకుంటున్న రెండు ముఠాలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ చెప్పారు. రెండు వేర్వేరు కేసులకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ డి.కవిత శుక్రవారం తెలిపారు. ఏసీపీ ఆర్జీ శివమారుతితో కలిసి బషీర్బాగ్లోని ఓల్డ్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. విదేశీ ట్రేడింగ్ పేరుతో వృద్ధుడిని... నగరానికి చెందిన ఓ వృద్ధుడు కొన్నేళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నారు. అతడికి కొన్నాళ్ల క్రితం టెలిగ్రాం ద్వారా ఇంటర్నేషనల్ కంపెనీలో ట్రేడింగ్ పేరుతో సందేశం వచి్చంది. ఆయన ఆసక్తి చూపడంతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసిన అవతలి వ్యక్తులు సౌత్ ఆఫ్రికాకు చెందిన ఉకుచుమ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ప్రైవేట్ లిమిడెట్ త్వరలో ఆన్లైన్ స్టాక్స్ ప్రారంభిస్తోందని చెప్పారు. అవి ఖరీదు చేయాలంటే ప్రత్యేక డీమ్యాట్ ఖాతా అవసరమని, సైప్రస్కు చెందిన ఎక్స్ప్రోమార్కెట్స్ అనే సెక్యూరిటీస్ సంస్థలో తెరవాలని సూచించారు. నగరవాసి అలానే చేసిన తర్వాత అమెరికా డాలర్ల రూపంలో పలు దఫాలు ట్రేడింగ్ చేయించారు. ఎప్పటికప్పుడు ఆయనకు లాభాలు వస్తున్నట్లు చూపించి వెబ్సైట్ డ్యాష్బోర్డ్లో అవి కనిపించేలా చేశారు. ఇలా 250 డాలర్లతో ప్రారంభించి 80,300 డాలర్ల (రూ.66.56 లక్షలు) వరకు పెట్టుబడి పెట్టించారు. ఈ మొత్తాన్ని బాధితుడు ఇండియన్ కరెన్సీ రూపంలో వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. నగదు తీసుకోవాలని భావించగా... డీమ్యాట్ ఖాతాలో నెగిటివ్ బ్యాలెన్స్ ఉందంటూ మరికొంత పెట్టుబడి పెట్టమన్నారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.నగేష్ దర్యాప్తు చేశారు. ఈ నేరాలు చేయడానికి అవసరమైన బ్యాంకు ఖాతాలను గుజరాత్కు చెందిన అరి్వంద్ కుమార్, ఘన్శ్యామ్సింగ్ సమకూర్చినట్లు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి విచారించిన నేపథ్యంలో వీరి బ్యాంకు ఖాతాల ఆధారంగా మరో రూ.4 కోట్ల స్కామ్ జరిగినట్లు, వీటిపై రాష్ట్రంలో రెండుతో సహా దేశ వ్యాప్తంగా ఐదు కేసులు నమోదైనట్లు తేల్చారు. ఆయా ఖాతాల్లో ఉన్న రూ.66 లక్షలు, హైదరాబాద్ వాసికి చెందిన రూ.35 లక్షలను సైబరాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. రూ.500 ఇచ్చి రూ.2.38 లక్షలు స్వాహా... నగరానికి చెందిన సంస్థలో ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తున్న యువకుడు మంచి ఉద్యోగం కోసం ప్రయతి్నస్తున్నాడు. అతడికి టెలిగ్రాం యాప్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ప్రకటన వచ్చింది. ఈయన స్పందించడంతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు ఫ్లైట్ టికెట్ బుకింగ్ టాస్్కలు చేయాలని చెప్పారు. ఇతడితో తమ యాప్లో వర్చువల్ ఖాతా ఓపెన్ చేయించి, తొలుత ఒక టికెట్ బుక్ చేయించారు. దీనికి సంబంధించి రూ.500 బోనస్ ఇచ్చారు. ఆపై ఇన్వెస్టిమెంట్స్ పేరు చెప్పి రూ.2.38 లక్షలు పెట్టుబడి పెట్టించి వర్చువల్ ఖాతా డ్యాష్బోర్డులో లాభాలు చూపారు. ఈయన డబ్బు తీసుకోవాలని భావిస్తే నెగిటివ్ బ్యాలెన్స్ కథ మొదలెట్టారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ ఎస్.నగేష్ నేతృత్వంలోని బృందం బోగస్ కంపెనీల పేర్లతో కరెంట్ బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన ముంబై వాసి మహ్మద్ షోయబ్ బబ్లూ ఖాన్ను పట్టుకుంది. ఇతడి నుంచి రూ.5 లక్షలు రికవరీ చేసి విచారించింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్కు చెందిన అబ్దుల్లా ఫారూఖ్ సూత్రధారిగా తేలడంతో అతడిని అరెస్టు చేసింది. వీరు ఈ బ్యాంకు ఖాతాల ఆధారంగా దేశ వ్యాప్తంగా 42 నేరాలు చేసి రూ.4.5 కోట్లు కాజేసినట్లు తేలింది. వీటిలో ఆరు కేసులు రాష్ట్రానికి సంబంధించినవే. హైదరాబాద్ నుంచి రూ.1.2 కోట్లు, సైబరాబాద్ నుంచి రూ.10 లక్షలు, రాచకొండ నుంచి రూ.65 లక్షలు వీళ్లు కాజేశారు. ఈ నిందితుల నుంచి పలు బ్యాంకు పాస్బుక్స్, డెబిడ్/క్రెడిట్ కార్డులు సిమ్ కార్డులు తదితరాలు స్వా«దీనం చేసుకున్నారు. -
రూ.49కే 48 కోడిగుడ్ల స్టోరీతో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం గ్యారెంటీ!
‘మేడం..మేడం మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశా భంగం.. నాలుగు డజన్ల కోడిగుడ్లు రూ.49కే అందిస్తాం’ అంటూ ఓ మహిళకు మెయిల్ వెళ్లింది. ఆ తర్వాత ఏమైందంటే? టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలని అటు పోలీసులు, ఇటు సోషల్ మీడియాలో సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ పలువురు మోసాల బారిన పడుతున్నారు. భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకున్న తర్వాత లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. తాజాగా, బెంగళూరులోని వసంత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఫిబ్రవరి 17న మెయిల్ వచ్చింది. అందులో కోళ్ల ఫారం నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ తక్కువ ధరకే కోడిగుడ్లను అందిస్తుంది. అందులో కోళ్ల పెంపకం, కోడిగుడ్ల డెలవరీ గురించి ఓ రెండు మూడు లైన్లు ఆకట్టుకునే కంటెంట్. ఇంకేముంది ఆ అడ్వటైజ్మెంట్ మెయిల్ చూసిన సదరు మహిళకు సంతోషం తట్టుకోలేకపోయింది. అమ్మో..! రూ.49కే నాలుగు డజన్ల కోడిగుడ్లా.. వెంటనే కొనేయాలి. లేదంటే ఆఫర్ మిస్సవుతుందంటూ ఆ మెయిల్ ఓపెన్ చేసింది. అందులో షాపింగ్ లింక్ను క్లిక్ చేసి నాలుగు డజన్ల కోడిగుడ్లను రూ.49కే కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. కానీ పేమెంట్ కాకపోగా.. ఆమె బ్యాంక్ వివరాలు, ఫోన్ నెంబర్, ఇతర వివరాలు కావాలంటూ పక్కనే గూగుల్ ఫోరం తరహాలో ఓ ఫోల్డర్ కనిపించడం, వెంటనే వివరాల్ని ఇవ్వడం అంతా క్షణాల్లో పూర్తి చేసింది. అనంతరం, క్రెడిట్ కార్డ్తో మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంది. వెంటనే తన క్రెడిట్ కార్డ్ సాయంతో రూ.49 చెల్లించింది. ఇంకేముందు సైబర్ కేటుగాళ్లు తమ పనిని మొదలు పెట్టారు. ఫలితంగా బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 10 రెట్ల డబ్బును అంటే రూ. 48,199 మాయం చేశారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం సదరు బ్యాంక్కి కాల్ చేసి క్రెడిట్ కార్డ్ను బ్లాక్ చేయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఆశకు హద్దుండాలి కదమ్మా..రూ.49కే 48గుడ్లు ఇస్తున్నామంటే? మీరెలా నమ్మారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వాట్సప్లో అందరికీ ఉపయోగపడే కొత్త ఫీచర్ వచ్చేసింది!
కోల్కతా కాళీఘాట్లో నివాసం ఉండే ఓ వ్యక్తికి అగంతకుడు ఫోన్ చేశాడు. ‘సార్.. సార్ మీకు కంగ్రాట్స్. థ్యాంక్యు..థ్యాంక్యు..ఇంతకీ విషయం ఏంటో చెప్పలేదు. ఏం లేదు సార్ మీరు గతంలో ఓ సంస్థలో పెట్టుబడి పెట్టారు కదా . ఆ సంస్థ దివాళా తీసింది. ఆ విషయం మీ క్కూడా తెలుసు. తాజాగా కోర్టు మీ పెట్టుబడిని తిరిగి ఇచ్చేయమని తీర్పిచ్చింది. కోర్టు తీర్పు ఉత్తర్వుల తాలుకూ న్యూస్ పేపర్లలో, టీవీల్లో కూడా వచ్చింది. కావాలంటే మీరే చూడండి.ఈ విషయం చెప్పాలనే మీకు ఫోన్ చేశాను. త్వరలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లో జమవుతుంది’ అని ఊరించాడు. కాకపోతే మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాల్ని చెప్పాల్సి ఉంటుందని కోరారు. నమ్మితేనే కదా మోసం చేసేది దీంతో సదరు వ్యక్తి ముందుగా అగంతకుడికి తన వ్యక్తిగత వివరాలు ఇవ్వాలా? వద్దా? అని కాస్త సంశయించాడు. ఆ తర్వాత.. ఆ ఇస్తే ఏముందిలే మన డబ్బులు మనకు వస్తున్నాయి కదా అని మనుసులో అనుకున్నాడు. మొత్తం వివరాల్ని అందించాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. వారం రోజుల తర్వాత సదరు పెట్టుబడి దారుడి అకౌంట్ నుంచి రూ.8లక్షలు మాయమయ్యాయి. పోలీసులు కొంత మొత్తాన్ని రికవరీ చేశారు. ఇదిగో ఈయన 8లక్షలు మోసపోతే గత ఏడాది వాటి విలువ వేల కోట్లకు చేరింది. వేల కోట్లకు సైబర్ నేరాలు నేషనల్ సైబర్క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నివేదిక ప్రకారం..2023 ఆర్ధిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు సుమారు రూ.5,574 కోట్ల సైబర్ నేరాలు జరిగాయి. 2022లో ఈ మొత్తం రూ.2,296 కోట్లుగా ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి. సైబర్ నేరాల నుంచి సంరక్షించేందుకు ఈ తరుణంలో సైబర్ నేరాల నుంచి యూజర్లను సంరక్షించేందుకు ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో టూల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ల లాక్ స్క్రీన్ నుంచి అనుమానిత ఫోన్ నెంబర్లను నేరుగా బ్లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ వాట్సప్ వెసులుబాటు కల్పిస్తుంది. బ్లాక్ చేస్తే వాటి నుంచి మీకు ఫోన్ కాల్స్, మెసేజ్లు రావు. మీరు కావాలనుకుంటే వాట్సప్కు రిపోర్ట్ చేయొచ్చు. -
‘డిజిటల్ అరెస్ట్’ గురించి తెలుసా..?
పదేళ్ల కిందట క్రైమ్ వేరు. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ వేరు. దానివల్ల కలిగే బాధ మారకపోయినా.. క్రైమ్ జరిగేతీరు, దాని విధానం, రూపం మారుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడులు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్లో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి షాపింగ్ చేయటం తెలిసిందే. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయటం కొత్త విషయమేమీ కాదు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్కు అందాల్సిన మెసేజ్లను మళ్లించి, డబ్బు లాగడం మామూలై పోయింది. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి, తీయని మాటలతో మభ్యపెట్టో, నగ్న చిత్రాలతో బెదిరించో ఖాతాలు ఖాళీ చేయటమూ చూస్తున్నదే. సంస్థల కంప్యూటర్ల మీద దాడిచేసి, వాటిని పనిచేయకుండా నిలిపివేయడం..డబ్బులు ఇస్తేనే విడుదల చేయటం మరో తరహా మోసం. అయితే తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ వంటి కొత్త నేరాలూ వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటే.. సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్న రోజుల్లో రోజుకో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ ఇలాంటిదే. ఇందులో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్ కార్డు, ఆధార్ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్ అరెస్ట్’. డిజిటల్ అరెస్ట్ కొత్త సైబర్ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల మనదేశంలో వెలుగులోకి వచ్చిన ఘటనలే దీనికి నిదర్శనం. నోయిడాకు చెందిన ఒక మహిళకు ఒకరు ఫోన్ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పాడు. ‘మీ ఆధార్ కార్డుతో సిమ్ కొన్నారు. దాన్ని ముంబయిలో మనీ లాండరింగ్ కోసం వాడుకున్నారు’ అని బెదిరించాడు. దర్యాప్తు అనేసరికే ఆమె హడలిపోయారు. దీన్ని గుర్తించిన నేరగాడు మరింత రెచ్చిపోయాడు. తదుపరి విచారణ కోసం కాల్ను ట్రాన్స్ఫర్ చేశాడు. అవతలి నుంచి మరో నేరగాడు తాను ముంబయి పోలీసు అధికారినని చెప్పి విచారణ ఆరంభించాడు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిరంతరాయంగా స్కైప్ కాల్ చేశాడు. అంతసేపూ ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. అతడి ఖాతాలోకి రూ.11.11 లక్షలను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక గానీ కాల్ కట్ చేయలేదు. చివరికి తాను మోసపోయానని ఆ మహిళ గుర్తించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. మరేం చేయాలంటే.. భారతీయ చట్టాల్లో ఇప్పటివరకూ డిజిటల్ అరెస్ట్ అనేదే లేదన్న సంగతి తెలుసుకోవాలి. ఎవరైనా దర్యాప్తు అధికారులమని చెప్పి, విచారణ చేస్తున్నామంటే భయపడొద్దు. వెంటనే కాల్ను కట్టేయాలి. మరోసారి ఆలోచించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లకు విషయాన్ని తెలియజేయాలి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు గానీ అధికారులు గానీ కాల్ చేసి బెదిరించటం, భయపెట్టటం చేయరు. కాబట్టి అలాంటి కాల్ వస్తే దాన్ని గుర్తించాలి. వారి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి. మరీ ఎక్కువగా బెదిరిస్తే అన్ని వివరాలతో నోటీసు పంపించమని అడగాలి. పోలీస్ స్టేషన్కు వచ్చి వారిని కలుస్తానని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య సమాచారాన్ని వెల్లడించొద్దు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో ముడిపడిన వివరాలను ఇవ్వద్దు. -
ఆరుగ్యారెంటీల లబ్దిదారులపై కన్నేసిన సైబర్ దొంగలు
-
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సైబర్ క్రైమ్ పోలీసులు
-
సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్!
పటాన్చెరు: సైబర్ వలలో పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.4.52 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని గ్రీన్విలాస్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ డిసెంబర్ 18వ తేదీన వాట్సాప్కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి వివరాలను నమోదు చేశాడు. సైట్ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్లు చేయడం మొదలు పెట్టాడు. తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు వ్యాలెట్లో చూపిస్తూ వచ్చారు. ఈ మేరకు బాధితుడు మొత్తం రూ. 4.52 లక్షలు చెల్లించాడు. చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం అమీన్పూర్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరెంట్ బిల్లు లింక్ క్లిక్ చేసి.. అదే విధంగా అమీన్పూర్ పరిధిలోని ఉసుకే బాయికి చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీన విద్యుత్ బిల్ కట్టలేదని ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా టీం వివర్ లింక్ను క్లిక్ చేశాడు. వెంటనే బాధితుడి ఫోన్ అపరిచిత వ్యక్తి ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడు ఖాతాలో ఉన్న రూ.1.51 లక్షల నగదును మాయం చేశారు. ముందుగా సదరు వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, బుధవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పర్సనల్ లోన్ ఇప్పిస్తానని.. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్గూడా సిద్ధార్థ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి గతేడాది మార్చి 24వ తేదీన పర్సనల్లోన్ ఇస్తామంటూ ఫోన్కాల్ వచ్చింది. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా బాధితుడు ముందుగా రూ.16 వేలు, తర్వాత రూ.40 వేలు వేశాడు. అపరిచిత వ్యక్తిని లోన్ ఇప్పించకపోవడంతో బాధితుడు తాను మోసం పోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్లో స్కూటీ కొందామని.. హత్నూర( సంగారెడ్డి): ఆల్లైన్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం కోన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెడ్ నవీన్ మంగళవారం ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టిన స్కూటీ వాహనాన్ని చూశాడు. అక్కడ ఉన్న నంబర్కు ఫోన్ చేయగా స్కూటీ ధర రూ.18,000 అని తెలిపాడు. వాట్సాప్కు ఆర్సీ పంపగా, అన్ని సరిగానే ఉన్నాయని నవీన్ అమ్మకందారుడి ఫోన్ పే నంబర్కు డబ్బులు పంపాడు. అయితే, ఆ డబ్బులు అకౌంట్లో కనిపించడం లేదని మరో రూ.13,000 పంపితే కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ డబ్బులు వేశాడు. ఇలా నాలుగు దఫాలుగా రూ.75 వేల వరకు పంపాడు. స్కూటీ కోసం ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానట్లు భావించిన యువకుడు వెంటనే 1903కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవి చదవండి: జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్లో -
కేటుగాళ్ల దెబ్బకు మోసపోయిన అవార్డ్ విన్నింగ్ తెలుగు హీరోయిన్
ప్రముఖ నటి మోసపోయింది. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి, నిమిషాల్లో లక్షలు పోగొట్టేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. సామాన్యులు, దీనిపై పెద్దగా ఐడియా లేనివాళ్లు మోసపోయారంటే అనుకోవచ్చు. కానీ మంచి సినిమాలు చేస్తూ అవార్డులు గెలుచుకున్న ఈ నటి కూడా కేటుగాళ్ల వలలో పడి బోల్తా కొట్టేసింది. ఇంతకీ ఏం జరిగింది? తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి పాటిల్. తెలుగులో 'నా బంగారు తల్లి' సినిమాలో లీడ్ రోల్ చేసి చాలా పేరు తెచ్చుకుంది. నంది అవార్డు కూడా గెలుచుకుంది. దీని తర్వాత టాలీవుడ్లో మరో మూవీ చేయలేదు. ప్రస్తుతానికి హిందీ, మరాఠీలో చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. అయితే తాజాగా ఈమెకి డిసెంబరు 28న దీపక్ శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫెడ్ ఎక్స్ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఈమె పేరుతో ఉన్న ఓ పార్సిల్, డ్రగ్స్తో తైవాన్లో పట్టుబడిందని అన్నాడు. పార్సిల్లోనే ఆధార్ కార్ట్ కాపీ ఉందని చెప్పాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) లక్షలు నష్టపోయింది! తన ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయ్యే అవకాశముందని భయపడిన అంజలి పాటిల్.. ముంబయి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని సంప్రదిస్తానని సదరు వ్యక్తితో చెప్పింది. ఇలా జరిగిన కాసేపటికే సైబర్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నానని బెనర్జీ అనే వ్యక్తి.. అంజలికి కాల్ చేశాడు. మీ ఆధార్ కార్డ్.. మూడు బ్యాంక్ ఖాతాలకు కనెక్ట్ అయ్యిందని, అవి మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కుని ఉన్నాయని కాస్త భయపెట్టాడు. ప్రొసెసింగ్ ఫీజ్ అని చెప్పి రూ.96,525 పంపాలని అంజలికి చెప్పగా, ఆమె వెంటనే ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం రూ.4,83,291 డబ్బు పంపాలని అన్నాడు. అలా డబ్బులు పంపేసిన కాసేపటికి నటి అంజలి పాటిల్.. తాను మోసపోయాననే విషయాన్ని గ్రహించింది. మొత్తంగా రూ.5.79 లక్షల వరకు అంజలి నష్టపోయింది. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా పేరున్న నటి.. సైబర్ కేటుగాళ్ల వలలో పడి మోసపోవడం హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: షూటింగ్లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు) -
ఈ – కామర్స్ వర్తక శకంలో...
వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే విపణిలో ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగదారులే. మారుతున్న కాలాన్ని బట్టి నేడు సామాన్యుడు సైతం అంతర్జాలంలో వస్తువులు, సేవలు కొనుగోలు చేస్తున్నారు. డిజిటల్ రూపంలో నగదు చెల్లింపుల లావాదేవీలు పెరుగుతున్నాయి. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉన్నా.. నేరస్థులకు నగదు దోచుకునేందుకు దగ్గరిదారిగా మారింది. గత ఏడాది మనదేశంలో 14 లక్షల సైబర్ నేరాలు జరగడం దీనికి తార్కాణం. ‘వినియోగదారుల రక్షణ చట్టం –2019’లో ‘ఈ–కామర్స్’ లావా దేవీలను స్పష్టంగా నిర్వచించడం జరిగింది. ‘డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ నెట్ వర్క్ ద్వారా డిజిటల్ ఉత్పత్తులతో సహా వస్తువులు లేదా సేవలను కొను గోలు చేయడం లేదా విక్రయించడం’ ఈ–కామర్స్గా నిర్వచించబడింది. ‘మీకు లాటరీలో బహుమతి వచ్చింద’నీ; ‘కారు, టీవీ, మోటార్ సైకిల్ గెలుచుకున్నార’ంటూ తప్పుడు ప్రకటనల ద్వారా సైబర్ నేరస్థులు రెచ్చి పోతున్నారు. నిరుద్యోగులే కాదు ఇందులో ఉన్నత చదువులు చదువుకున్న వైద్యులు, ఇంజనీర్లు సైతం చిక్కుకుంటున్నారు. ఇటీవల హైదరాబాదుకు చెందిన యువ వైద్యునికి రోజుకు రూ. 5 వేలు సంపాదించవచ్చంటూ రూ. 20 లక్షల రూపాయలు కాజేసిన ఘటన తెలిసిందే. గ్యాస్ ఏజెన్సీలు ఇస్తా మనీ; హోటళ్ళకు, సినిమాలకు రేటింగ్ ఇస్తామనీ, వ్యాపారంలో భాగ స్వామ్యం అనే ప్రకటనలతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక–2021 ప్రకారం చూస్తే, గత ఐదేళ్ళలో సైబర్ నేరాల సంఖ్య 141 శాతం పెరిగింది. న్యాయమైన వాణిజ్య పద్ధతుల్లో ఆర్థికంగా నష్టం చేకూర్చడం, వినియోగదారులను మోసం చేయడం ద్వారా వినియోగదారుల హక్కులకు ఆటంకం కలిగించే సంస్థలు/కంపెనీలు/వ్యాపారుల గురించి ప్రజలకు తెలియజెప్పడం కోసం భారత్ 1986 డిసెంబర్ 24న ‘వినియోగదారుల రక్షణ చట్టా’న్ని తెచ్చింది. ఆ రోజును ప్రతి ఏడాదీ ‘జాతీయ వినియోగ దారుల హక్కుల దినం’గా పాటిస్తున్నారు. భద్రత హక్కు, ఎంచుకునే హక్కు, సమాచారం పొందే హక్కు, వినే హక్కు, పరిహారం కోరుకునే హక్కు, వినియోగదారుల విద్య హక్కులను పరిరక్షించడానికీ, వినియోగదారుల ప్రయోజనాలకు హాని కలిగించే లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన విషయాలను నియంత్రించడానికీ 2020 జూలై 20 నుండి ‘సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ’ (సీసీపీఏ) స్థాపించబడింది. చెల్లుబాటు అయ్యే ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్ఐ) మార్క్ లేని వస్తువులను కొనుగోలు చేయకుండా వినియోగదారులను హెచ్చరిస్తూ ఈ సంస్థ రెండు భద్రతా నోటీసులను కూడా జారీ చేసింది. ఆన్లైన్ షాపింగ్ చేసే చాలా మంది వ్యక్తులు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు, లోపభూయిష్ఠ ఉత్పత్తులు, ఉత్పత్తుల నకిలీ డెలివరీలు, అసురక్షిత ఉత్పత్తులు, చెల్లింపు సమస్యలు, భద్రత– గోప్యతా సమస్యలు, ఏకపక్ష ఒప్పందాలు వంటి వాటి కారణంగా బాధితులుగా మారారు. కానీ, అధికార పరిధుల సమస్యల కారణంగా చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వల్ల బాధిత వినియోగదారులను రక్షించడంలో చట్టాలు విఫలమవుతున్నాయి. ఆన్లైన్ లావాదేవీలతో వ్యవహరించేటప్పుడు నేటి జనాభా ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ ఒప్పందాలను నియంత్రించేందుకు వినియోగదారుల రక్షణ చట్టం –2019లో అనేక అంశాలు చేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగదారుల రక్షణ చట్టం– 2019ని బలో పేతం చేసేందుకు పాఠశాలలో విద్యార్థులతో సుమారు 6,000 వినియోగ దారుల క్లబ్బుల ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారుల వ్యవహా రాలపై, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వారికి అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు ఈ చట్టంపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థి దశ నుండే చట్టంపై అవగాహన కలిగించేందుకు ‘మేము సైతం’ అనే పుస్తకాన్నీ, సుమారు 10 రకాలైన గోడపత్రాలను పౌర సరఫరాల శాఖ రూపొందించింది. తూనికలు కొలతల శాఖ వారు 3 రకాలైన గోడపత్రాలను రూపొందించడం జరిగింది. గోడపత్రాలనూ పాఠశాలతో పాటు గ్రామ/వార్డు సచి వాలయాలలో, పెట్రోలు బంకులలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరింతగా ఈ చట్టం పట్ల అవగాహన ప్రజలలో కల్పించేందుకు ‘మేలుకొలుపు’ అనే మాస పత్రికను కూడా పౌర సరఫరాల శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ చట్టం పట్ల ప్రజలందరికీ అవగాహన ఉంటే కొనుగోలు చేసే వస్తువులు / సేవలు / ఆన్లైన్ లావాదేవీలలో జరిగే నష్టాలకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది. దాసరి ఇమ్మానియేలు వ్యాసకర్త ఏపీ వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ ‘ 90599 90345 (నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం) -
48.47% పెరిగిన సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతంతో పోలిస్తే సైబర్ నేరాల నమోదు 48.47 శాతం పెరిగినట్టు తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించింది. ఆర్థిక నేరాలు, మోసాలు సైతం పెరిగినట్టు క్రైమ్ ఇన్ తెలంగాణ–2022 పుస్తకం వెల్లడించింది. తెలంగాణ సీఐడీ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన క్రైమ్ ఇన్ తెలంగాణ–2022 పుస్తకాన్ని సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్తో కలిసి డీజీపీ రవిగుప్తా మంగళవారం డీజీపీ కార్యాలయంలో విడుదల చేశారు. 2021తో పోలిస్తే తెలంగాణలో 2022లో ఆర్థిక నేరాల్లో 41.37 శాతం పెరుగుదల నమోదైందనీ, అదేవిధంగా మోసాలకు సంబంధించిన కేసుల్లోనూ 43.3 శాతం పెరుగుదల ఉన్నట్టు పుస్తకంలో వెల్లడించారు. నేషనల్ క్రైమ్రికార్డ్స్బ్యూరో(ఎన్సీబీఆర్) తరహాలోనే రాష్ట్ర సీఐడీలోని స్టేట్క్రైమ్ రికార్డ్స్బ్యూరో(ఎస్సీఆర్బీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నేరాల నమోదు, నేరాల సరళిని తెలియజేసేలా పూర్తి వివరాలతో కూడిన ‘‘క్రైం ఇన్ తెలంగాణ–2022’’పుస్తకాన్ని రూపొందించారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఈ తరహాలో క్రైం ఇన్ తెలంగాణ పుస్తకాన్ని రూపొందించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 10.25 లక్షల సీసీటీవీ కెమెరాలు రాష్ట్రంలో సీసీటీవీ కెమెరాల సంఖ్య 10,25, 849కు చేరినట్టు క్రైం ఇన్ తెలంగాణ–2022 పుస్తకం వెల్లడించింది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 1,74,205 సీసీటీవీ కెమెరాలను కొత్తగా ఏర్పాటు చేశారు. కాగా 2022లో నమోదైన 18,234 కేసులను ఛేదించడంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజీ కీలకంగా పనిచేసినట్టు పేర్కొంది. ఎన్సీఆర్బీ 2022 నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత భద్రమైన నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచినట్టు పుస్తకంలో పేర్కొన్నారు. భద్రమైన నగరాల్లో మొదటి స్థానంలో కోల్కతా, రెండో స్థానంలో పుణే నిలిచింది. కాగా, క్రైమ్ ఇన్ తెలంగాణ–2022 పుస్తకం రూపొందించడంలో కీలకంగా పనిచేసిన ఎస్సీఆర్బీ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు సీహెచ్ చెన్నయ్య, సర్దార్ సింగ్, ఇన్స్పెక్టర్లు ఎస్ శేఖర్రెడ్డి, ఎన్ నవీన్బాబు, హెడ్ కానిస్టేబుళ్లు పి కృష్ణకుమారి, ఎన్ హుస్సేన్లను డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీ మహేశ్భగవత్ అభినందించారు. -
వీడియోలు మార్ఫింగ్ చేసి.. అసభ్యకరమైన కామెంట్స్: రీతూ చౌదరి
కామెడీ షో జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్ డిజైనర్ వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా మరో చేదు అనుభవాన్ని రీతూ చౌదరి పంచుకుంది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేస్తున్న ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను రీతూ తన ఛానల్లో షేర్ చేసింది. అదేంటో తెలుసుకుందాం. రీతూ చౌదరి మాట్లాడుతూ.. 'నా ఫోటోలను, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేశారు. వీడియోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏకంగా నన్నే ట్యాగ్ చేసి పైశాచిక ఆనందం పొందారు. సోషల్ మీడియాలో నేను ఏం పెట్టినా చాలా దారుణంగా కామెంట్స్ చేశారు. ఇది జరిగిన దాదాపు ఐదు నెలలైంది. ఈ విషయాన్ని బయటికి చెప్పాలా? వద్దా? నాలో నేనే చాలాసార్లు బాధపడ్డా. బయటికి చెబితే ఏమవుతుందో అని భయపడిపోయా. ఈ వీడియో చేసేందుకు కూడా ఆలోచించా. కానీ చేయక తప్పడం లేదని' ఆవేదన వ్యక్తం చేసింది. మార్ఫింగ్ గురించి రీతూ మాట్లాడుతూ..'నేను ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటా. నేను, శ్రీకాంత్ బయటికి వెళ్లేటప్పుడు ఇలాంటి వీడియోలు చూసి అతనికి చెప్పాలా? వద్దా అని కుమిలిపోయా. ఇది చూసిన శ్రీకాంత్ నువ్వు కానప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పేవాడు. నన్ను ట్యాగ్ చేసేవరకు ఇలాంటి వీడియోలు చేశారని నాకు తెలియదు. కానీ చివరికీ నేను ఈ వీడియోలను సైబర్ పోలీసులకు ఇచ్చాను. మా నాన్న పోయాక తిరిగి కోలుకునేలోపే మళ్లీ ఇలా జరిగింది. కానీ నా వల్ల అవ్వలేదు. ఒక రోజు అమ్మకు ఈ విషయం చెప్పా. కానీ అమ్మ కూడా ఇలాంటివీ పట్టించుకోవద్దని చెప్పింది. మా అన్నకు కూడా చెప్పాను. నా కుటుంబం సపోర్ట్గా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ విషయంలో విష్ణుప్రియ అండగా నిలిచారు' అని తెలిపింది. ఆ తర్వాత.. 'నేను సోషల్ మీడియాలో ఏది పెట్టినా.. నాతో వస్తావా? వన్ నైట్కు వస్తావా? టూ నైట్స్కు ఎంత? అని మేసేజ్ చేసే వాళ్లు కూడా ఉంటారు కదా? అలాంటి వాళ్ల లింక్స్ కూడా నేను పోలీసులకు ఇచ్చా. ఆఫర్స్ లేకనే ఇలా చేసిందంటూ నన్ను ఎంతోమంది టార్చర్ చేశారు. అలాంటి వారినే ఇప్పుడు సైబర్ పోలీసులు పట్టుకున్నారు. అతన్ని నేను ఇంతకుముందు కూడా కలిశాను. ఎందుకిలా చేశావంటే నాకు తెలియదు మేడం అంటున్నారు. అతనికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారంట. అతని బావ వచ్చి చిన్నపిల్లాడు మేడం వదిలేయండని సిగ్గు లేకుండా అడుగుతున్నారని' రీతూ చెప్పుకొచ్చింది. ఇంకా ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారంటూ రీతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అబ్బాయిని ఆసిఫాబాద్ నుంచి పోలీసులు తీసుకొచ్చారని తెలిపింది. ఇలాంటి వీడియోలు చూసి నాకే.. అసలు ఈ లైఫ్ ఏంటని అనిపించిందని రీతూ వెల్లడించింది. ఇలాంటి పిచ్చివాళ్ల ఆట కట్టించేందుకు సైబర్ పోలీసులు ఉన్నారు. ఎవరూ భయపడకండి.. సూసైడ్ చేసుకునే వరకు తీసుకురాకండి.. ధైర్యంగా ముందుకెళ్లండి' అని రీతూ చౌదరి సలహా ఇచ్చింది. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. -
'ఫేక్ వెబ్సైట్స్' క్లిక్ చేశారో ఖతమే! వాటిని ఇలా గుర్తించండి!!
రాజన్న సిరిసిల్ల: సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ వెబ్సైట్స్ పేరుతో నగదు అపహరిస్తున్నారు. ఫర్నీచర్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ఇస్తున్నామంటూ ఫేక్ వెబ్సైట్లతో బురిడీ కొట్టిస్తున్నా రు. నమ్మి వాటిపై క్లిక్ చేస్తే చాలు మన ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. ఇటీవల జిల్లాలో సైబర్మోసాలు వరుసగా జరుగుతున్నాయి. సోషల్మీడియాలో వస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు! సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరికి క్రెడిట్కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి ఓ కాల్ వచ్చింది. బాధితులు అతనితో క్రెడిట్కార్డ్ నంబర్, ఓటీపీ షేర్ చేసుకోవడంతో రూ.77వేలు నష్టపోయాడు. సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరు ఇన్స్ట్రాగామ్లో ఓ యాడ్ చూసి అందులోని లింక్పై క్లిక్ చేయడంతో వాట్సాప్కు కనెక్ట్ అయ్యింది. దీంతో బాధితుడు వారు చెప్పినట్లు కొన్ని టాస్క్లు చేయడంతో రూ.40వేలు నష్టపోయాడు. కోనరావుపేట్ ఠాణా పరిధిలో ఒకరికి తక్కువకే వజ్రాలు ఇస్తామంటూ ఓ కాల్ వచ్చింది. లోన్ ఇస్తామని చెప్పిన వారు ముందుగా చార్జీలు రూ.27వేలు చెల్లించాలనడంతో పంపాడు. తర్వాత తను మోసపోయానని గుర్తించాడు. సిరిసిల్లటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరికి కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చింది. వారి మాటలు నమ్మి డెబిట్కార్డ్ వివరాలు, ఓటీపీ షేర్ చేసుకోవడంతో రూ.లక్ష వరకు మోసపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరు నర్సరీ వ్యాపారం కోసం ఫేక్ కస్టమర్ కేర్ సర్వీస్ను సంప్రదించాడు. తర్వాత కొత్త నంబర్ నుంచి కాల్ రావడంతోపాటు ఒక పేమెంట్ స్కానర్ను పంపించారు. బాధితుడు దాన్ని స్కాన్ చేయడంతో రూ.లక్ష నష్టపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బిజినెస్ ఎమోషనల్ అని చెప్పి టెలిగ్రామ్లో ఒక లింక్ పంపించారు. అందులో భాగంగా కొన్ని టాస్క్ లు చేస్తే డబ్బు వస్తుందని నమ్మబలికారు. వారు చెప్పినట్లుగా కొన్ని టాస్క్లు చేయడంతో కొంత డబ్బు పంపించారు. ఇందులో భాగంగా బాధితుడు రూ.96వేలు నష్టపోయాడు. సిరిసిల్ల టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బాధితుడు పార్ట్ టైం జాబ్ గురించి ఒక యాప్లో నమోదు చేసుకున్నాడు. ఇందులో భాగంగా వారు ఇచ్చిన వర్క్లో డాటా తప్పుగా ఎంటర్ చేశారని బెదిరించి బాధితుడి నుంచి రూ.55వేలు తీసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సోషల్మీడియాలో వచ్చే యాడ్స్ను నమ్మొద్దు. ఎస్బీఐ యోనో బ్లాక్ అయిందని, పాన్కార్డు అప్డేట్ చేయాలని వచ్చే మెస్సేజ్లను నమ్మొద్దు. ఆ మెస్సేజ్లలో వచ్చే లింక్స్పై అస్సలు క్లిక్ చేయొద్దు. సోషల్మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టవద్దు. మీ ప్రమేయం లేకుండా మీ సెల్ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పొద్దు. అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడగా గమనించాలి. అప్రమత్తతే అవసరం.. కొత్త ఫోన్ నంబర్ నుంచి కాల్ వస్తే ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్చేస్తే తిరిగి డబ్బులు పొందే అవకాశం ఉంది. డెబిట్కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు. – అఖిల్మహాజన్, రాజన్నసిరిసిల్ల ఎస్పీ ఇవి కూడా చదవండి: ఆన్లైన్ గేమ్స్తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!? -
నెట్టింట మారీచులు.. అంతా మనం గుర్తించేలోపే!
ఎక్కడ ఉంటారో..ఎలా ఉంటారో..ఎవరిని, ఎలా మోసం చేస్తారో కూడా తెలియదు. మోసం ఎలా జరుగుతుందో గుర్తించలేం. తెలిసే సరికి మోసపోతాం. ఒకసారి మోసపోయాక కోలుకోవడం కష్టం. ప్రస్తుతం మారుమూలలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యం లభించడంతో సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగింది. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కొన్ని ఉదంతాలు గమనిస్తే రామాయణంలో సీతాపహరణ సందర్భంగా బంగారులేడి వేషంలో మారీచుడు చేసిన మోసం గుర్తుకురాక మానదు. సాక్షి, కడప డెస్క్: సామాజిక మాధ్యమం.. ఇపుడు ప్రపంచాన్ని ఏకం చేస్తున్న ఏకైక మార్గం. అన్ని వర్గాలకు ఉపయోగపడే అంశాలను వ్యాప్తి చేస్తోంది. రోజురోజుకూ ఆధునికతను సంతరించుకుంటూ రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. ఇటీవలికాలంలో తరాల అంతరం లేకుండా సోషల్ మీడియాను అధికంగా వాడుతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ తదితర మాధ్యమాలలో తమ భావాలను పంచుకునేవారి సంఖ్య పెరిగింది. ప్రతి ఒక్కరికీ కచ్చితంగా సోషల్ మీడియా ఖాతా ఉంటోంది. అయితే సోషల్ మీడియా మంచికి ఎంత ఉపయోగపడుతోందో.. మరోవైపు వేరొకరి పరువు తీసేందుకు, బెదిరించి లేదా మోసం చేసి డబ్బు దండుకోవడానికి కూడా వేదిక అవుతోంది. చాలామంది యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదించుకోవడానికి సోషల్ మీడియాను మార్గంగా ఎంచుకున్నవారు తమ ఉనికి బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు రూపు, రూటు మార్చి మోసాలకు తెగబడుతున్నారు. నకిలీ ఐడీతో మోసానికి రెడీ తాము ఎంచుకున్న వారి ఫొటోతో ఫేస్బుక్ తదితర యాప్లకు నకిలీ ఐడీ రూపొందిస్తారు. అది అచ్చం అసలు ఖాతాలా భ్రమించేలా చేస్తారు. దాని నుంచి సంబంధిత వ్యక్తి బంధువులు, స్నేహితులకు డబ్బు పంపించమంటూ మెసేజ్లు చేసి మోసగిస్తారు. మరికొందరైతే ఖాతాల పాస్వర్డ్లను సంపాదించి, ఆ వ్యక్తి వివరాలు, ఫొటోలను తస్కరిస్తారు. వాటి ఆధారంగా అసభ్యకర మెసేజ్లు, ఇమేజ్లు తయారుచేసి బ్లాక్మెయిల్ చేస్తూ వివిధ రకాలుగా బెదిరిస్తున్నారు. మనీ రిక్వెస్ట్ ఫ్రాడ్ ఈ స్కామ్లో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా మనీ సెండ్ చేసేలా హ్యాకర్లు ప్రజలను మోసం చేస్తారు. వారు ఫేక్ మనీ రిక్వెస్ట్లు పంపడం లేదా చట్టబద్ధమైన సంస్థల వలె నటించడం వంటి వ్యూహాలు పన్నుతారు. యూపీఐ మనీ రిక్వెస్ట్ ఫ్రాడ్కి గురైతే ఆర్థిక నష్టాలు, భద్రతా సమస్యలు తలెత్తుతాయి. బ్యాంక్ అకౌంట్ డీయాక్టి వేషన్ స్కామ్ స్కామర్లు అనుమానాస్పద యాక్టివిటీ వల్ల బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేట్ అయిందని సంప్రదిస్తారు. సాధారణంగా ఆటోమేటిక్ కాల్స్ లేదా టెక్స్ట్ మెసేజ్లతో ప్రారంభిస్తారు. స్పెసిఫిక్ నంబర్కు కాల్ చేయమని లేదా ఐడెంటిటీ వెరిఫికేషన్కి లింక్పై క్లిక్ చేయమని కోరుతారు. పర్సనల్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అందిస్తే బ్యాంకు అకౌంట్లో డబ్బు మాయమవుతుంది. ఓటీపీ స్కాం ఓటీపీ స్కాంలో టూ–ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ కోసం ఉపయోగించే వన్–టైమ్ పాస్వర్డ్లను(ఓటీపీ) ప్రజల నుంచి తెలుసుకునేందుకు వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. మోసగాళ్లు ఆథరైజ్డ్ ఎంటీటీస్గా నటించడం, హానికరమైన లింక్లను పంపడం లేదా బ్యాంకుల వద్ద బాధితులుగా నటించడం వంటి వ్యూహాలను ఉపయోగిస్తారు. స్పందించినవారి ఖాతాల నుంచి డబ్బు లాగేస్తారు. లైక్, సబ్స్క్రైబ్ అంటూ.. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి చెందిన ఎస్.జాబీర్(యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల గత ఆది, సోమవారాల్లో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇంతలో ఎస్బీఐ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో నకిలీ ఎస్బీఐ లింక్ ప్రత్యక్షమైంది. ఇది నమ్మిన జాబీర్ అచ్చు ఎస్బీఐ యాప్ను తలపించిన ఆ నకిలీ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. బ్యాంకు అకౌంట్కు సంబంధించిన వివరాలతో లాగిన్ అయ్యారు. వెంటనే ఆయన అకౌంట్లోని నగదు మాయమైంది. యాప్ డబుల్తో మోసం చేశారని గ్రహించిన ఆయన తనతో పాటు మరికొందరు ఉపాధ్యాయులు కూడా ఇలాగే మోసపోయారని గుర్తించారు. వారితో కలిసి వెళ్లి రాయ చోటి స్పెషల్ బ్రాంచ్ సీఐ సత్యనారాయణకు తాము మోసపోయిన విధానాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ డీపీ(డిస్ప్లే పిక్చర్)తో సైబర్ మోసగాళ్లు మోసగించే యత్నం చేశారు. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఆయన పరిచయస్తులతో కాంటాక్ట్లోకి వెళ్లారు. క్షేమసమాచారాలు అడిగినట్లుగా మెసేజ్లు పంపసాగారు. దీంతో వీసీ అప్రమత్తమయ్యారు. మోసగాళ్ల మెసేజ్లకు ఎవరూ స్పందించవద్దని రెండు రోజుల క్రితం ఆయన వైవీయూ గూపుల్లో, వ్యక్తిగతంగా అందరికీ మెసేజ్లు పంపారు. కరోనా ఉధృతి వేళ ఇంటి నుంచి పనిచేసే విధానానికి బాగా ఆదరణ పెరిగింది. దీంతో వర్క్ ఫ్రం హోం కొలువుల కోసం అంతర్జాలంలో అన్వేషించడం ఎక్కువైంది. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు ‘తక్కువ పని గంటలు... ఎక్కువ సంపాదన’అంటూ డిజిటల్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీరిని ఎవరైనా సంప్రదిస్తే డేటా ఎంట్రీ, ప్రముఖుల సామాజిక మాధ్యమ ఖాతాల్లో వచ్చే పోస్టులను లైక్, షేర్ చేయడంవంటి పనులు ఉంటాయని చెబుతున్నారు. పని సులభమని, వేలల్లో సంపాదించుకోవచ్చని చెబుతూ నకిలీ వెబ్సైట్లతో ముగ్గు లోకి దించుతున్నారు. మీకు అధిక ఆదాయం కావాలంటే కొంత పెట్టుబడి పెట్టాలంటూ వల విసురుతున్నారు. వారి నుంచి డబ్బులు వచ్చిన తరువాత వెబ్సైట్లను మూసేస్తున్నారు. ఆన్లైన్ ఆఫర్లతో జనాన్ని ముంచేస్తున్న 36 లక్షల వాట్సాప్ ఖాతా లను నిషేధించామని కేంద్ర ఐటీ మంత్రి ఆ మధ్య ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. -
సైబర్ వల నుంచి తప్పించుకోవాలంటే ఇలా చెయ్యండి చాలు!
విజయవాడ: విజయవాడ సూర్యారావుపేటకు చెందిన యువకుడు పీజీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంతగా వ్యాపారం చేయాలన్నది అతని కల. ‘ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసి నెలనెలా రూ.లక్షల్లో సంపాదించొచ్చు’ అంటూ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అతడిని ఆకట్టుకుంది. మెసేజ్ పంపిన వారితో చాటింగ్లో పరిచయం పెంచుకున్నాడు. ‘కొన్ని వెబ్ లింక్లు ఓపెన్ చేసి టాస్క్లు పూర్తి చేస్తే వెంటనే నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని’ సైబర్ నేరగాళ్లు అతడిని నమ్మించారు. రిజిస్ట్రేషన్కు కొంత నగదు చెల్లించి తొలి రెండు టాస్క్లు పూర్తి చేయగానే నగదు చెల్లించారు. ఆ తరువాత ఆ యువకుడు మరింత ఉత్సాహంతో కొత్త టాస్క్లు కొని పూర్తిచేశాక అతని వ్యాలెట్లో డబ్బు కనిపించినా విత్డ్రా కాకపోవడంతో సదరు వ్యక్తులను వాట్సాప్, టెలిగ్రాం చాటింగ్తో సంప్రదించాడు. ‘ఏదో ఎర్రర్ వస్తుంది.. మీరు టాస్క్లు పూర్తి చేయండి.. నగదు ఎక్కడికీ పోదు’ అని నేరగాళ్లు అతడిని భరోసా ఇచ్చారు. వారిని నమ్మి విడతల వారీగా రూ.80 లక్షలు చెల్లించాక మోసపోయానని గుర్తించిన ఆ యువకుడు విజయవాడ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ నేరస్తుల బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. మోసం చేసేది ఇలా.. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఓటీపీతో మోసాలకు తోడు టెలిగ్రాం, వాట్సాప్ల సాయంతో ఉద్యోగ, వ్యాపార ప్రకటనతో నిరుద్యోగులు, చిరుద్యోగులు, మధ్యతరహా వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. పలు మార్గాల ద్వారా ప్రజల ఫోన్ నంబర్లను సేకరిస్తున్న నేరగాళ్లు ముందుగా వాట్సాప్/ టెలిగ్రాంలో ఆకర్షణీయమైన మెసేజ్ పంపుతారు. ఇంట్లో కూర్చుని, ఖాళీ సమయంలో పని చేస్తే కుటుంబ ఖర్చులౖకైనా వస్తాయన్న ఆశతో ఉన్న వారిని సైబర్నేరగాళ్లు చాటింగ్తో ముగ్గులోకి దింపుతారు. చాటింగ్కు నంబర్లు కనిపించని టెలిగ్రాం యాప్నే నేరగాళ్లు ఉపయోగిస్తారు. వర్క్ ఎలా చెయ్యాలి, ఇన్స్టా, ఫేస్బుక్, యూ ట్యూబ్ వీడియోలకు ఎలా లైక్లు కొట్టాలి, ఎలా షేర్ చేయాలి, ఎంత డబ్బు వస్తుంది.. అనే విషయాలను చాటింగ్లోనే వివరిస్తారు. మచ్చుకు కొన్ని వీడియోలను వాళ్లే పంపించి టాస్క్లు ఇస్తారు. నమ్మించేందుకు తొలి రోజే కొంత నగదును వారి బ్యాంక్ ఖాతాలో వేస్తారు. రెండో రోజూ కొన్ని టాస్క్లు ఇచ్చి నగదు చెల్లిస్తారు. ఆ తరువాత నుంచి ఎక్కువ డబ్బు సంపాదించాలంటే పేరున్న కంపెనీలు ఆన్లైన్లో విక్రయించే వస్తువులకు రేటింగ్ ఇవ్వాలని, ఈ పని రిజిస్ట్రేషన్ కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. వెబ్సైట్ వాలెట్లో డిపాజిట్ సొమ్ము, ప్రాఫిట్, విత్డ్రా వివరాలు నిత్యం స్క్రీన్పై కనపడుతూనే ఉంటాయని నమ్మబలుకుతారు. సొమ్ము డిపాజిట్ చేసి టాస్క్లో దిగిన తరువాత.. చెల్లించిన సొమ్ముకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కలిపి ప్రాఫిట్ బాక్స్లో చూపిస్తారు. అయితే ఆ డబ్బు విత్డ్రా అవ్వదు. ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే మరి కొంత నగదు చెల్లించి రెండో టాస్క్ పూర్తి చేయాలని నమ్మిస్తారు. ప్రాఫిట్ బాక్స్లో ఉన్న నగదు కంటే డిపాజిట్ చేయాల్సిన నగదును తక్కువగానే చెబుతారు. ప్రాఫిట్ బాక్స్లో ఎక్కువగా ఉన్న నగదును చూసి ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లకు బాధితులు నగదు చెల్లిస్తూనే ఉంటారు. అవతలి వ్యక్తి మాయగాడని తెలుసుకునే లోపు రూ.లక్షల్లో మోసపోతారు. ఆ తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న మోసాలు.. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నెలకు పది నుంచి 15 కేసులు నమోదు చేస్తున్నాం. ఇటీవల ఓ యువతి రూ.10 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేసింది. సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతోనే ప్రజలు మోస పోతున్నారు. 'ఉద్యోగం ఇచ్చే వ్యక్తి నెలకు జీతం ఇస్తాడే కానీ మన నుంచి ముందుగా డబ్బులు తీసుకోడనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి.' ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాలతో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ క్రైం పోలీస్స్టేషన్, విజయవాడ ఇవి చదవండి: కడపలో తల్లీతనయుల అదృశ్యం! -
షాకింగ్ ఫ్రాడ్: సీనియర్ టెకీని ఏకంగా రూ. 3.7 కోట్లకు ముంచేశారు
ఛాన్స్ దొరికితే చాలు.. కాదు కాదు.. సందు దొరకబుచ్చుకుని మరీ సేబర్ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా దిగ్గజ ఐటీ కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్కు టోకరా ఇచ్చి మూడు కోట్లు దోచేసిన వైనం కలకలం రేపింది. పోలీసుల అధికారుల పేరుతో ఇన్ఫోసిస్ ఉద్యోగిని భయపెట్టి, బెదిరించి నిలువునా ముంచేశారు. నకిలీ పోలీసు స్టేషన్ సృష్టించిన ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని వైట్ఫీల్డ్లోని ఇన్ఫోసిస్ ఉద్యోగి ఇచ్చిన పోలీసుల ఫిర్యాదు మేరకు సైబర్ నేరగాళ్లు అతడిని టార్గెట్గా చేసుకున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), సీబీఐ, ముంబై పోలీసుల అధికారుల అవతారమెత్తారు. మనీలాండరింగ్తో సహా పలు నేరాలకు పాల్పడ్డావంటూ తీవ్రంగా బెదిరించారు. అరెస్టుకు సిద్ధమని హెచ్చరించారు. నవంబర్ 21న ఫోన్ చేసిన మోసగాళ్లు మనీలాండరింగ్తో పాటు అనేక నేరారోపణల కింద, అరెస్టు చేస్తామని బెదిరించారు. ట్రాయ్ అధికారిగా పరిచయం చేసుకున్న కేటుగాడు పేరు మీద ఉన్న సిమ్కార్డు అక్రమ ప్రకటనల కోసం వినియోగిస్తున్నారని తెలిపాడు. షాక్ తిన్న ఇన్ఫోసిస్ టెకీ ఆ నంబర్ తనది కాదని చెప్పాడు. ఆధార్ కార్డ్ మీద సిమ్ కార్డు రిజిస్టర్ అయిందన్నాడు. ఆ మరునాడు తాను ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారినని మరొకడు ఫోన్ ఏశాడు. ఢిల్లీ, ముంబైలలో ఇదే కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఇందులో ఒకటి ముంబైలోని వకోలా పోలీస్ స్టేషన్లో, మరొకటి ముంబైలో మనీలాండరింగ్ కేసులని మ్మ బలికాడు తాను చెప్పిన మాట వినకుంటే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అంతేకాదు వీడియో కాల్ చేసిన మోసగాళ్ళు అతడిని మరింత భయపెట్టారు. వీడియో కాల్లో నకిలీ పోలీస్ స్టేషన్, నకిలీ పోలీసులు, ఐడి కార్డులు ..ఇలా పెద్ద తతంగమే చేశారు. ఫిర్యాదు (తప్పుడు) కాపీని కూడా చూపించారు. దీంతో అయోమయం, గందరగోళానికి గురైన టెకీ మోసగాళ్లు చెప్పినట్లే చేశాడు. తన ఖాతాలో ఉన్న రూ.3.7 కోట్లను మోసగాళ్లకు వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. ఇదంతా నవంబర్ 21 నుంచి 23 మధ్య జరిగింది. ఈ షాక్ నుంచి తేరుకున్నాక మోసపోయానని గ్రహించాడు. దీంతో నవంబర్ 25న పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 3 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినందున కేసును క్రిమినల్ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి బదిలీ చేయనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. అక్రమార్కుల బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. -
‘రేటింగ్’ పేరుతో చీటింగ్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారని, గూగుల్ మ్యాప్లోని ప్రాంతాలకు రేటింగ్ ఇవ్వాలంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరించారు. ఇందుకోసం ఏకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఐటీ) నుంచి పంపుతున్నట్టుగా నకిలీ ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. వారు పంపే లింక్లపై క్లిక్ చేసి అందులో వచ్చే గూగుల్ మ్యాప్లో వారు చెప్పిన ప్రాంతానికి రేటింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒక్కో రేటింగ్కు రూ.150 ఇస్తామని, ఇలా రోజుకు కనీసం రూ.5 వేల వరకు సంపాదించవచ్చని ఊదరగొడుతున్నారు. ఎవరైనా ఇది నిజమని నమ్మితే ఒకటి, రెండుసార్లు డబ్బులు పంపి..ఎదుటి వ్యక్తికి నమ్మకం కుదిరిన తర్వాత అసలు మోసానికి తెరతీస్తున్నా రు. బ్యాంకు ఖాతాల వివరాలు..ఆధార్, పాన్కార్డు వివరాలు సేకరించడం..లింక్లో ఓటీపీ నమోదు చేయాలని చెబుతూ ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే తరహాలో కొన్ని నెలల క్రితం సోమాజిగూడకు చెందిన ఒక యువకుడు గూగుల్ మ్యాపింగ్ రేటింగ్ స్కాంలో చిక్కి రూ.74 వేలు పోగొట్టుకున్నాడని తెలిపారు. -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్.. ఇద్దరి అరెస్ట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలో గేమ్ చేంజర్ సినిమాలోని ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లీక్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు. అయితే దీపావళి సందర్బంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి తొలి సాంగ్ను విడుదల చేయనున్నారు. ఈ పాటను దీపావళికి గ్రాండ్గా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ కనిపించనుండగా.. అంజలి, సముద్రఖని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
దుకాణంలో మాయమాటలతో.. ఫోన్పే మోసం.. ఏమైందో తెలస్తే షాక్!
సాక్షి, ఖమ్మం: పట్ట పగలు సినీ ఫక్కీలో దుండగుడు డబ్బులు కాజేశాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితుడు విస్తుపోయాడు. బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని కిరాణా దుకాణానికి ఒడిశాకు చెందిన వ్యక్తి సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. తన ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయానని, ‘మీ’ ఫోన్ ఇస్తే సరుకుల లిస్ట్ను ఇంట్లో వారిని అడిగి కనుక్కుంటానని నమ్మించాడు. దీంతో సదరు దుకాణ యజమాని ఫోన్ను సదరు వ్యక్తికి ఇచ్చి దుకాణంలో సరుకులు కడుతున్నాడు. ఇదే అదునుగా ఫోన్ మాట్లాడినట్లు నటించి ఫోన్ పే ద్వారా (పాస్వర్డ్ సులభంగా ఉండటంతో) రూ.72,500 కాజేశాడు. అనంతరం సదరు మోసగాడు సరుకుల లిస్టు ఇంటి దగ్గర ఉందని, వెంటనే వెళ్లి తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తరువాత దుకాణ యజమాని ఫోన్ను పరిశీలిస్తే ఫోన్పే ద్వారా డబ్బులు పంపినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే మోసపోయినట్లు గ్రహించి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందులోని పూర్తి వివరాలు పరిశీలిస్తే ఒడిశాకు చెందిన వ్యక్తిగా చూపిస్తోందని బాధితుడు గెల్లా వాసు వివరించారు. -
ఫ్రీజ్ చేసిన అకౌంట్లలో రూ.100 కోట్లు
గచ్చిబౌలి : రాష్ట్రవాప్తంగా సైబర్ క్రైం పై వచ్చిన ఫిర్యాదులతో ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో రూ.100 కోట్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బాధితులకు అందజేస్తామని సైబర్ క్రైం బ్యూరో ఎస్పీ విశ్వజిత్ కంభంపాటి తెలిపారు. శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్లో సైబర్క్రైం బాధితులకు రికవరీ నగదును సీపీ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వజిత్ మాట్లాడుతూ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. త్వరగా ఫిర్యాదు చేస్తే ఆ నగదు వెళ్లిన అకౌంట్ను బ్లాక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. ఆలస్యమైతే నగదు చేతులు మారే అవకాశం ఉందన్నారు. దీంతో బాధితులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును తీసుకున్నప్పుడు ఆలస్యం అయితే క్రిప్టో కరెన్సీకి మళ్లించే అవకాశం ఉందన్నారు. అలా చేసిన తరువాత రికవరీ చేసే వీలుండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైం ఫిర్యాదులతో ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో రూ.100 కోట్ల నగదు ఉందని, అన్ని జిల్లాల పోలీసు అధికారులకు సమాచారం అందించామని, త్వరలోనే బాధితులకు అందజేయనున్నట్లు తెలిపారు. డబ్బులు ఇస్తామని ఎరవేసి పాస్ బుక్, డెబిట్ కార్డు, లింక్ చేసిన ఫోన్ నెంబర్ తీసుకుని వేరే అకౌంట్లు తెరచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, అలా సహకరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగన్వార్ మాట్లాడుతూ పెట్టుబడి పేరిట మోసాలకు పాల్పడిన కేసులే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆన్లైన్ వెబ్సైట్స్, మెసెంజర్, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. ఇన్వెస్ట్మెంట్ పేరిట మొదట అదనంగా కొంత కలిపి ఇచ్చి నమ్మకం కలిగిస్తారని తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయగానే కంటాక్ట్లో లేకుండా పోతారని వివరించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మూడు, నాలుగు నెలలు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించినట్లు తెలిపారు. 44 కేసుల్లో రూ.2,23,89,575 రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. 1930 కాల్ సెంటర్ కేవలం ఫిర్యాదును మాత్రమే స్వీకరిస్తారని ఆ తర్వా కేసు ఏ పోలీస్ స్టేషన్కు కేటాయిస్తారో మెసేజ్ వస్తుందన్నారు. కేసు స్టేటస్ను ఆయా పోలీస్ స్టేషన్లలోనే అడగాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైం డీసీపీ రితిరాజ్, ఏసీపీ, సీఐలు పాల్గొన్నారు. డ్రగ్స్ పేరిట బ్లాక్ మెయిల్ మీరు తైవాన్కు పంపుతున్న ఫెడెక్స్ ఫార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి. ఫోన్ నెంబర్, ఆధార్కార్డు వివరాలతో మీ కు ఫోన్ చేశాం. మేము సీబీఐ అధికారులం మీ పై కేసు నమోదవుతుందని ఓ మహిళను బెదిరించి రూ.10.96 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు అకౌంట్ను ఫ్రీజ్ చేసిన పోలీసులు మొత్తం నగదును రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. పెట్టుబడి పేరిట మోసం గాజుల రామారం ప్రాంతానికి చెందిన యువకుడు మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. మెసేంజర్లో ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు చూసిన అతను మొదట రూ.1000 పంపిస్తే వెంటనే రూ.1200 వచ్చాయి. రెండో సారి రూ.9,900 పంపిస్తే రూ.12600 పంపారు. అనుమానం వచ్చి యువకుడు స్పందించకుంటే వీడియో కాల్స్ చేసి మరింత ఆశ చూపడంతో అప్పు చేసి రూ.2.92,600 పంపాడు. వెంటనే అటువైపు నుంచి ఎలాంటి స్పందనలేకపోవడం మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రూ.1,50,000 రికవరీ చేసి అతడికి అందజేశారు. -
జవాన్ సినిమాకు రేటింగ్ ఇస్తే డబ్బులొస్తాయని మెసేజ్..
సాక్షి, సిటీబ్యూరో: రాచకొండకు చెందిన ఓ గృహిణి వాట్సాప్కు ‘జవాన్’ సినిమాకు రేటింగ్ ఇస్తే డబ్బులొస్తాయని మెసేజ్ వచ్చింది. ఆశ్చర్యపోతూనే..నేరస్తులు పంపిన నాలుగైదు సినిమాలకు రేటింగ్, రివ్యూలు ఇచ్చేసరికి ఆమె పేరుతో ఉన్న ప్రత్యేక వాలెట్లో రూ.20 వేలు జమ అయ్యాయి. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించానని తెలిస్తే తన భర్త మెచ్చుకుంటాడని భావించింది. ఈసారికి నేరస్తుల నుంచి ఒకేసారి పది సినిమాలకు రేటింగ్ లింక్లు పంపించాలంటే కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని ఆమెకు సందేశం వచ్చింది. దీంతో వాళ్ల మాటలను నమ్మి రూ.2 లక్షలు బదిలీ చేసింది. సినిమాలకు రేటింగ్ ఇచ్చినా ఆమెకు ఎలాంటి డబ్బులు రాలేదు. కమీషన్ రావాలంటే రూ.50 వేలు చార్జీ అవుతుందని కేటుగాళ్ల సూచన మేరకు అవి కూడా పంపించింది. అంతే అప్పట్నుంచి సైబర్ నేరస్తులు సైలెంటైపోయారు. ఆఖరికి వ్యాలెట్లో ఉన్న రూ.20 వేలు డ్రా చేసుకునే అవకాశం కూడా లేకపోయే సరికి తాను మోసపోయానని గ్రహించింది. ..ఇదీ సైబర్ నేరస్తుల రేటింగ్ వలకు చిక్కి విలవిల్లాడిన ఓ గృహిణి ఉదంతం. ఈమె ఒక్కరే కాదు సైబర్ నేరస్తుల సినిమా రేటింగ్ వలకు చాలా మంది నగరవాసులు చిక్కుతున్నారు. గృహిణిలు, నిరుద్యోగులు, యువతను లక్ష్యంగా చేసుకొని కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. ఆశే నేరస్తుల పెట్టుబడి.. ‘మేము పంపించే సినిమాలకు రేటింగ్లు, రివ్యూలు ఇస్తే చాలు..ఇంట్లో కూర్చొని రోజుకు రూ.వేలల్లో సంపాదించవచ్చు’ ఈ ప్రకటన చూస్తే ఎవరికై నా ఆశ కలుగుతుంది. ఇదే నేరస్తుల పెట్టుబడి. ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రాం, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో ఈ తరహా ప్రకటనలు, పోస్టులు పెడుతూ ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జేబులు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తున్నారు. మనం ప్రమేయం లేకుండా వాట్సాప్, టెలిగ్రాం, ఇన్స్ట్రాగామ్ గ్రూప్లలో చేరకూడదని సూచిస్తున్నారు. మోసం ఎలా చేస్తారంటే... తాము సూచించిన సినిమాలకు రేటింగ్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలలో సందేశాలు పంపిస్తారు. రేటింగ్ ఇవ్వాల్సిన తీరు, కమీషన్ ఎలా చెల్లిస్తారు? ఎన్ని రోజుల్లో ఎంత సంపాదన వస్తుందో వివరంగా ఉంటుంది. ఈ లింకును క్లిక్ చేయగానే ఆటోమెటిక్గా సైబర్ నేరగాళ్లు ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రాం గ్రూప్లలో చేరతారు. ముందుగా కొన్ని సినిమాల పేర్లను పంపించి వాటికి రివ్యూ ఇవ్వగానే ప్రత్యేక వాలెట్లో కొంత డబ్బు జమ చేస్తారు. మనకు నమ్మకం కుదిరేవరకూ మనం డబ్బు డ్రా చేసే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఎక్కువ సినిమాలకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఇస్తామంటూ డబ్బు వసూలు చేస్తారు. ఆ తర్వాత వారితో లింక్ కట్ అవుతుంది. చదవండి: నాలుగేళ్లుగా సినిమాలకు దూరం.. వంద కోట్ల ప్రాజెక్ట్ వచ్చినా నో చెప్పిన నటుడు! -
ప్రాణం తీసిన ఆన్లైన్ యాప్! ఫొటో మార్ఫింగ్ బెదిరింపులతో.. తీవ్ర విషాదం!!
కరీంనగర్: ఏడాదిక్రితం సింగరేణిలో బదిలీపిల్లర్ (ఆర్జీ–ఏఎల్పీ)గా ఉద్యోగం పొంది భవిష్యత్తును ఆనందంగా గడపాల్సిన పల్లె వంశీకృష్ణ(26) ప్రాణాలను ఆన్లైన్ యాప్ బలిగొంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. ఓదెల మండలం కొలనూర్కు చెందిన వంశీకృష్ణ తండ్రి రాయమల్లు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించగా.. ఆ ఉద్యోగాన్ని ఏడాదిక్రితం పొందిన వంశీ మకాం పెద్దపల్లికి మార్చాడు. పట్టణంలోని చీకురాయి రోడ్డులో నివాసముంటున్న సమయంలో గుర్తుతెలియని ఆన్లైన్ యాప్ నుంచి కొంత రుణం పొందాడు. ఆ తర్వాత తిరిగి చెల్లించినా ఇంకా బాకీ ఉన్నావంటూ నిర్వాహకులు వంశీకృష్ణపై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత తన ఫొటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో బంధు, మిత్రులందరికీ షేర్ చేసి పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారని కుటుంబీకులు ఆరోపించారు. ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన వంశీకృష్ణ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వివరించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు సైబర్నేరంగా కేసు నమోదు చేసి సైబర్క్రైం పోలీసులకు బదిలీ చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
ఈ ఒక్క క్లిక్ చేశారో.. మీ ఖాతా ఖాళీ..!
జగిత్యాల: సోషల్ మీడియాలో గృహ రుణం మంజూరు కోసం వచ్చిన కొత్త యాప్ను క్లిక్ చేయగా.. ఓ వ్యక్తి రూ.1.67 లక్షలు మోసపోయిన సంఘటన పెగ్గెర్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడి సెల్ఫోన్ సోషల్ మీడియాలో గృహ రుణం మంజూరుకు సంబంధించి ఓ యాప్ క్లిక్ చేయాలని సందేశం వచ్చింది. ఆ యువకుడు యాప్ను క్లిక్ చేశారు. మొదటగా రూ.1,250 చెల్లించాలని బ్యాంక్ ఖాతా నంబరు పంపించారు. ఆ యువకుడు రూ.1,250 చెల్లించారు. ఇలా రూ.1.67 లక్షలు చెల్లించాక రుణం మంజూరు కాలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement