Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Victory In AP Assembly Elections says Majority Exit Polls 2024
వైఎస్సార్‌సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్‌), చాణక్య (పార్థదాస్‌) తేల్చాయి. జాతీ­య, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టు­లు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్స్‌ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించా­యి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్‌ నిర్వహించే సర్వే, ఎగ్జిట్‌ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్‌ పోల్, పోస్ట్‌ పోల్‌ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్స్‌ సర్వేను ఆరా మస్తాన్‌ విస్తృత స్థాయిలో నిర్వహించారు. 49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్‌ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్‌ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్‌సీపీ, 10–12 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. సీఎం జగన్‌ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్‌ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్‌ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పా­రు. ఎన్‌డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవు­తుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్‌ చాణక్య, పోల్‌ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్‌ లాబొరేటరీ, జన్మత్‌ పోల్, సీపీఎస్‌ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీ విజ­యం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్‌ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసు­కుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయ­మ­ని క్యూ మెగా అమేజీ పొలిటికల్‌ సొల్యూషన్స్‌ సీఈవో ఖాదర్‌ ఖాన్‌ పఠాన్‌ తెలిపారు. 22 పార్లమెంట్‌ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వ­చ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివా­­రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా, ఎన్‌డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్‌ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్‌ఎక్స్, దైనిక్‌ భాస్కర్‌ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది. ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్‌డీటీవీ, న్యూస్‌–18 వంటి జాతీ­య మీడియా సంస్థలు ఎన్‌డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్‌డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్‌డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం.

Sakshi Editorial On Exit polls 2024
విజయం సరే... విలువలు?

ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్‌ తత్త్వవేత్త హెగెల్‌ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్‌ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్‌ మార్క్స్‌ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్‌ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్‌ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్‌ ది స్టేట్‌’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్‌ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్‌లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్‌ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్‌ హాబ్స్‌ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్‌ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్‌లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్‌ కీ బార్‌... చార్‌ సౌ పార్‌’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్‌ సౌ పార్‌’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను ప్రమోట్‌ చేయలేదు. మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్‌ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్‌ వెల్లడించారు. పండిత్‌ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్‌ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్‌ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్‌ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్‌ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టాయ్‌ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్‌స్టన్‌ చర్చిల్, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్, మార్టిన్‌ లూథర్‌కింగ్, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్, అడాల్ఫ్‌ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్‌ మండేలా, పండిత్‌ నెహ్రూ, మదర్‌ థెరిసా, మార్గరెట్‌ థాచర్‌ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్‌ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్‌ శక్తులన్నీ కలిసి ప్రమోట్‌ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్‌ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్‌ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్‌ ట్రిలియన్‌ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్‌ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్‌ సౌ పార్‌’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Weekly Horoscope 2 June 2024 To 8 June 2024 In Telugu
ఈ వారంలో ఈరాశివారికి అనుకోని లాభాలు.. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి!

మేషం:దీర్ఘకాలిక సమస్య నుంచి గట్టెక్కే సమయం. ఒక ముఖ్య∙సమాచారం అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది. వాహనయోగం. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలలో లాభాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.వృషభం:ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. ఇతరులకు కూడా సహాయపడతారు. కాంట్రాక్టులు అనూహ్యంగా పొందుతారు. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాల వారు సంస్థల ఏర్పాటు దృష్టి సారిస్తారు. వారం చివరిలో అనారోగ్యం. బంధువర్గంతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. హనుమాన్‌ చాలీసా పఠించండి.మిథునం:ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల కల ఫలించే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. అప్పులు తీరతాయి. వ్యాపార విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకోని లాభాలు. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. అయితే కొంత భారం తప్పదు. కళారంగం వారి కృషి ఫలించే సమయం. వారం చివరిలో కుటుంబసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం:పనులు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులు, మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. అంచనాలు నిజం కాగలవు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభం. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులతో పాటు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఒక కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.సింహం:చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. మీ సత్తా పదిమందీ గుర్తిస్తారు. భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వాహనయోగం. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. అప్పులు సైతం తీరుస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో కొన్ని మారుμలు ఉంటాయి. పారిశ్రామికవర్గాల వారు.పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కన్య:కార్యజయం. బంధువర్గం నుంచి శుభవర్తమానాలు. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. రావలసిన సొమ్ము అందుకుంటారు. రుణబా«ధల నుంచి విముక్తి లభిస్తుంది. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. కళారంగంవారికి కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఎరుపు, పసుపు రంగులు. గణపతిని పూజించండి.తుల:ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. దాతృత్వాన్ని చాటుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారం. బాకీలు కొన్ని వసూలై అవసరాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామికరంగం వారి యత్నాలు సఫలం. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువుల నుంచి ఒత్తిడులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. శివాష్టకం పఠించండి.వృశ్చికం:కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగే సమయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి ఏర్పడి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాల వారు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఆదిత్యుని పూజించండి.ధనుస్సు:దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆత్మీయులు సహాయసహకారాలు అందిస్తారు. వాహనాలు , భూములు కొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగార్ధుల యత్నాలలో కొంత అనుకూలత ఉంటుంది. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి.విస్తరణయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభంలో దుబారా ఖర్చులు. బంధువులతో తగాదాలు. పసుపు, బంగారు రంగులు. సత్యనారాయణస్వామికి అర్చన చేయించుకుంటే మంచిది.మకరం:చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు ఆదరణ పొందుతారు. కొన్ని సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. పెద్దల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత చికాకులు . రావలసిన సొమ్ము అందుతుంది. బాకీలు తీరుస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. కొన్ని పదవులు దక్కించుకుంటారు. వారం మధ్యలో ధననష్టం. కుటుంబసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కుంభం:కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. బంధువులతో లేనిపోని విభేదాలు. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఇతరులనుంచి రావలసిన సొమ్ము కొంత ఆలస్యమవుతుంది. వ్యాపారాలలో నిదానం అవసరం. లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని పనిభారం మరింత పెరిగి సతమతమవుతారు. కళారంగం వారికి కాస్త నిరాశ తప్పదు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, గులాబీ రంగులు. హనుమాన్‌ చాలీసా పఠించండి.మీనం:వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆశయాలు సాధనలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. రావలసిన బకాయిలు అందుతాయి. చేతినిండా సొమ్ము ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. మిత్రులతో స్వల్వ వివాదాలు. నీలం, నేరేడు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Sikkim And Arunachal Pradesh Assembly Poll Counting Updates
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: కొనసాగుతున్న కౌంటింగ్‌

Counting Updatesఅరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈఓ) పవన్‌కుమార్‌ సైన్‌ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్‌కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్‌ యాక్షన్‌ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్‌ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు.

School Education Department prepared 38 lakh kits: Andhra Pradesh
జగనన్న విద్యాకానుక రెడీ

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువు­తున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ఏటా అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూని­ఫా­రం, బూట్లతో కూడిన కిట్ల పంపిణీని రాష్ట్ర ప్రభు­త్వం సిద్ధంచేసింది. ఈ నెల 12న పాఠశాలలు తెరి­చిన మొదటిరోజే వాటిని అందించేందుకు సామ­గ్రిని మండల స్టాక్‌ పాయింట్లకు చేరవేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌లో బోధించే 3.12కోట్ల పాఠ్య­పుస్తకాలు మండల స్టాక్‌ పాయింట్లకు ఇప్పటికే చేరవేశారు. యూనిఫారం సరఫరా శనివారం నుంచి మొదలైంది.వస్తువులను ఒక్కొక్కటిగా స్టాక్‌ పా­­యిం­­ట్లకు చేర్చిన అనంతరం అక్కడ తరగతుల వారీగా కిట్లను రెడీ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయగా మిగిలిన 2 లక్షల కిట్లకు అదనంగా ఈ విద్యా సంవత్సరానికి 36లక్షల కిట్లను అధికా­రులు సిద్ధంచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరు­గుదలకు అనుగుణంగా వస్తువులను అందించేలా సరఫరాదారులకు ఆదే­శాలు జారీచేశారు.అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్త­కాలు, టోఫెల్‌ వర్క్‌బుక్, ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్ట్‌ పుస్తకంతోపాటు మూడు జతల యూనిఫాం క్లాత్, స్కూల్‌ బ్యాగ్, బెల్ట్, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు.. అదేవిధంగా 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్‌ డిక్షనరీ, 6–10 తరగతుల విద్యార్థులకు నోట్‌బుక్స్, అందించనున్నారు. ఇప్పటివరకు విద్యాకానుక కిట్‌లో అందించే తొమ్మిది వస్తువుల్లో బూట్లు మినహా మిగిలిన బ్యాగులు, బెల్టులు, సాక్సులు, పాఠ్య, నోటుపుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ వంటి 8 రకాల వస్తువులు 90 శాతం మండల కేంద్రాలకు చేరాయి. ఒకట్రెండు రోజుల్లో బూట్ల సరఫరా చేపట్టనున్నారు. పాఠశాలలకు 3.12 కోట్ల పాఠ్య పుస్తకాలు..ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను స్టాక్‌ పాయింట్లకు పంపించారు. 3–10 తరగతుల వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. ఈనెల 8వ తేదీ నాటికే అన్ని స్కూళ్లలోను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కిట్లను సిద్ధంచేయాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్లుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది.రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్‌ సిలబస్‌ పుస్తకా­లను అందించనున్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రాన్ని సీబీఎస్‌ఈ తరహాలో జాగ్రఫీ, ఎకనా­మి­క్స్, చరిత్ర, డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌ రూపంలో ఎన్సీఈ­ఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్‌ సైన్స్‌ పుస్త­కా­లను పూర్తి ఆర్ట్‌ పేపర్‌పై ముద్రించారు. ఈ తర­హా ముద్రణ చేపట్టడం ఇదేతొలిసారి కావడం విశేషం. ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌గా ఇంజినీరింగ్‌ విద్యార్థులుఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యా­ర్థులకు ప్రభుత్వం ఫ్యూచర్‌ స్కిల్స్‌ కోర్సును అందు­బాటులోకి తెచ్చింది. వీరి బోధనకు ఇంజి­నీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌­పర్ట్స్‌గానూ నియమించింది. ఫ్యూచర్‌ స్కిల్స్‌ సిలబస్‌ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలు ముద్రించి పంపిణీకి సిద్ధంచేసింది.

Exit Poll 2024: Narendra Modi-led NDA set for hattrick with 355-370 seats
Exit Poll 2024: భారీ మెజార్టీతో ఎన్డీఏ హ్యాట్రిక్‌

ఎన్డీఏ హ్యాట్రిక్‌ ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మెజా రిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. బీజేపీ యూపీలో స్థానాలను పెంచుకోవడంతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని కర్ణాటకలో హవా కొనసాగించడమే గాక బెంగాల్లో చొచ్చుకుపోతుందని చెప్పాయి. కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి 150 మార్కు దాటొచ్చని తెలిపాయి. న్యూఢిల్లీ: కేంద్రంలో పాలక ఎన్డీఏ కూటమిదే మళ్లీ అధికారమని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కూటమి హ్యాట్రిక్‌ కొట్టడం, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. శనివారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగుస్తూనే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లువెత్తాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని వాటిలో చాలావరకు పేర్కొన్నాయి. కర్నాటకలో కూడా బీజేపీ హవాయే కొనసాగుతుందని, పశ్చిమబెంగాల్లో మరింతగా చొచ్చుకుపోతుందని వెల్లడించడం విశేషం. బిహార్, రాజస్తాన్, హరియాణాల్లో మాత్రం ఎన్డీఏకు సీట్లు కాస్త తగ్గుతాయని అంచనా వేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విపక్షాల అవకాశవాద రాజకీయాలను జనం పూర్తి గా తిరస్కరించారన్నారు. వాస్తవ ఫలితాల్లో తమకు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి వస్తాయని ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్‌ మాత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ను మోదీ ప్రభావితం చేశారని ఆరోపించింది. వాస్తవ ఫలితాలు చాలా భిన్నంగా రాను న్నాయని విశ్వాసం వెలిబుచి్చంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇప్పుడిక అందరి కళ్లూ జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు జరిగాక రాబోయే అసలు ఫలితాలపైనే కేంద్రీకృతమయ్యాయి. ఏ సర్వే ఏం చెప్పింది...? ఇండియాటుడే–మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఎన్డీఏకు 361 నుంచి 401 స్థానాలిచి్చంది. ఇండియా కూటమికి 131 నుంచి గరిష్టంగా 166 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 368 దాకా వస్తాయని రిపబ్లిక్‌ భారత్‌–మారై్టజ్‌ సర్వే పేర్కొంది. ఇండియా కూటమికి 133, ఇతరులకు 48 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 392 దాకా, ఇండియాకు 161, ఇతరులకు 20 దాకా రావచ్చని జన్‌ కీ బాత్‌ అభిప్రాయపడింది. ఎన్డీఏకు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న మేరకు 401 స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ అంచనా వేయడం విశేషం. ఇండియా కూటమికి 139, ఇతరులకు 38 స్థానాలు రావచ్చని తెలిపింది. టుడేస్‌ చాణక్య కూడా కూడా ఎన్డీఏకు 385 నుంచి ఏకంగా 415 సీట్లిచి్చంది! ఇండియా కూటమి 96 నుంచి 118 మధ్య సాధిస్తుందని పేర్కొంది. న్యూస్‌ నేషన్‌ ఎన్డీఏకు 378, ఇండియా కూటమికి 169 స్థానాలిచి్చంది. దైనిక్‌ భాస్కర్‌ ఎన్డీఏ కూటమికి 350 దాకా, ఇండియా కూటమికి గరిష్టంగా 201, ఇతరులకు 49 సీట్లిచి్చంది. రిపబ్లిక్‌ టీవీ సర్వేలో ఎన్డీఏకు 359, ఇండియాకు 154, ఇతరులకు 30 స్థానాలొచ్చాయి. ఏబీపీ న్యూస్‌–సీ వోటర్‌ ఎన్డీఏకు 353–383, ఇండియాకు 152 నుంచి 182 సీట్లిచ్చింది. ఎన్డీఏకు 371, ఇండియాకు 125 రావచ్చని ఇండియా న్యూస్‌ పేర్కొంది. టైమ్స్‌ నౌ–ఈటీజీ సర్వే ఎన్డీఏకు 358, ఇండియా కూటమికి 152 స్థానాలిచ్చింది. రాష్ట్రాల్లో ఇలా... కేంద్రంలో అధికార సాధనకు అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పై బీజేపీ మరోసారి పట్టు నిలుపుకుంటోందని సర్వేలన్నీ తెలిపాయి. బీజేపీకి యూపీలో ఏకంగా 67 సీట్ల దాకా రావచ్చని ఇండియాటుడే వెల్లడించింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్లకే పరిమితమవుతాయని తెలిపింది. కర్నాటకలో ఈసారి కూడా బీజేపీకి 23, భాగస్వామి జేడీ(యూ)కు 3 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక పశి్చమబెంగాల్లోనైతే పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ను తోసిరాజని 23 నుంచి 27 స్థానాలతో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో అతి పెద్ద పారీ్టగా అవతరించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఇండియాటుడే అయితే బెంగాల్లో బీజేపీకి 30 పై చిలుకు, తృణమూల్‌కు 11 నుంచి 12 స్థానాలివ్వడం విశేషం. కీలకమైన మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి సీట్లు 2019తో పోలిస్తే కాస్త తగ్గి 30 నుంచి 32 దాకా రావచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఒడిశాలోనైతే 21 సీట్లకు గాను ఎన్డీఏకు ఏకంగా 18 నుంచి 20 వస్తాయని, అధికార బిజూ జనతాదళ్‌ ఒకట్రెండు సీట్లకు మించబోదని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. దక్షిణాదిన కేరళలోనూ తొలిసారి కమలవికాసం ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. అక్కడ బీజేపీకి 3 సీట్ల దాకా ఖాయమని పేర్కొన్నాయి. లెఫ్ట్‌ ఫ్రంట్‌ కుదేలవుతుందని, కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు వస్తాయని తెలిపాయి. రాజస్తాన్, బిహార్లలో ఎన్డీఏకు ఐదారు స్థానాలు తగ్గి ఆ మేరకు ఇండియా కూటమికి పెరగవచ్చని పేర్కొన్నాయి. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడమే గాక మెజారిటీ లోక్‌సభ స్థానాలూ నెగ్గుతుందని కొన్ని ఎగ్జిట్‌ పోల్స్, ఎన్డీఏ కూటమిదే విజయమని మరికొన్ని పేర్కొన్నాయి. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ లోక్‌సభ స్థానాలొస్తాయని తెలిపాయి.2019లో ఏం జరిగింది?2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీఏ గెలుస్తుందనే జోస్యం చెప్పాయి. మొత్తం 13 ఎగ్జిట్‌ పోల్స్‌ సగటును చూస్తే ఎన్డీఏకు 306, యూపీఏకు 120 సీట్లొస్తాయని పేర్కొన్నాయి. చివరికి ఎన్డీఏకు 353 స్థానాలు రాగా యూపీఏ కేవలం 93 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి సొంతంగానే 303 స్థానాలు రాగా కాంగ్రెస్‌ కేవలం 53 సీట్లు నెగ్గింది.

Telangana Lok Sabha Elections Exit Poll 2024 Live Updates
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: ఊహించని ఫలితాలు

తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్‌ఎస్‌ కు నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్‌ సర్వేఆరా మస్తాన్‌ సర్వే ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం​.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.పోల్‌ లాబొరేటరీపోల్‌ లాబొరేటరీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. కాంగ్రెస్‌ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.ఇండియా టుడేఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.పోల్‌ స్టార్ట్‌బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్‌ స్టార్ట్‌ స్పష్టం చేసింది.పార్థ చాణక్యపార్థ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్‌ఎస్‌ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.ఆపరేషన్‌ చాణక్య ఆపరేషన్‌ చాణక్య ప్రకారం.. కాం‍గ్రెస్‌ 7, బీజేపీ 8, బీఆర్‌ఎస్‌ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాటైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్‌ 5-8, బీఆర్‌ఎస్‌ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.ఏబీపీ సీ ఓటర్‌ఏబీపీ సీ ఓటర్‌ సర్వే అయితే కాంగ్రెస్‌, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.న్యూస్‌ 24న్యూస్‌ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్‌ఎస్‌కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.ఎక్కడా కనిపించని కారు జోరుతెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది.

India won the Wamp match
‘సాధన’ సరిపోయింది.. వామప్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం

న్యూయార్క్‌: బ్యాటింగ్‌లో రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా తమదైన శైలిలో దూకుడుగా ఆడారు...సూర్యకుమార్, రోహిత్‌ శర్మ కూడా కీలక పరుగులు సాధించారు. దూబే, సామ్సన్‌ మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు...బౌలింగ్‌లో కూడా ప్రధాన బౌలర్లంతా బరిలోకి దిగి ఆకట్టుకున్నారు...ఓవరాల్‌గా టి20 వరల్డ్‌ కప్‌లో ప్రధాన టోర్నీకి ముందు ఏకైక వామప్‌ మ్యాచ్‌లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. దీని ద్వారా టీమ్‌ తుది జట్టుపై ఒక అంచనా కూడా వచ్చింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి ఆడలేదు. యశస్వికి మ్యాచ్‌ ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తే ప్రధాన జట్టులో అతను ఉండే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో పాటు రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగవచ్చు. ఇక్కడ విఫలమైనా...టాపార్డర్‌లో సామ్సన్‌ పేరును టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తుండగా, దూబే బౌలింగ్‌ చేయడాన్ని బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా జట్టుకు మంచి ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నట్లే. మరో వైపు కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్‌ గ్రౌండ్‌ మాత్రం వరల్డ్‌ కప్‌ స్థాయికి తగినట్లుగా కనిపించలేదు. అవుట్‌ఫీల్డ్‌ బంతి పడ్డ ప్రతి చోటా దుమ్ము రేగడం చూస్తే ఈ స్టేడియంను సిద్ధం చేయడంలో ఐసీసీ తొందరపడినట్లు అనిపించింది. ఇదే వేదికపై భారత్‌ లీగ్‌ దశలో తమ తొలి మూడు మ్యాచ్‌లు ఆడనుంది. మ్యాచ్‌ ఫలితంతో సంతృప్తి చెందినట్లు, తాము అనుకున్న రీతిలో ప్రాక్టీస్‌ లభించినట్లు విజయం అనంతరం భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. శనివారం జరిగిన వామప్‌ పోరులో భారత్‌ 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (32 బంతుల్లో 53 రిటైర్డ్‌ అవుట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.సూర్యకుమార్‌ యాదవ్‌ (18 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించగా, రోహిత్‌ శర్మ (19 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించగా... శివమ్‌ దూబే (14), సంజు సామ్సన్‌ (1) విఫలమయ్యారు. అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది. మహ్మదుల్లా (28 బంతుల్లో 40 రిటైర్డ్‌ అవుట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), షకీబ్‌ అల్‌ హసన్‌ (34 బంతుల్లో 28; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్‌‡్షదీప్‌ సింగ్, శివమ్‌ దూబే చెరో 2 వికెట్లు పడగొట్టగా...అక్షర్‌ పటేల్, బుమ్రా, సిరాజ్, హార్దిక్‌ పాండ్యా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Directors and Producer Hit Combination Repeat in Tollywood
లెక్క కుదిరింది

కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ (డైరెక్టర్‌)కి, షిప్‌ ఓనర్‌ (ప్రోడ్యూసర్‌)కి మధ్య మంచి రిలేషన్‌ ఉండాలి. షిప్‌ (సినిమా)ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేసి, యజమాని నష్టపోకుండా కెప్టెన్‌ చూసుకుంటే.. ఇక అతనికి, యజమానికీ మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మళ్లీ మళ్లీ కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు.అలా లెక్కలు కుదిరి కొన్ని కాంబినేషన్లు రిపీట్‌ అవుతున్నాయి. ఇలా ఓ దర్శకుడికి–నిర్మాతకి మధ్య స్నేహం కుదరడం, మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడం ఓ ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పాలి. రిపీట్‌ అవుతున్న ఆ దర్శక–నిర్మాతల కాంబినేషన్‌ గురించి తెలుసుకుందాం. ‘దిల్‌’ రాజు, అనిల్‌ రావిపూడిమూడోసారి ‘దిల్‌’ కలిసిందికుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసి విజయాలు అందుకునే నిర్మాతగా ‘దిల్‌’ రాజుకి పేరుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తెరకెక్కించగల దర్శకుడు అనిల్‌ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్‌లో సుప్రీమ్‌ (2016), ‘రాజా ది గ్రేట్‌’ (2017), ‘ఎఫ్‌ 2’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020), ‘ఎఫ్‌ 3’ (2022) వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. తాజాగా అనిల్‌–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇందులో వెంకటేశ్‌ హీరో. హిట్‌ చిత్రాలు ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ తర్వాత వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడి–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో రూపొందనున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌ అనుకుంటున్నారట. రవిశంకర్, నవీన్, సుకుమార్‌గురు–శిష్యులతో మైత్రీడైరెక్టర్‌ సుకుమార్‌–మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). రామ్‌చరణ్, సమంత జోడీగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్‌–మైత్రీ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ (2021). అల్లు అర్జున్, రష్మికా మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా సుకుమార్‌–నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప 2: ది రూల్‌’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మికానే జోడీగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.∙సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సనాని దర్శకునిగా పరిచయం చేస్తూ వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘ఉప్పెన’ (2021) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన రెండో చిత్రాన్ని కూడా మైత్రీలోనే చేస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్‌ హీరోగా నవీన్, రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సునీల్, రామ్మోహన్‌ రావు, శేఖర్‌ కమ్ములశేఖర్‌తో మరో సినిమాప్రేమకథలే కాదు.. కుటుంబ కథలనూ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఆయన ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ (ఏషియన్‌ గ్రూప్‌), అమిగోస్‌ క్రియేషన్స్ పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. కాగా శేఖర్, సునీల్‌ నారంగ్, రామ్మోహన్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో చిత్రం ఇది. ఈ కాంబినేషన్‌లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్‌ స్టోరీ’ (2021) సూపర్‌ హిట్టయింది. నాగ్‌ అశ్విన్, ప్రియాంక, అశ్వినీదత్, స్వప్నహోమ్‌ బేనర్‌లో నాగ్‌ అశ్విన్‌ఇంట్లోనే ఒక పెద్ద బేనర్‌ ఉంటే బయట బేనర్ల అవసరం అంతగా ఉండదు. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌కి రెండు హోమ్‌ బేనర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్‌ ఉన్నాయి. అశ్వినీదత్‌ రెండో కుమార్తె ప్రియాంక, నాగ్‌ అశ్విన్‌ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్, స్వప్న సినిమాస్‌పై ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బేనర్లలో ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015), ‘మహా నటి’ (2018) సినిమాలకు దర్శకత్వం వహించారు నాగ్‌ అశ్విన్‌. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ హీరోగా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ నెల 27న రిలీజ్‌ కానుంది. నాగవంశీ, వెంకీసార్‌తో ఆరంభమై లక్కీతో మళ్లీ...డైరెక్టర్‌ వెంకీ అట్లూరి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘సార్‌’ (తమిళంలో వాత్తి). ధనుష్, సంయుక్తా మీనన్‌ జంటగా సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దర్శక–నిర్మాతల కాంబినేషన్‌లో తాజాగా ‘లక్కీ భాస్కర్‌’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్ , మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్‌ కానుంది. శ్రీకాంత్‌ చెరుకూరి, శ్రీకాంత్‌ ఓదెలహీరో కూడా రిపీట్‌శ్రీకాంత్‌ ఓదెల దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘దసరా’ (2023). తొలి చిత్రంతోనే నానీని దర్శకత్వం వహించే చక్కని అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకున్నారు. నాని, కీర్తీ సురేష్‌ జోడీగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ‘దసరా’ కాంబినేషన్‌లోనే మరో సినిమా రానుంది. నాని కెరీర్‌లో ఇది 33వ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తారు. టీజీ విశ్వప్రసాద్, కార్తీక్‌ రెండోసారి రెండు భాగాలతో... ‘ఈగల్‌’ చిత్రం తర్వాత డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని–పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో ‘మిరాయ్‌’ సినిమా రూపొందుతోంది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్‌ హీరో, హీరోయిన్లుగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ‘ఈగల్‌’ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం కార్తీక్‌–విశ్వప్రసాద్‌ కాంబినేషన్‌లో ‘మిరాయ్‌’ చిత్రం రూపొందుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్‌ జంటగా నటిస్తున్న ‘మిరాయ్‌’లో మంచు మనోజ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 2025 ఏప్రిల్‌ 18న రిలీజ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలోనూ రిలీజ్‌ కానుంది. ప్రశాంత్‌ వర్మ, నిరంజన్‌ రెడ్డిఈసారి ‘జై హనుమాన్‌’తో...సంక్రాంతి అంటే స్టార్‌ హీరోల చిత్రాల పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలతో పోటీ పడి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రం ‘హనుమాన్‌’. తేజ సజ్జా హీరోగా ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అయింది. ఇక ‘హనుమాన్‌’కి సీక్వెల్‌గా ప్రశాంత్‌ వర్మ–చైతన్య–నిరంజన్‌ రెడ్డి కాంబినేషన్‌లో ‘జై హనుమాన్‌’ రూపొందుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.వీరే కాదు.. మరికొందరు దర్శక–నిర్మాతల కాంబినేషన్స్‌ కూడా రిపీట్‌ అవుతున్నాయి.

TDP is scared of defeat: Andhra pradesh
టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి

సాక్షి,అమరావతి: కౌంటింగ్‌ రోజున అల్లర్లు సృష్టించేలా తెలుగుదేశం కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొడుతున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ బృందం కోరింది. ఈ మేరకు శనివారం వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ జూన్‌ 4న రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు ట్రైనింగ్‌ క్యాంపులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లను తరిమికొట్టాలని, కౌంటింగ్‌ ప్రాంతంలో లేకుండా చేయాలని రెచ్చగొట్టేలా బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల నియమావళిపై కనీస అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ అధినేతకు ఓటమి భయం పట్టుకుందని.. కనుకనే అల్లర్లు సృష్టించి ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసాలు, ఘర్షణలతో ప్రజా తీర్పును మార్చేందుకు ప్రయతి్నస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఎక్కడా దౌర్జన్యకాండ జరగకుండా అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, కఠినంగా వ్యవహరించాలని ముందస్తుగా ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని మల్లాది విష్ణు మండిపడ్డారు. సజ్జల మాటలను తెలుగుదేశం లీగల్‌ సెల్‌ పూర్తిగా వక్రీకకరించి, ఆయనపై తప్పుడు కేసు బనాయించిందని నిప్పులు చెరిగారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నదెవరో ఓటర్లకు బాగా తెలుసన్నారు. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సైకో అని, గొడ్డలి అని, ఘర్షణలు సృష్టించేలా నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, కూటమి టీడీపీ నేతలపై నేటికీ కనీస చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్‌సీపీ ఇచ్చిన దాదాపు వందకి పైగా ఫిర్యాదులు ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌ లోనే ఉన్నాయన్నారు. ముఖ్యంగా కోడ్‌ను పదేపదే ఉల్లంఘిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని కోరినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్‌ డ్రా చేసుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్‌సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి ఉన్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement