దూసుకొచ్చిన మృత్యువు | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Published Wed, Jan 2 2019 10:23 AM

Road Accident In Huzurabad Karimnagar - Sakshi

హుజూరాబాద్‌రూరల్‌: కారులో ప్రయాణిస్తున్న యువకులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. గుర్తుతెలియని వాహనాన్ని తప్పించబోయిన లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరోవ్యక్తి కోమాలో ఉన్నాడు. ఈ ఘటన హుజూరాబాద్‌ మండలం మాందాడిపల్లి గ్రా మం వద్ద కరీంనగర్‌– వరంగల్‌ హైవేపై మంగళవారం వేకువజామున మూడుగంటలకు జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకా రం.. శంకరపట్నం మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన కోడూరి రవి– సరస్వతీ దంపతుల చిన్న కొడుకు కోడూరి వెంకటేష్‌(25) ఓ సీడ్‌ కంపెనీలో డ్రైవర్‌గా చేస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా మినిగలూరు గ్రామానికి చెందిన చెందిన కే.ఎస్‌ చప్రాద్‌రెడ్డి(31) అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా కొనసాగుతున్నాడు.

లింగాపూర్‌కు చెందిన మరో యువకుడు సుందిళ్ల రంజిత్‌ కూడా అదే కంపెనీలో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం వేకువజామున కారులో ముగ్గురూకలిసి హుజూరాబాద్‌ వెళ్తున్నారు. మాందాడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో వద్దకు చేరుకోగానే ఖమ్మం నుంచి కరీంనగర్‌ మీదుగా మహారాష్ట్ర వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి ఈ యువకులు వెళ్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి నిలిచిపోయింది. ప్రమాదంలో కారులో ఉన్న వెంకటేశ్, చప్రాల్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. రంజిత్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడ్ని వరంగల్‌ ఎంజీఎంకు, మృతదేహాలను హూజూరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు ఆస్పత్రి ఆవరణలో రోదించిన తీరు అందరినీ కలచివేసింది. వెంకటేశ్‌ తండ్రి కోడూరి రవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వాసంశెట్టి మాధవి తెలిపారు.

ప్రమాదాలకు నిలయం.. 
హుజూరాబాద్‌ మండలంలోని పర్కాల్‌ క్రాస్‌రోడ్డు నుంచి సింగాపూర్‌ గ్రామ శివారు వరకు హైవే ప్రమాదాలకు నిలయంగా మారింది.  గతేడాది మార్చి 5న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రతికలంక గ్రామానికి చెందిన కే.ఎస్‌ చప్రాద్‌రెడ్డి(45)తుమ్మనపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మార్చి 21న సింగాపూర్‌ గ్రామశివారులోని వ్యవసాయ బావిలో కారు పడి ఇద్దరు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. అదేనెల 17న శాలపల్లి–ఇందిరానగర్‌ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఐదుగురికి గాయాలయ్యాయి. ఆగస్టు 15న బోర్నపల్లి సబ్‌స్టేషన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సెప్టెంబర్‌ 2న సింగాపూర్‌ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లయ్య చనిపోయాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
Advertisement