జొహన్నెస్బర్గ్: టీమిండియాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా కుదురుగా బ్యాటింగ్ చేస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా గురువారం లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. 6/1 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా.. లంచ్ సమయానికి మరో రెండు వికెట్లను కోల్పోయి 75 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో డీన్ ఎల్గర్(4) వికెట్ను తొందరగా తీసినా, రబడా(30)ను అవుట్ చేయడానికి టీమిండియా శ్రమించాల్సి వచ్చింది. నిన్నటి ఆటలో నైట్ వాచ్మన్గా దిగిన రబడా బాధ్యతాయుతంగా ఆడాడు. 84 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లతో భారత్కు పరీక్షగా నిలిచాడు.
ఈ క్రమంలోనే హషీమ్ ఆమ్లాతో కలిసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాగా, సఫారీలు ఇన్నింగ్స్ లో భాగంగా ఇషాంత్ శర్మ వేసిన 30వ ఓవర్ ఆఖరి బంతికి రహానేకు క్యాచ్ ఇచ్చిన రబడా అవుటయ్యాడు. లంచ్కు వెళ్లడానికి ఓవర్గా ఉందనగా రబడా అవుట్ కావడం గమనార్హం. లంచ్ సమయానికి ఆమ్లా(32 బ్యాటింగ్), డివిలియర్స్(0 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు.