‘భార్యాభర్తల మధ్య కేసీఆర్ తగువు పెట్టారు’
హైదరాబాద్: పింఛన్ల విషయంలో భార్యాభర్తల మధ్య కేసీఆర్ తగువులు పెట్టారని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్లో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ..ఒక ఇంట్లో రెండు పింఛన్లు ఇవ్వని కేసీఆర్..ఆయన ఇంట్లో మాత్రం ఐదుగురికి మంత్రి, ఎంపీ పదవులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ దొంగలేనని..ఒక తాను ముక్కలేనని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు లాలూచీతో కుస్తీ పడుతున్నాయని వ్యాఖ్యానించారు.
బీజేపీకి దమ్మూ, ధైర్యం ఉందని, ప్రజల పట్ల ఉండి పోరాటం చేస్తామని చెప్పారు. మజ్లిస్ మతతత్వ పార్టీ అని, వారి అరాచకాలకు టీఆర్ఎస్ స్వేచ్ఛను ఇస్తుందని మండిపడ్డారు. మోదీ మాటలను కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుస్తున్న పార్టీ బీజేపీయేనని చెప్పారు. ఏ రాష్ట్ర మంత్రివర్గంలో మహిళ లేకుండా ఉన్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపట్ల కేసీఆర్కు ఎలాంటి మర్యాద ఉందో ప్రజలకు బాగా అర్ధమైందన్నారు.