లక్నో: మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ రోగిపట్ల ఉత్తరప్రదేశ్లోని ఎటావా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. సునీల్ యాదవ్ అనే వ్యక్తిని కింద పడేసి ఇద్దరు పోలీసులు దారుణంగా లాఠీలతో కుళ్లబొడిచారు. తనను విడిచిపెట్టాలని బాధితుడు ఎంత మొత్తుకున్నా పోలీసులు కనికరించలేదు. శనివారం ఈ ఘటన జరగ్గా.. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. పోలీసుల చిత్రహింసలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతను ఏమైనా తప్పుచేస్తే.. కేసు నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి గానీ, రాక్షసంగా వ్యవహరిస్తారా అని కొందరు ఆగ్రహం చేస్తున్నారు. సమాజ్వాది పార్టీ కూడా రెండు దీన్ని షేర్ చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
(చదవండి: రెడ్ జోన్లో మినహాయింపులకు నో..)
కాగా, పోలీసుల చేతిలో దాడికి గురైన బాధితుడు మద్యానికి బానిసైన మానసిక రోగి అని, అతను గ్రామస్తులపై దాడులు చేస్తున్నాడని ఎటావా పోలీస్ అధికారులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని అదుపులోకి తీసుకుందామని వెళ్లారని చెప్పారు. అయితే, సునీల్ యాదవ్ వారిపై కత్తితో దాడికి యత్నించాడని ఆరోపించారు. అతన్ని పట్టుకునే యత్నంలోనే దాడి చేశారని తమ చర్యను సమర్థించుకున్నారు. ఇదిలాఉండగా.. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. బాధితునిపై ప్రతాపం చూపిన ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.
(చదవండి: కరోనా యోధులకు గౌరవ వందనం)