రాహుల్ అందుకే కేరళ పారిపోయారు..
లక్నో : లోక్సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతలు పరస్పర విమర్శలకు పదును పెడుతున్నారు. వాడివేడి విమర్శలతో ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ అమేధితో పాటు కేరళలోని వయనాద్ లోక్సభ స్ధానంలోనూ పోటీ చేస్తుండటాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా తప్పుపట్టారు. రాహుల్ కేరళ ఎందుకు పారిపోయారని ఆయన నిలదీశారు.
యూపీలోని నగీనాలో ఆదివారం జరిగిన ప్రచార ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ అమేధికి రాహుల్ ఏం చేశారన్నది ఈసారి అందరికీ తెలిసిందేనన్నారు. అమేధిని వదిలేసి ఆయన ఈసారి కేరళకు పరుగులు పెడుతున్నట్టు తనకు వాట్సాప్లో సమాచారం అందిందని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఓటమి భయంతోనే వయనాద్లోనూ పోటీ చేసేందుకు రాహుల్ మొగ్గుచూపుతున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు రాహుల్ అమేధి, వయనాద్ల నుంచి పోటీ చేస్తుండటంపై కేంద్ర మంత్రి మనేకా గాంధీని ప్రశ్నించగా, తను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది రాహుల్ నిర్ణయమని, అయితే అమేధిలో ఓటమి ఎదురవుతుందని ఆయన భయపడినట్టుగా తనకెలా తెలుస్తుందన్నారు.