పోలీసులంతా ఒక్కటై.. | Sakshi
Sakshi News home page

పోలీసులంతా ఒక్కటై..

Published Sun, Jul 2 2017 8:44 PM

పోలీసులంతా ఒక్కటై.. - Sakshi

సిద్దిపేట : తమతో పని చేస్తున్న కానిస్టేబుల్‌ ఉన్నట్టుండి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. తమతో ఉన్న జ్ఞాపకాలు ఆ పోలీసులు మర్చిపోలేకపోతున్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో ఆ స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది అంతా ఒక్కటయ్యారు. తలా ఇంతా వేసి కొంత డబ్బును సమకూర్చి మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి అందించి ఆదర్శంగా నిలిచారు.

ఈ సంఘటన సిద్దిపేట రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కొంత కాలంగా పని చేస్తున్న కానిస్టేబుల్‌ చంద్రయ్య నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. చంద్రయ్య తోటివారితో కలిసిమెలసి ఉండేవారు. ఆయనతో ఉండే అనుబంధాన్ని తోటి ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. తోటి కానిస్టేబుల్‌గా పని చేసి అనారోగ్యంతో మృతి చెందిన చంద్రయ్య కుటుంబానికి అండగా నిలిచిందుకు పోలీసులంతా ముందుకొచ్చారు.

రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి తలా కొంత డబ్బులు వేసి రూ. 25 వేలు పోగు చేశారు. ఈ క్రమంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ చంద్రయ్య కుమారుడు వేణును ఆదివారం పోలీసు స్టేషన్‌కు పిలిపించి రూ. 25వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సతీష్, సిబ్బంది శ్రీనివాసులు, భాస్కర్, తార తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement