ఆ బిడ్డ బోసి నవ్వులతో ఇంకా ఊసులు చెప్పలేదు. బుడి బుడి అడుగుల చప్పుళ్లు వినలేదు. ఆటపాటలతో కేరింతలు కొట్టలేదు. గోరు ముద్దలు తినిపించనేలేదు. ఇంతలోనే విధి వంచించింది. తన గారాలపట్టీని కన్నీటి తీరాలకు తీసుకొనిపోయాడు. ఆ తల్లికి గర్భశోకం మిగిల్చాడు. విస్సన్నపేటలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిగూడెం మండలం శ్రీరామపురానికి చెందిన నెలరోజుల పసిబిడ్డతోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
కృష్ణా , విస్సన్నపేట : ఆటో లారీ ఢీకొన్న ఘటనలో చంటి బిడ్డతో సహా మరో ఇద్దరు మృతి చెందిన సంఘటన విస్సన్నపేటలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్డిగూడెం మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన జుజ్జనూరు లక్ష్మికాంతం ఆమె కుమార్తె పరిశెల ప్రేమలత, నెలరోజుల బాబుతో కలసి అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ దుక్కిపాటి రాజారావు ఆటోలో నూజివీడు ఆస్పత్రికి వెళ్లారు. బాబుకు వైద్యం చేయించి తిరిగి స్వగ్రామం పయనమయ్యారు. మధ్యలో నూజివీడుకు చెందిన ఆమంచి ఫాల్గుణాచారి వీరి ఆటోలో ఎక్కాడు. ఆటో విస్సన్నపేట ఊరు చివర చెరువు వద్దకు వచ్చేసరిగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఆటో ధ్వంసమైంది.
ప్రమాదంలో జుజ్జునూరు లక్ష్మీకాంతం(45), నెల రోజుల బాబు, దుక్కిపాటి రాజారావు (42)అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న చంటి బిడ్డ తల్లి ప్రేమలత, ఫాల్గుణాచారికి తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితికి వెళ్లారు. వీరిని చాట్రాయి 108 సిబ్బంది నూజివీడు ఆస్పత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ సత్యనారాయణ, ఎస్ఐ తులసీధర్ పరిశీలించారు. మృతదేహాలను తిరువూరు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన లక్ష్మీకాంతం, ఆమె మనుమడు మృతి చెందడంతో పాటు కుమార్తె ప్రేమలత పరిస్థితి విషమంగా ఉండడంతో పెద్ద సంఖ్యలో బంధువుల రోదనలు ప్రతిఒక్కరిని చలింపజేశాయి. నెలరోజుల పసికందు మృతి చెందడంతో తల్లడిల్లిపోయారు.