ఎఫ్ఏసీఎస్లో చోరీకి విఫలయత్నం
పెద్దేముల్ సహకార సంఘంలో దొంగల హల్చల్
రెండు తాళాలు ధ్వంసం.. లాకర్ను పగులగొట్టేందుకు దుండగుల యత్నం
కర్ణాటక మద్యం, వార్త పత్రిక, కారంపొడి లభ్యం
ఘటన స్థలం వద్ద క్లూజ్ టీమ్, డాగ్స్వాడ్లతో తనిఖీలు
అంతర్రాష్ట్ర దొంగలా?ఎక్కడి వారని పోలీసుల ఆరా
పెద్దేముల్(తాండూరు): పెద్దేముల్లోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో మంగళవారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. ఈ సంఘటనతో పెద్దేముల్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కార్యాలయంలోని ప్రధాన గేటు తాళాన్ని పగలగొట్టి మూడు బీరువాల్లో డబ్బు కోసం వెతికారు.
అక్కడ ఉన్న కాగితాలను చెల్లాచెదురు చేసేసి లాకర్ను పగలగొట్టేందదుకు తీవ్రంగా ప్రయత్నించారు. తాండూరు రూరల్ సీఐ సైదిరెడ్డి, పెద్దేముల్ ఎస్ఐ వెంకటశ్రీను కథనం ప్రకారం.. పెద్దేముల్లో ఎఫ్ఏసీఎస్ కార్యాలయం ఉంది. మంగళవారం సాయంత్రం సిబ్బంది విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లారు.
బుధవారం ఉదయం 7:30 గంటలకు కార్యాలయంలో ఊడ్చేందుకు స్వీపర్ మాణేప్ప వచ్చాడు. ప్రధాన గేటు తాళాలు పగులగొట్టి ఉండడంతో మాణెప్ప సహకార సంఘం మేనేజర్ మురళీగౌడ్కు తెలిపాడు. కార్యాలయంలో మూడు బీరువాలు తెరిచి ఉన్నాయి.
లాకర్లకు ధ్వంసం చేసేందుకు యత్నించారు.ఘటన స్థలం వద్ద కర్ణాటకకు చెందిన మందుబాటిళ్లు, కన్నడ వార్త పత్రిక, కార్యాలయంలో కారంపొడి దర్శనమిచ్చాయి. మురళీగౌడ్ వెంటనే తాండూరు ఏడీబీ బ్యాంక్ మేనేజర్ జేబీ నాయక్, ఎఫ్ఏసీఎస్ ఎండీ శ్రీనివాస్రావుతో పాటు పెద్దేముల్ ఎస్ఐ వెంకటశ్రీనులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే బ్యాంక్ ఉన్నతాధికారులు ఘటనస్థలానికి చేరుకోని పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాండూరు రూరల్ సీఐ సైదిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకోని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వికారాబాద్ నుంచి క్లూజ్టీంతో పాటు డాగ్స్వాడ్కు రప్పించారు. క్లూజ్ టీం పోలీసులు బీరువాతో పాటు కర్ణాటక మద్యం బాటిళ్లు పరిశీలించారు. లాకర్లో రూ.35 వేలు భద్రంగానే ఉన్నాయని సిబ్బంది తెలిపారు.