చిప్పగిరి (కర్నూలు జిల్లా) : మండల పరిధిలోని రామదుర్గం సమీపంలో కాలువదాటే క్రమంలో గొర్రెల మంద ఒకదానిపైఒకటి దూకి దాదాపు వంద గొర్రెలు మృత్యువాత పడ్డాయి. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో దాదాపు రూ.10 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు అణిగిరి నారాయణప్ప, ఆదెప్ప, నరసింహప్ప, ప్రభాకర్, బండి నారాయణప్పలకు చెందిన దాదాపు 3 వేల గొర్రెలు మేత కోసం మేపుకుంటూ వలస వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి చిప్పగిరి మండల పరిధిలోని రామదుర్గం ఆలూరు బ్రాంచి కెనాల్(ఏబీసీ) అడ్డు రాగా గొర్రెల మంద దాటే క్రమంలో ఒకటిపై ఒకటి అందులో పడిపోయాయి. ఒకటిపై ఒకటి పడటంతో ఊపిరాడక చనిపోయాయి. కాపరులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. నష్టం భారీగా జరగడంతో వారు ప్రభుత్వసాయం కోరారు.