పరకాల: ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో భారీ అవినీతి చోటుచేసుకుందని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా వసూలు చేసిన రూ.4,500 కోట్లు రాహుల్గాంధీకి పంపించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. పరకాలలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల బీజేపీ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఈటల మాట్లాడుతూ.. నల్లగొండలో ఓ వ్యక్తి నడుమంత్రపు సిరితో బీజేపీ ఎక్కడుంది అని అంటున్నారని, రాబోయే ఎన్నికల ఫలితాలే సమాధానం కాబోతాయన్నారు. చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్లు తెలంగాణ ప్రజలంతా కొట్లాడితే వచ్చిన తెలంగాణలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని విమర్శించారు. ప్రశ్నించే గొంతులమంటూ కొందరు అధికార పార్టీలో చేరి ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధిష్టానం చేతిలో పిల్లిలా తయారయ్యారన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటుందనడానికి జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలుస్తాయన్నారు. కేసీఆర్ పార్టీ త్వరలోనే కనుమరుగవడం ఖాయమని, ఆయన చేసిన పాపాలు ఆయనకే తగులుతున్నాయన్నారు. 40 ఏళ్లుగా ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్న గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, నాయకులు డాక్టర్ విజయచందర్రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోశ్కుమార్, డాక్టర్ కాళీప్రసాద్రావు, కాచం గురుప్రసాద్, మురళీధర్రావు, ఆర్పీ జయంత్లాల్ మోహన్రెడ్డి, మార్త భిక్షపతి తదితరులున్నారు.
రూ.4,500 కోట్లు అక్రమంగా వసూలు చేసి.. రాహుల్గాంధీకి అందజేత
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్