![స్ట్రాంగ్ రూమ్ల తనిఖీ](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/17/16vsc96a-320092_mr.jpg.webp?itok=EhISu5Cm)
మహారాణిపేట: ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మల్లికార్జున గురువారం తనిఖీ చేశారు. అక్కడ భద్రతాపరమైన చర్యలను పరిశీలించారు. అన్ని విభాగాల అధికారులు, పోలీస్ సిబ్బంది విధి నిర్వహణపై ఆరా తీశారు. భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక తదితర అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి.. అధికారులు, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అభ్యర్థులను తీసుకెళ్తాం
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గానీ, వారి ఏజెంట్లను గానీ ఏయూలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించడానికి తీసుకెళ్తామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్లకు ఈ నెల 14న సీల్ వేశామని, ప్రవేశ ద్వారం, ఆవరణ కనిపించే విధంగా సీసీ టీవీలను అమర్చినట్లు వివరించారు. ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ను అభ్యర్థులు గానీ, వారి ఏజెంట్లు గానీ చూసేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ల్లో మానిటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, రాత్రి పది గంటలకు పోలీసు సిబ్బంది, అధికారుల సమక్షంలో అభ్యర్థులను గానీ, వారి ఏజెంట్లను గానీ స్ట్రాంగ్ రూమ్ సీల్లను పరిశీలించడానికి తీసుకెళ్తామన్నారు. సీల్, సంతకం చేసిన కాగితాలను తాకడం, ఇతర కార్యకలాపాలు చేపట్టడానికి అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.