భవిష్యత్ను తీర్చిదిద్దేలా
చదువులు సాగాలి
విశాఖ విద్య: విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేలా పాఠశాలల్లో చదువులు సాగాలని విశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎం. జ్యోతి కుమారి అన్నారు. జోన్–1 పరిధిలోని ఆరు జిల్లాల డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలతో శనివారం విశాఖలోని ఆర్జేడీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారుల తనిఖీలతో విద్యార్థుల సామర్థ్యాలు పెరిగే విధంగా ఫలితాలు కనిపించాలన్నారు. 10వ తరగతిలో శతశాతం ఫలితాలు సాధించేలా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకోసం పాఠశాలల సందర్శన సమయంలో ఉపాధ్యాయులకు సూచనలిస్తూ.. వారిని అప్రమత్తం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యా పథకాలను నిరంతరం పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు నెలవారీ నివేదికలు జోనల్ కార్యాలయానికి అందజేయాలన్నారు. రాష్ట్ర విద్యా కమిషనర్ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ వై.వినయమోహన్ మాట్లాడుతూ ఎంఈవోలు నెలలో తప్పనిసరిగా 10 పాఠశాలలను సందర్శించాలన్నారు. ఐదు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి.. నివేదికలు సకాలంలో సమర్పించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేస్తామని పలువురు ఎంఈవోలు అన్నారు. ఆర్జేడీ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ గేదెల శ్రీరాంమూర్తి, విశాఖ, అనకాపల్లి, బొబ్బిలి, శ్రీకాకుళం, విజయనగరం డిప్యూటీ డీఈవోలు గౌరీ శంకర్, అప్పారావు, బ్రహ్మాజీ, విజయ కుమారి, వాసుదేవరావు, విశాఖ జిల్లా విద్యా దశిక్షణ సంస్థ అధ్యాపకుడు గొట్టేటి రవి తదితరులు పాల్గొన్నారు.