తిరుమల/ తిరుచానూరు (చంద్రగిరి) : కార్తీకమాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శోభాయమానంగా పుష్పయాగ మహోత్సవం నిర్వహించారు. 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. బ్రహ్మోత్సవ సమయంలో తెలిసో తెలియకో జరిగిన దోష నివారణార్థం పుష్పయాగం జరిపించడం ఆనవాయితీ. మొత్తం 8 టన్నుల పుష్పాలను యాగంలో వినియోగించారు. టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు.
తిరుచానూరులో..
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం వైభవంగా పుష్పయాగం నిర్వహించారు. సిరులతల్లికి 14 రకాలు పుష్పాలు, 6 రకాల పత్రాలను నివేదించారు. తిరుమల శ్రీవారికి, తిరుచానూరు అమ్మవారికి ఒకే రోజు పుష్పయాగం నిర్వహించడం అపురూపంగా భక్తులు భావిస్తున్నారు.