భానుపురి (సూర్యాపేట) : లోక్సభ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ ఎస్. వెంకటరావు మంగళవారం ఒక ప్రకటనలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు జిల్లా ప్రజల సహాయ సహకారాలు, భాగస్వామ్యం మరవలేనిదని పేర్కొన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో చైతన్యం చాటారని, దీంతో గత పార్లమెంటు ఎన్నికల కంటే అధికంగా పోలింగ్ నమోదైందని తెలిపారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 1,91,945 ఓట్లు పోల్ కాగా 76.34 శాతం పోలింగ్ నమోదైంది, కోదాడలో 1,84,415ఓట్లు పోల్ కాగా 75.21 శాతం, సూర్యాపేటలో 1,78,378 ఓట్లు పోల్ కాగా 73.07 శాతం, భువనగిరి లోక్సభ నియోజకవర్గంలోని తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో 1,92,005ఓట్లు పోల్ కాగా 74.06 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 3,70,026మంది పురుషులు, 3,76,686 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,000,012 ఓట్లకు 7,46,743 పోలయ్యాయని, 74.67 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు.
ఫ కలెక్టర్ వెంకటరావు