● కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు
● పోలీసు అధికారుల సమీక్షలో ఎస్పీ రాధిక
శ్రీకాకుళం క్రైమ్ : కౌంటింగ్ సమయంలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ జి.ఆర్.రాధిక తెలిపారు. ఓట్ల లెక్కింపు నాడు తీసుకోవాల్సిన చర్యలు, బందో బ స్తు ఏర్పాట్లపై డీఎస్పీలు, సీఐలతో శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ జూన్ 4న ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద జరగనుందని, అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీసులతో మూడంచెల బందోబస్తు ఏర్పా ట్లు చేపడుతున్నామన్నారు. కేంద్రాల వద్ద ట్రాఫిక్ రెగ్యులేషన్, వాహనాల పార్కింగ్కు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలన్నారు. 144 సెక్షన్ పక్కాగా అమలు చేస్తూ ప్రజలు గూమిగూడకుండా చూడాలన్నారు.కేంద్రాల్లోకి వెళ్లే కౌంటింగ్ ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, రిటర్నింగ్ అధికారి జారీ చేసి న అనుమతిపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలకు అనుమతించాలన్నారు. ఫలితాలు వెల్లడైన తర్వాత జిల్లాలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా పేలుళ్లకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. శాంతియుతంగా కౌంటింగ్ పూర్తయ్యేలాగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు ప్రేమ్కాజల్, ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.