పుట్టపర్తి టౌన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన సందర్భంగా బుధవారం పుట్టపర్తిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రానికే పోలీసులు ప్రశాంతి నిలయంతో పాటు పుట్టపర్తి పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎస్పీ మాధవరెడ్డి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన పోలీస్ కార్యాలయ ఆవరణంలో రాష్ట్రపతి బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులకు, సిబ్బందితో సమావేశమయ్యారు. సెక్టార్ ఇన్చార్జ్ అధికారులు, సిబ్బందికి భద్రతపై సూచనలు, సలహాలు ఇచ్చారు. బుధవారం రాష్ట్రపతి ముర్మ వాయుసేన విమానంలో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారని, రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఉషశ్రీచరణ్ స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం రాష్ట్రపతి రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయంలో చేరుకుంటారన్నారు. రాష్ట్రపతి వెళ్లే మార్గంలో ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తును నిర్వహించాలని ఎస్పీ సూచించారు. రాష్ట్రపతి శ్రీనివాస గెస్ట్ హౌస్, సాయిహీరా కన్వెన్షన్ హాలులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఆయా చోట్ల ఎలాంటి భద్రతా లోపాలులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గురువారం జరిగే సత్యసాయిబాబా జయంత్యుత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాటు తదితర వాటిపై సూచనలిచ్చారు.
కాన్వాయ్ రిహార్సల్స్ పరిశీలన
రాష్ట్రపతి ద్రౌపది ముర్మ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు మంగళవారం కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. డీఐజీ రవిప్రకాశ్, శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల ఎస్పీలు మాధవరెడ్డి, అన్బురాజన్, సిద్ధార్థ కౌశల్ తదితరులు విమానాశ్రయం నుంచి సాయి కుల్వంత్హాలు, హీరా కన్వెన్షన్హాలు వరకు కాన్వాయ్ రిహార్సల్స్ను పరిశీలించారు.
భారీ బందోబస్తు
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఐదుగురు ఐపీఎస్లు, 15 మంది అడిషనల్ ఎస్పీలు, 40 మంది డీఎస్పీలు, 70 మంది సీఐలు, 170 మంది ఎస్ఐలతోపాటు నేషనల్ సెక్యూరిటీ సిబ్బంది, గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలు, ఏఆర్ సిబ్బంది, పలురు హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధులు నిర్వర్థించనున్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
సిబ్బందికి ఎస్పీ మాధవరెడ్డి దిశానిర్దేశం
కాన్వాయ్ రిహార్సల్స్ పరిశీలించిన డీఐజీ రవిప్రకాశ్