పుట్టపర్తి టౌన్: చట్టపరిధిలో సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని ‘దిశ’ పోలీసుస్టేషన్ డీఎస్పీ వరప్రసాద్ ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ‘స్పందన’ నిర్వహించారు. 33 అర్జీలు స్వీకరించారు. సమస్యలు విన్న అనంతరం సంబంధిత పోలీసుస్టేషన్ల అధికారులతో ఫోన్లో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించరాదన్నారు. వీలైనంత త్వరగా న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
తాడిపత్రి టౌన్: రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నేషనల్ హైవే పీడీ తరుణ్ కాంట్రాక్టర్లకు సూచించారు. తాడిపత్రి పట్టణ సమీపంలోని కడప రోడ్డులో జరుగుతున్న నేషనల్ హైవే 544డీ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి నాణ్యమైన మట్టి ఉపయోగించాలన్నారు. మట్టి రోడ్డు రోలింగ్ పనులు ప్రతి లేయర్లో పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు.
అక్కనపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలి
మండలంలోని అక్కనపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానికులు ఆలూరు రామేశ్వరరెడ్డి, ప్రతాప్, సూర్యముని ఎన్హెచ్ పీడీని కోరారు. నేషనల్ హైవే కారణంగా గ్రామానికి వెళ్లాల్సిన రహదారిని కోల్పోతున్నామని, దీంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. హైవే మీదుగా గ్రామానికి ట్రాక్టర్లు, బండ్లు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మించాలని కోరారు. ఇందుకు పీడీ సానుకూలంగా స్పందించారు.