సర్కిల్‌ వాల్‌ను ఢీకొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

సర్కిల్‌ వాల్‌ను ఢీకొట్టిన కారు

Published Sun, Jun 16 2024 10:44 AM | Last Updated on Sun, Jun 16 2024 10:44 AM

సర్కిల్‌ వాల్‌ను ఢీకొట్టిన కారు

రామచంద్రాపురం(పటాన్‌చెరు): మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వెళ్లిన ఓ కారు రేడియల్‌ రోడ్డుపై సర్కిల్‌ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన తెల్లాపూర్‌లో శనివారం జరిగింది. కొల్లూర్‌ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మూసాపేట్‌ ప్రాంతానికి చెందిన చంద్ర జీహెచ్‌ఎంసీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 5గంటల సమయంలో తన మిత్రుడితో కలసి కారులో ఇందిరానగర్‌ నుంచి తెల్లాపూర్‌ వైపు బయలుదేరాడు. మితిమీరిన వేగంతో వెళ్లి రోడ్డపై ఉన్న సర్కిల్‌ను ఢీకొట్టాడు. దీంతో కారులో ఉన్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కారు నడుపుతున్న చంద్ర మద్యం తాగినట్టు పోలీసులు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మూడు ప్రయివేట్‌ స్కూళ్లకు

షోకాజ్‌ నోటీసులు

పటాన్‌చెరు టౌన్‌: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్స్‌ విక్రయిస్తూ, ట్యూషన్‌ ఫీజులు, అడ్మిషన్‌ ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు డీఈఓ వెంకటేశ్వర్లు శనివారం మూడు స్కూళ్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ పీపీ రాథోడ్‌ సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌, శిశు విహార్‌ స్కూల్‌, అమీన్‌పూర్‌ పరిధిలోని శ్రీనిధి గ్లోబల్‌ స్కూళ్లకు నోటీసులు అందజేశారు.

పోక్సో కేసులో మహిళ అరెస్టు

సిద్దిపేటకమాన్‌: పోక్సో కేసులో నిందితురాలైన ఓ మహిళను టూటౌన్‌ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఉపేందర్‌ కథనం ప్రకారం.. సోలంకి అలియాస్‌ గైక్వాడ్‌ రాధ తన భర్త విజయ్‌, వారి పిల్లలతో కలిసి హనుమాన్‌ నగర్‌లోని ఓ ఇంట్లో మూడు సంవత్సరాల నుంచి అద్దెకు ఉంటోంది. ఆమె ఇంటి యజమాని కుమారుడైన బాలుడికి మాయమాటలు చెప్పి శారీరక సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో వారింట్లో బంగారం, నగదు తెప్పించుకుని తన భర్త, పిల్లలను వదిలేసి ఆ బాలుడితో గత జనవరి 22న చైన్నెకు వెళ్లిపోయింది. తన కొడుకు కనిపించడం లేదని బాలుడి తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఫోక్సో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. తనను ఎలాగైనా పట్టుకుంటారని భావించిన మహిళ 11వ తేదీన బాలుడిని చైన్నె నుంచి తీసుకవచ్చి సిద్దిపేటలో వదిలిపెట్టడంతో అతడు తన ఇంటికి చేరుకున్నాడు. తర్వాత బాలుడు చెప్పిన సమాచారంతో దర్యాప్తుచేసి నిందితురాలిని పట్టుకున్నారు. శనివారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉపేందర్‌ తెలిపారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

కంది(సంగారెడ్డి): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండల కేంద్రమైన కందిలో చోటు చేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌ కథనం ప్రకారం.. కందికి చెందిన మహమ్మద్‌ ఇంతియాజ్‌ సీసీ కెమెరాల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారం క్రితం కశ్మీర్‌ కు విహారయాత్రకు వెళ్లి తిరిగి శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చాడు. తలుపులు తెరిచి ఉండడంతో లోనికి వెళ్లి చూడగా 20సీసీ కెమెరాలు, 16 తులాల వెండి, రూ.12వేలు నగదు చోరీ అయినట్లు గుర్తించాడు. బాధితుడు ఇంతియాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement