![ఇంటి](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/landimages_mr.jpg.webp?itok=B4EYBAfS)
ఆ స్థలంలో ఇల్లు లేకున్నా ఉన్నట్లుగా దొంగ తక్పట్టీలు సృష్టించి 59 జీఓకు దరఖాస్తు చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో 4–47/5/ఏ, 4–47/5/బీ, 4–47/5/సీ, 4–47/5/డీ, 4–47/5/ఈ, 4–47/5/ఎఫ్ ఇంటి నెంబర్లు గ్రామ పంచాయతీ నుంచి జారీ చేయకున్నా.. కేటాయించినట్లు దరఖాస్తు చేశారు. తక్పట్టీలు దొంగవి సృష్టించి 59 జీఓ కోసం దరఖాస్తు చేశారు. ఇలా దొంగ తక్పట్టీలు ఒక్క మిట్టపల్లి పరిధిలోనే కాకుండా చాలా చోట్ల సృష్టించి ప్రభుత్వంను, అధికారులను తప్పుతోవ పట్టించి ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారు. ఈ ఇంటి నంబర్లు జారీ చేయలేదని, రికార్డుల్లో లేదని మిట్టపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్ తెలిపారు.
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ స్థలాల్లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారికి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం 58, 59 జీఓలను విడుదల చేసింది. ఇదే అదనుగా చేసుకొని కొందరు రియల్టర్లు, భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను అధికారుల సహకారంతో పాగా వేసి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేశారు. ఎన్నికల ముందు అధికారులు ఎలాంటి పరిశీలన లేకుండానే అందరికీ క్రమబద్ధీకరించారు. దీంతో ప్రభుత్వ స్థలాలు భూ కబ్జాదారుల చేతుల్లో చేరిపోయాయి.
జిల్లా వ్యాప్తంగా 8,304 దరఖాస్తులు
ప్రభుత్వ స్థలాల్లో 2014 కంటే ముందు ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి క్రమబద్ధీకరణ చేసేందుకు 58, 59 జీవోలను ప్రభుత్వం విడుదల చేసి మార్చి 31, 2022 వరకు దరఖాస్తులను స్వీకరించారు. 4,196 మంది దరఖాస్తు చేశారు. మరోసారి జీఓను పునరుద్ధరించి జూన్ 2, 2020 వరకు ఇంటి నిర్మాణం చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని అవకాశం కల్పించారు. మే 31, 2023 వరకు దరఖాస్తులు స్వీకరించగా 4,018 వచ్చాయి. 2020 జూన్ 2 వ తేదీ కంటే ముందు నిర్మించిన ఇంటి వివరాలు, ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లు, కుళాయి పన్ను, స్థలం సంక్రమించిన తీరు, సర్వే నంబర్లు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలు తదితర వాటితో ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. వీటి పరిశీలనకు జిల్లా అధికారులను ఒక్కో మండలానికి కేటాయించి దరఖాస్తులను పరిశీలించి డిమాండ్ నోటీసులు జారీ చేశారు. మూడు దఫాల్లో రుసుమును చెల్లించే వెసులు బాటును కల్పించారు. 58 జీఓకు సంబంధించిన దరఖాస్తుల్లో 125 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మాణాలు చేపడితే ప్రభుత్వం ఉచితంగానే క్రమబద్ధీకరించారు. 59 జీఓలో పరిధిలోకి 250 చదరపు గజాలలోపు ఉన్నవాటిని మార్కెట్ విలువలో 50 శాతం, 250 నుంచి 500 గజాలలోపు ఉన్న ఇళ్లకు 75 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే వందశాతం రుసుము వసూలు చేశారు.
ఫేక్ తక్పట్టీల వెనుక ఓ స్థానిక ప్రజాప్రతినిధి
ఈ ఫేక్ తక్పట్టీల వెనుక ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రజాప్రతినిధి స్వయంగా ప్రింటింగ్ చేయించి చాలా మందికి ఇలా తక్ పట్టీలు రాసి ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో తక్పట్టీకి స్థలంను బట్టీ డబ్బులు వసూలు చేశారని తెలిసింది. ఇలా దొంగ తక్పట్టీలను సృష్టించి ఇచ్చారు.
ఇంటి నంబర్ రికార్డుల్లో పరిశీలించకుండానే...
దరఖాస్తు దారుడు పేర్కొన్న ఇంటి నంబర్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ రికార్డుల్లో ఉందా లేదా అని పరిశీలించకుండానే పలువురు అధికారులు ఆమోదం తెలిపారు. అలాగే ఆ స్థలంలో దరఖాస్తు దారుడు ఇంటి నిర్మాణం చేశాడా లేదా అని సైతం పరిశీలించలేదు. విచారణలో భాగంగా ఇంటి ముందు దరఖాస్తు దారుడి ఫొటోను కూడా తీసుకోవాల్సిండగా ఇతరుల గృహాల వద్ద ఫొటోలు తీసి ఆన్లైన్లో అధికారులు అప్లోడ్ చేశారు. పరిశీలనకు వెళ్లిన అధికారులు పలువురు కాసులకు ఆశ పడి ప్రభుత్వ నిబంధనలను తుంగలోతొక్కారని ప్రచారం జరుగుతోంది. ఇల్లే లేకుండా దొంగ తక్ పట్టీలు, ఇంటి నంబర్ను సృష్టించిన వారి దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
59 జీఓకు దరఖాస్తులు
దొంగ తక్పట్టీలను సృష్టించిన
పలువురు దరఖాస్తు దారులు
జిల్లాలో 8వేల మంది
క్రమ బద్ధీకరణకు దరఖాస్తు
ఇంటినంబర్లు రికార్డుల్లో
పరిశీలించకుండానే
పలువురు అధికారులు అమోదం
ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం
చర్యలు తీసుకుంటాం
ఇంటి నిర్మాణం చేపడితేనే ఇంటి నంబర్ను గ్రామ పంచాయతీ కేటాయిస్తుంది. ఎవరైనా తప్పుడు తక్పట్టీలు ద్వారా ఇంటి నంబర్లు వేసుకుంటే చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారి పై క్రిమినల్ కేసులు సైతం పెడుతాం.
– దేవకి దేవి, డీపీఓ
![ఇంటి నంబర్లు ‘ఫేక్’](/sites/default/files/gallery_images/2024/05/25/fakehouse_mr.jpg)
ఇంటి నంబర్లు ‘ఫేక్’
![ఇంటి నంబర్లు ‘ఫేక్’](/sites/default/files/gallery_images/2024/05/25/landpapers_mr.jpg)
ఇంటి నంబర్లు ‘ఫేక్’
![ఇంటి నంబర్లు ‘ఫేక్’](/sites/default/files/gallery_images/2024/05/25/23sdp13-604904_mr.jpg)
ఇంటి నంబర్లు ‘ఫేక్’