● టుబాకో బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు
ఒంగోలు సెంట్రల్: పొగాకు రైతులు పచ్చిరొట్ట పైర్లను విరివిగా పెంచి భూసారం పెంపొందించుకోవాలని టుబాకో బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు సూచించారు. బుధవారం ఆయన కార్యాలయంలో రైతులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. రైతులకు పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యతను వివరించి ఎక్కువ మొత్తంలో సాగయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. నేల భౌతిక లక్షణాలు పెంపొందించడం, నత్రజని, ఇతర పోషకాలు లోపలి పొరలకు ప్రవేశించడం, కలుపు మొక్కలను సమూలంగా నిర్మూలించేందుకు పచ్చిరొట్ట పైర్లు ఉపయోగపడతాయని చెప్పారు. ఎకరానికి 15 నుంచి 20 కేజీల విత్తనాలు చల్లి 50 నుంచి 55 రోజుల తర్వాత అంటే పూత దశకు రాక ముందే పంటను నేలలో కలియదున్నితే భూసారం పెరిగి తర్వాత సాగు చేసే పంట దిగుబడి పెరుగుతుందని చెప్పారు. అలాగే భూమికి నీటిని నిల్వచేసే సామర్థం పెరుగుతుందని, రసాయనిక ఎరువులు వేసే పరిమాణం కూడ తగ్గుతుందని చెప్పారు. సేంద్రియ కర్బన శాతం కూడా పెరుగుతుందన్నారు. విరివిగా పచ్చి రొట్ట పైర్లు వేసి నాణ్యమైన పొగాకు ఉత్పిత్తి చేయాలని సూచించారు. రైతు సంఘ నాయకులు, ఐటీసీ, జీపీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment