విజయనగరం రూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలకు విజన్ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని వీటీ అగ్రహారంలో ఉన్న టీటీడీసీలో మంగళవారం ప్రారంభమైంది. విజయనగరం మండలంలోని 25 మంది మండల, గ్రామైక్య సంఘాల అధ్యక్షులు, డీఆర్డీఏ– వైఎస్సార్ క్రాంతి పథం సిబ్బంది, జిల్లాలోని 10 మండలాల ఏపీఎంలు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన డీపీఎంఎస్, విశాఖ జిల్లా ఏపీఎంలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన మోడల్ మండలాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల పెంపు, సాంస్కృతిక మార్పు, నిర్మాణాత్మక అసమానతలను అధిగమించడం, జీవనోపాధుల మెరుగుకు ప్రణాళిక తయారీ, మహిళా నాయకుల సన్నద్ధత తదితర అంశాలపై శిక్షణ అందించారు.
ఐదేళ్లలో వ్యాపార అభివృద్ధి, వార్షిక కార్యచరణ ప్రణాళిక తయారు చేయడంతోపాటు, వాటి అమలుకు తగు చర్యలు తీసుకోవడం, మహిళా సమాఖ్యల మనుగడ సాధించే దిశగా నడిపించాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో సెర్ప్ ఎగ్జిక్యూటివ్ కె.వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ–వైకేపీ అదనపు పథక సంచాలకులు కె.సావిత్రి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.