పాలకొండ రూరల్: పాలకొండలో ఈ నెల 24న తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఏపీ శాసనమండలి ప్రభుత్వ విప్, ఉత్తరాంధ్ర బస్సు యాత్ర ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. యాత్ర నిర్వహణ, విజయవంతపై మంగళవారం పాలకొండలో సమాలోచనలు చేశారు. ఆ రోజు చిన్న మంగళాపురం గ్రామంలో ఆర్బీకే, సచివాలయ భవనాల ప్రారంభం, అనంతరం ప్రారంభం కానున్న యాత్ర ఏర్పాట్లపై ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఏపీ శాసనమండలి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ను అగిడి తెలుసుకున్నారు. బహిరంగ సభ నిర్వహణకు ఆర్సీఎం లూర్ధుమాత ఆలయ రహ దారిలోని స్థలాన్ని పరిశీలించారు. అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి, సామాజిక న్యాయంను ప్రజలకు వివరించడమే యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తున్న మేలు నలుదిశలా ప్రతిధ్వనించాలన్నారు. పార్టీ క్యాడర్ సంపూర్ణ సహకారంతో బస్సుయాత్రను ‘జనజాతర’గా మలచాలన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు, నవరత్నాల వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, పాలకొండ నగర పంచాయతీ పాలక మండలి సభ్యులు, ఎంపీపీ బి.భాను, వైస్ ఎంపీపీలు కె.సూర్యప్రకాష్, వి.అనీల్కుమార్ తదితరులు ఉన్నారు.
యాత్ర నిర్వహణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన లేళ్ల అప్పిరెడ్డి
బహిరంగ సభకు ఆర్సీఎం లూర్దుమాత ఆలయ రహదారి వద్ద స్థల పరిశీలన