ఇబ్రహీంపట్నం: ఎంఈవో సీహెచ్ పుష్పలతపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వీసెస్) జి.రాజేశ్వరి గురువారం ఎంఈవో కార్యాలయంలో విచారణ జరిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంఈవో పుష్పలత ఐదు మండలాలకు ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఉపాధ్యాయులు ఇన్కామ్ ట్యాక్స్ చెల్లింపులు ఈ–ఫైలింగ్ చేసే నిమిత్తం డబ్బులు డిమాండ్ చేసినట్లు వివిధ యూనియన్ నాయకులు జగ్గయ్యపేట ప్రాంతంలో ఓ పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చారు. అప్పట్లో దీనిపై విచారణ చేపట్టిన నందిగామ డీవైఈవో వెంకటసుబ్బయ్య జిల్లా విద్యాశాఖ అధికారులకు నివేదిక అందించారు. డీవైఈవో నివేధికపై విచారణ అధికారిగా జిల్లా విద్యాశాఖ డైరెక్టర్ రాజేశ్వరితో మరోసారి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమక్షంలో విచారణ చేపట్టిన రాజేశ్వరి పూర్తి నివేదిక జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఎంఈవో పుష్పలత ఏపని చేయాలన్నా డబ్బులు ఇవ్వనిదే చేయదని ఉపాధ్యాయులు బహిరంగా చెప్పడం గమనార్హం.