● ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ వెల్లడి
కర్నూలు(టౌన్): ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. సోమ వారం స్థానిక అబ్దుల్లా ఖాన్ ఎస్ట్టేట్లోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాటు తన్ని తగలేసిన చంద్రబాబు వంచన చేరిన మందకృష్ణ మాదిగ ఆయనకు ఎంతకు అమ్ముడుపోయాడో ప్రజలకు తెలపాలన్నారు. రోడ్ల మీద తిట్టి ఇంట్లో కాళ్లు పట్టుకునే నైజం మందకృష్ణదన్నారు. చంద్రబాబు నెంబర్ వన్ మోసగాడు అని, ప్రాణహాని ఉందని చెప్పి ఇప్పుడు ఆయన చెంతకు చేరడం వెనుక రహస్య ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. మాదిగ కులాలను రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టే నీచ సంస్కృతి ఆయనదన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీలు, దళిత వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారన్నారు. మాదిగలు జగనన్న వైపు ఉన్నారని, వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి పనిచేస్తామన్నారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్ అకెపోగు రాజరత్నం, సుందర్రాజు, పేరపోగు రమేష్, ఎమ్మార్పీఎస్ యువజన విభాగం నాయుకులు డేవిడ్ పాల్గొన్నారు.