ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక ఏకాదశిని పురస్కరించుకుని గురువారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శనానికి ప్రముఖులు తరలివచ్చారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆది దంపతుల దర్శనానికి విచ్చేసిన మంత్రిని ఆలయ ఈవో కేఎస్ రామారావు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను బహూకరించారు.
భక్తిశ్రద్ధలతో హోమం..
దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకోగా, ఆలయ ఈవో కేఎస్ రామారావు ప్రసాదాలను అందజేశారు.
దుర్గమ్మ సేవలో క్రికెట్ అండర్–19 బృందం
ఇండియన్ క్రికెట్ అండర్–19 బృంద సభ్యులు గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన క్రికెట్ బృందాన్ని ఆలయ ఈవో కేఎస్ రామారావు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, బచ్చు మాధవీకృష్ణ, ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం రాజగోపురం ఎదుట గ్రూప్ ఫొటోలు దిగారు. క్రికెట్ బృందం సభ్యులతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపారు.