ఖమ్మంమయూరిసెంటర్: ఈము రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేలా చూడాలని పలువురు కోరారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును ఖమ్మంలో పలువురు కలిసి వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈము రైతులకు సబ్సిడీ ఇస్తున్నట్లుగా తెలంగాణలో కూడా ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ఈము రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డితో పాటు గరికపాటి వెంకట్రావు, శ్రీనివాస్, ఆదినారాయణ, వీరయ్య, పాపిరెడ్డి, భరత్, గోవిందరావు, కృష్ణంరాజు, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యాంపై నుంచి జలాశయాన్ని, పర్యావరణ కేంద్రంలోని బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. 850 మంది కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.28,770, 400 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్కు రూ.20,010 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్రగాయాలు
వైరారూరల్: వైరా మండలం గొల్లపూడిలోని వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని లారీ ఢీ కొట్టగా తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన వృద్ధురాలు హరిదాసు ధనమ్మ రోడ్డు దాటుతుండగా వైరా వైపు నుంచి వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధనమ్మను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ ఘటనాస్థలిలోనే లారీని వదిలేసి పరారు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.