● ‘మెచ్చా’ను మరోసారి ఆశీర్వదించండి ● అశ్వారావుపేట రోడ్షోలో కేటీఆర్
అశ్వారావుపేట: తెలంగాణ సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని మంత్రి కేటీఆర్ అన్నారు. అశ్వారావుపేటలో ఆదివారం నిర్వహించిన రోడ్షోలో మాట్లాడుతూ.. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోనే అత్యధికంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 25,957 ఎకరాల పోడు భూములకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరరావు పట్టాలు సాధించారని, అశ్వారావుపేట అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. 80 శాతం గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించామని, ఆయిల్పామ్ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని పెంచుకున్నామని, ఆస్పత్రిని 100 పడకలకు విస్తరించామని, 48 తండాలను పంచాయతీలుగా చేశామని వివరించారు. దమ్మపేట లో కోర్టు ఏర్పాటు చేశామన్నారు. మెచ్చా నాగేశ్వరరావు చేస్తున్న అభివృద్ధి చూసి మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2014కు ముందు, ఆ తర్వాత అశ్వారావుపేటలో వచ్చిన వ్యత్సాసాన్ని గమనించి ఓట్లేయాలన్నారు. 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదని రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ వాళ్లకు రెండు బస్సులు పెడతాం.. బిర్యానీ కూడా తినిపిస్తాం.. ఏ ఊరికై నా వెళ్లి కరెంటు తీగలను పట్టుకోమనండి.. దరిద్రం వదిలిపోతుందని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే వినాయకపురం, పట్వారిగూడెం మండలాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అశ్వారావుపేటను మున్సిపాలిటీ చేస్తామని చెప్పారు. ఆయిల్పామ్కు మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీలు బండి పార్థసారధిరెడ్డి, నామా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment