దొడ్డబళ్లాపురం: రామనగర జిల్లాను బెంగళూరు దక్షిణ జిల్లాగా పేరు మారుస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏరోజైతే ప్రకటించారో ఆరోజు నుంచే ఆయన ఆ దిశలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆయన తన పని చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా బిడది టౌన్ ప్లానింగ్ అథారిటీని రద్దు చేసి గ్రేటర్ బెంగళూరు ప్లానింగ్ అథారిటీగా మార్చాలని ఆదేశించినట్టు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. అంతేకాదు మెట్రో సేవలు బిడది వరకూ విస్తరింపజేస్తామని కూడా హామీ ఇచ్చారు. శుక్రవారం బిడదిలోని టొయోటా కిర్లోస్కర్ సంస్థ ఆవరణలో నూతనంగా నిర్మించిన ట్రైనింగ్ సెంటర్ కట్టడాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ బిడది పారిశ్రామికవాడలో లక్షమందికి పైగా పనిచేస్తున్నారని, వీంరందరి రాకపోకలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ మనవి మేరకు ప్లాన్ సిద్ధం చేయాలని బీఎంఆర్సీఎల్కు సూచించానన్నారు. బిడది పరిధిలో సుమారు 10వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ఎందుకూ ఉపయోగించకుండా వదిలేశారన్నారు. బెంగళూరులో లభించే సౌకర్యాలు ఇక్కడా లభించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అందుకే పైరెండు పథకాలను ఈరోజు ప్రకటించానన్నారు. ఈ పథకాలు అమలయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అదేవిధంగా ఆస్తుల విలువ కూడా పెరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఆస్పత్రులు, విద్యాసంస్థలు, కార్మికులు వారి పిల్లలు ఇలా అందరికీ మేలు జరగాలనే ఈ పథకాలు అమలు చేయాలనుకుంటున్నానన్నారు. టొయోటా సంస్థ ఆడపిల్లల కోసం ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించడం శుభపరిణామమన్నారు. మహిళలకు శక్తి ఇవ్వాలనేది తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. రాబోవు ఎన్నికల వేళకు మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించి ఈ ప్రాంతంలో మహిళా జనప్రతినిధులను ఎన్నుకుంటామన్నారు.
బిడది టౌన్ ప్లానింగ్ అథారిటీని రద్దుచేసి గ్రేటర్ బెంగళూరు ప్లానింగ్
అథారిటీగా మార్పు
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్