సాక్షి, మేడ్చల్ జిల్లా: ‘నాకు ఊపిరి పోసిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు రుణ పడి ఉంటాను..నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. నాడు మీరు పోసిన ఊపిరి..నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఉద్వేగభరితంగా మల్కాజిగిరి లోక్సభ ప్రజలను ఉద్దేశిస్తూ ఓ బహిరంగ లేఖను రాశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్గిరి అని లేఖలో పేర్కొన్నారు.
‘ఈ రోజు మీ రేవంతన్న సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగరేసిందంటే దానికి పునాదులు పడింది మల్కాజిగిరిలోనే’ అని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్కు ఎంతటి ప్రాధాన్యంఉందో... మల్కాజిగిరికీ అంతే ప్రాధాన్యం ఉందన్నారు. తనను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజిగిరి ప్రజలదేనని, ఏ విశ్వాసంతో, ఏ అభిమానంతో తనను గెలిపించారో ఐదేండ్లు మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశానని రేవంత్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ప్రజలకు పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదా తెల్పుతున్నానని, ఐదేళ్లే కాదు ఇక మీతో నా అనుబంధం... నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. మల్కాజిగిరికి ఎప్పటికీ రుణపడి ఉంటా అని పేర్కొన్నారు.