గుంటూరు మెడికల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదల పెద్దాసుపత్రిగా గుంటూరు జీజీహెచ్ పేరు గడించింది. గత ప్రభుత్వంలో టార్చిలైట్ వెలుతురులో ఆపరేషన్లు.. ఎలుకల దాడిలో పసికందు మృతి లాంటి ఘటనలతో ఆస్పత్రి ప్రతిష్ట మసకబారింది. పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందించటమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు జీజీహెచ్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో 110 పోస్టులు భర్తీ చేసేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అనుమతులు మంజూరు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే జీజీహెచ్లో కనీవినీ ఎరుగని రీతిలో 250 స్టాఫ్నర్సుల పోస్టులు మంజూరు చేశారు. నూతనంగా హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ వైద్య విభాగాలను మంజూరు చేశారు. యూరాలజీ, న్యూరాలజీలో అదనపు యూనిట్లను మంజూరు చేశారు. నూతనంగా 15 అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులనూ మంజూరు చేశారు. పారా మెడికల్ పోస్టులు భారీగా భర్తీచేశారు.
రూ.కోట్లతో వైద్య పరికరాలు..
ఆసుపత్రి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గుంటూరు జీజీహెచ్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రూ.కోట్లు ఖరీదు చేసే వైద్య పరికరాలు మంజూరు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే దీటుగా అత్యాధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు నిరుపేదలకు నేడు ఉచితంగా జీజీహెచ్లో లభిస్తున్నాయి. క్యాన్సర్ సెంటర్లో రెండు నెలల క్రితం రూ.25 కోట్లు ఖరీదు చేసే పెట్సిటీ పరికరాన్ని మంజూరు చేశారు. ఆసుపత్రికి రూ. 4 కోట్లు ఖరీదుచేసే సిటీస్కాన్ పరికరాన్ని ఇటీవల కాలంలో మంజూరు చేశారు. రూ.15 కోట్ల ఖరీదు చేసే లీనియర్ యాక్సిలేటర్, రూ. 40 లక్షలు ఖరీదు చేసే సీఆర్మ్ పరికరాలు, రూ. 25 లక్షలు ఖరీదు చేసే కొలనోస్కోపి, రూ.30 లక్షలు ఖరీదు చేసే ఏబీజీ మిషన్లు, రూ.25 లక్షలు ఖరీదు చేసే మైక్రోస్కోప్, రూ.30 లక్షలు ఖరీదు చేసే ఆపరేషన్ లైట్లు, రూ.15 లక్షలు ఖరీదు చేసే మానిటర్స్, రూ.16 లక్షలు ఖరీదు చేసే ఓటీ కార్డ్స్, రూ.20 లక్షలు ఖరీదు చేసే ఎకోమిషన్, ఎన్ఐసీయూ, పీఐసీయూలో రూ.కోటి ఖరీదు చేసే వైద్య పరికరాలను మంజూరు చేశారు. కోవిడ్లో ఆసుపత్రి మొత్తం ఆక్సిజన్ సరఫరా జరిగేలా ప్లాంట్ల నిర్మాణం, ఆక్సిజన్ పైపుల నిర్మాణం చేయడంతోపాటు, 200లకుపైగా వెంటిలేటర్లను ప్రభుత్వం సరఫరా చేసింది.
రూ. 80 కోట్లతో ఎంసీహెచ్ వార్డు
జీజీహెచ్ అభివృద్ధిపై
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఆస్పత్రిలో 110 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
కోట్లాది రూపాయల వైద్య
పరికరాలు మంజూరు
సివిల్, ఎలక్ట్రికల్ పనుల కోసం
ప్రత్యేక నిధులు
భవన నిర్మాణాల కోసం
రూ.కోట్లు విడుదల
జీజీహెచ్కు స్వర్ణయుగం..
వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన కాలం జీజీహెచ్కు స్వర్ణ యుగం లాంటిది. ఆసుపత్రి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నేడు అభివృద్ధి జరుగుతోంది. ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ అయ్యాయి. నూతనంగా పోస్టులను సైతం మంజూరు చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఇవ్వడంతో కార్పొరేట్ ఆసుపత్రులకంటే దీటుగా ఆపరేషన్లు చేస్తున్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా సహకారంతో ఆసుపత్రిలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి.
– డాక్టర్ ఏకుల కిరణ్కుమార్,
ఆసుపత్రి సూపరింటెండెంట్
టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రెండు సార్లు శిలాఫలకాలు వేసి ఒక్క ఇటుక కూడా కట్టకుండా పబ్లిసిటీ చేసుకున్న మదర్ అండ్ చైల్డ్ హెల్త్ వార్డు (మాతాశిశు సంరక్షణ కేంద్రం) నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వం, జింఖానా సహకారంతో రూ. 80 కోట్లతో నిర్మితమవుతున్న ఎంసీహెచ్ వార్డు నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఎంసీహెచ్ నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ తీసుకుని జింఖానా ప్రతినిధులు, ముఖ్యమంత్రితో మాట్లాడటంతో భవన నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడంతస్తులు నిర్మాణం పూర్తయింది. మరో మూడంతస్తులు పూర్తయితే మాతా, శిశు మరణాల తగ్గింపునకు ఈ కేంద్రం ఎంతో దోహదపడుతోంది. గత ప్రభుత్వంలో నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేసిన సర్వీస్బ్లాక్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7.5 కోట్లు మంజూరు చేసింది. కాకుమానువారితోటలో నూతన ఓపీ భవన నిర్మాణం కోసం మంజూరు చేసిన స్థలంలో ప్రహరీ నిర్మాణానికి రూ. 3.5కోట్లు మంజూరు చేసింది. ఆసుపత్రిలో సివిల్, ఎలక్ట్రికల్ మరమ్మతుల కోసం రూ. 5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.