హోసూరు: పైకి బోర్టు మాత్రం మసాజ్ సెంటర్ అని చూపిస్తూ లోపల గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం దందా చేస్తున్న ముఠా గుట్టు చేశారు హోసూరు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ పూర్ణిమ నేతృత్వంలో పోలీసులు మునీశ్వర్నగర్ ప్రాంతంలో ఓ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతోందని తెలిసి దాడి చేశారు. వేలూరు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. బాగలూరు రోడ్డులో వేశ్యావాటిక నిర్వహిస్తున్న కేరళవాసి రామ్శాంత్ (22)ను అరెస్ట్ చేశారు.
మరో ఘటనలో..
రూ.కోట్లాది నగలతో కుదువ వ్యాపారి పరార్
మైసూరు: జనం తాకట్టు పెట్టిన బంగారు నగలతో దుకాణ యజమాని పరారయ్యాడు. దీంతో వందలాది మంది లబోదిబోమన్నారు. ఈ ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. హుణసూరు బజార్ రోడ్డులో వినాయక జ్యువెల్లరీ షాపును రాజస్తాన్కు చెందిన ప్రీతేశ్ అలియాస్ పింటూ అనే వ్యాపారి గత పదేళ్ల నుంచి నడుపుతున్నాడు. స్థానికంగా స్టోర్ వీధిలోని ఇంట్లో ఉంటున్నాడు. పలువురు స్థానికులు అవసరాల కోసం తమ బంగారు నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్లారు.
ఇలా వందలాది మంది ఇతని వద్ద కోట్లాది రూపాయల విలువ చేసే ఆభరణాలను కుదువ పెట్టారు. దీంతో దుర్బుద్ధి పుట్టిన వ్యాపారి నగలను మూటకట్టుకుని రాత్రికిరాత్రి కుటుంబ సభ్యులతో కలసి స్వస్థలానికి పారిపోయాడు. బుధవారం దుకాణం మూసి ఉండడంతో అనుమానం వచ్చిన జనం ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. వారి ఫిర్యాదు మేరకు హుణసూరు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.