చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ప్రతిమనిషి సత్యాన్ని గ్రహిస్తే అవినీతికి చరమగీతం తప్పదని ప్రముఖ పారిశ్రామికవేత్త బి.రత్నారెడ్డి ఉద్ఘాటించారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం ప్రము ఖ సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు రచించిన ‘సత్యాగ్రాహి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాస్తవ సంఘటనలతో భావోధ్వేగానికిగురైన మనసు లోతుల్లోంచి పెల్లుబికిన సత్యశోధనగా సత్యాగ్రాహి పుస్తకం కీర్తిని అందుకుంటుందన్నారు. భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సి.నారాయణస్వామి మాట్లాడుతూ గాంధీజీ సత్యాన్ని శోధించి దేశ ప్రజలకు ఎన్నో సందేశాలు ఇచ్చారని, మానవీయతను తట్టిలేపే అక్షరాయుధంగా దేవేంద్రకవి సాహిత్యం మిగిలిపోతుందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎంవీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సత్యాగ్రాహి కవితా సంపుటిలోని కవితలన్నీ సామాజిక స్పృహతో సాగుతూ సమాజాన్ని మేలుకొలుపుతాయన్నారు. ఈ సందర్భంగా ఇరవైమంది సాహితీవేత్తలను, సంఘసేవకులను దేవేంద్రరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు నందిపాటి చక్రపాణి, కొఠారి వెంకటరత్నం, సి.సుబ్రమణ్యం, బి.కోటీశ్వరమొదలియార్, కె.ఆనందనాయుడు, కేసీ లావణ్య, ఎంజే భాస్కర్ రెడ్డి, తోట గోవిందన్, జి.శాంతకుమారి, సోము ఉమాపతి ఎం.పురుషోత్తం ఆచారి, గొడు గుచింత గోవిందయ్య, పాలకూరు కన్నయ్య, పాడి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులో
విత్తనాలు, ఎరువులు
చిత్తూరు కలెక్టరేట్ : ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా షాపుల ముందు నిల్వ, ధరలను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ అధికారుల నుంచి స్టాకు రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు ధ్రువీకరించుకోవాలని తెలిపారు. విత్తనాకు సంబంధించి సర్టిఫికెట్ ఆఫ్ సోర్స్, ఇతర వివరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ఎంఆర్పీకి మించి విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఫారం–డీని ప్రతి నెల వ్యవసాయ కార్యాలయాల్లో సమర్పించాలని జేసీ సూచించారు.
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
చిల్లకూరు : పాత ఇనుప సామాను చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. మండలంలోని అంకుపాటూరు గ్రామంలో మూత బడిన ఎస్బీక్యూ స్టీల్ పరిశ్రమలో పాత సామాను నెల్లూరు హౌసింగ్ బోర్డుకు చెందిన తిరుమల వడివేలు, అరవ శేఖర్ అపహరించి ఆటోలో తరలిస్తుండగా కంపెనీ భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ సిరాజ్ వెంటనే స్పందించి నిందితులను వెంటాడి ఆటోలోని సామానుతో పాటుగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టు హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.