అనంతపురం కార్పొరేషన్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహకందని రీతిలో సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనులు చేపట్టామని ప్రజాప్రతినిధులు వివరించారు. పేదల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేశామని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మరువరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోగురువారం ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీ క్లస్టర్ ఇన్చార్జ్లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్లొన్నారు. సంక్షేమ, అభివృద్ధి బోర్డులను ఆవిష్కరించారు. రాత్రి వివిధ ప్రాంతాల్లో మండలాధ్యక్షులు, స్థానిక నాయకులు ఆ ప్రాంతంలో భోజనం చేసి, రాత్రి బస చేశారు.
● రాయదుర్గం పట్టణం పార్వతినగర్లోని 1, 2 సచివాలయాల పరిధిలో ‘వై ఏపీ నీడ్స్ జగన్’ను ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప, తదితరులు పాల్గొన్నారు.
● సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. అనంతపురంలోని ఒకటో డివిజన్ ఒకటో సచివాలయ పరిధిలో ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎర్రనేలకొట్టాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలోనే ఊహకందని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. దాదాపు రూ.3 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి జమచేశామన్నారు. కార్యక్రమంలో మేయర్ వసీం, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య తదితరులు పాల్గొన్నారు.
● బుక్కరాయసముద్రం మండలంలోని నీలంపల్లిలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంక్షేమ పథకాల లబ్ధిని తెలిపే బోర్డు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి పథకంలోనూ వారిని భాగస్వాములను చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. పేదలకు విద్య, వైద్యం భారం కాకూడదని ఆ రెండు రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి, ఎంపీపీ సునీత, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.
● తాడిపత్రి పట్టణం, యాడికి పెద్దపప్పూరు, పెద్దవడుగూరు మండలాల్లో ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువనేత కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
● మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. గుంతకల్లు నియోజకవర్గంలోని కసాపురంలో ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● చంద్రబాబు నయవంచక పాలనకు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సువర్ణ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కోరారు. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం లోని చాబాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు.
● చెప్పాడంటే.. చేస్తాడంతే అనేంతలా సీఎం వైఎస్ జగన్ పేరు తెచ్చుకున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. యల్లనూరు మండలంలోని నిట్టూరు గ్రామంలో నిర్వహించిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త సమరోత్సాహంతో సాగుతూ ప్రజలకు జగనన్న చేసిన మంచిని వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి, జెడ్పీటీసీ భోగతి ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా ‘వై ఏపీ నీడ్స్ జగన్’
సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచిని వివరించిన ప్రజాప్రతినిధులు
మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపు