సార్వత్రిక ఎన్నికలకు తొలిఘట్టం ప్రారంభమైంది. జిల్లాలో అరకు పార్లమెంట్తోపాటు పాడేరు, రంపచోడవరం, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంట్ స్థానానికి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్, పాడేరు అసెంబ్లీకి కలెక్టరేట్లోని జేసీ చాంబర్, అరకు అసెంబ్లీకి పాడేరు ఐటీడీఏ కార్యాలయం, రంపచోడవరం అసెంబ్లీకి అక్కడి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటుచేసింది. తొలిరోజు గురువారం రంపచోడవరం అసెంబ్లీకి మాత్రమే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
సాక్షి,పాడేరు: పాడేరు అసెంబ్లీకి సంబంధించి తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. గురువారం నామినేషన్లు దాఖలు కాలేదని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. అరకు పార్లమెంట్ స్థానానికి కూడా నామినేషన్లు అందలేదని పార్వతీపురం మన్యం జిల్లా ఎన్నికల అధికార వర్గాలు తెలిపాయి.
పాడేరు: అరకు అసెంబ్లీ స్థానానికి గురువారం నామినేషన్లు దాఖలు కాలేదని నియోజకవర్గ రిట
ర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. పాడేరు ఐటీడీఏలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కట్టుదిట్టంగా పోలీసు బందోబస్తు కల్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అభిషేక్ మాట్లాడుతూ ఉదయం 11 గంటల ఉంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థులు నామినేషన్లను వేయడానికి ముందు అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదా ఒక్కసారి పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే లోపలకు అనుమితిస్తామని ఆయన చె ప్పారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన డిపాజిట్ చెల్లించాలన్నారు.
రంపచోడవరం: రంపచోడవరం అసెంబ్లీకి తొలిరోజు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినట్టు సబ్కలెక్టర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్కుమార్ తెలిపారు. రంపచోడవరం పంచాయతీ సిరిగిందలపాడుకు చెందిన పాలడుగు లక్ష్మీ ప్రసన్న, పాలడుగు వెంకటేశ్వరరావు ఒకొక్క సెట్ నామినేషన్లు సమర్పించారని ఆయన వివరించారు. బందోబస్తును రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు, ఎస్ఐ మోహన్కుమార్ పర్యవేక్షించారు.
ముమ్మర తనిఖీలు
సాక్షి,పాడేరు: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమవైంది. దీనిలో భాగంగా కలెక్టరేట్ రోడ్డులో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. తలారిసింగి జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డుకు ఇరువైపులా పోలీసులు బాంబు స్క్వాడ్,జాగిలంతో తనిఖీ చేశారు. పాడేరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఆర్వో కార్యాలయం కలెక్టరేట్లో ఉన్నందున భద్రత చర్యలను మరింత పటిష్టం చేశారు. శుక్రవారం నుంచి నామినేషన్లు జోరందుకునే అవకాశం ఉన్నందున పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.
తొలిరోజు అరకు పార్లమెంట్, పాడేరు, అరకు అసెంబ్లీకి నామినేషన్లు నిల్
రంపచోడవరం అసెంబ్లీకి ఇద్దరు
స్వతంత్ర అభ్యర్థుల దాఖలు
పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసిన
పోలీసు యంత్రాంగం