● కలెక్టర్ హిమాన్షు శుక్లా
● కొత్తపేటలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలన
● అధికారులు, సిబ్బందికి సూచనలు
కొత్తపేట: ఐదేళ్లకు ఒకసారి వచ్చే ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓటర్లకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరగనున్న పోలింగ్కు సంబంధించి స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ శుక్లా ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి స్వీకరణ, పోలింగ్ సిబ్బంది హాజరు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆర్డీఓ, నియోజకవర్గ ఎన్నికల అధికారి (ఆర్ఓ) జీవీవీ సత్యనారాయణ, ఏఈఆర్ఓలతో డిస్ట్రిబ్యూషన్, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని దృష్ట్యా త్వరితగతిన పోలింగ్ సిబ్బందిని, భద్రతా సిబ్బందిని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల పోలింగ్లో జిల్లా ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకునేందుకు ఆన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం తనిఖీ చేసుకోవాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకులతో సెక్టార్ ఆఫీసర్ మార్గ దర్శకత్వంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఆయా పీఎస్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలను సమగ్రంగా చేపడుతూ పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సూచించారు. కొద్దిపాటి వర్షం పడినా సురక్షితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రిసెప్షన్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. జిల్లా ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తిస్థాయిలో వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
జిల్లా ఎస్పీ శ్రీధర్ హెచ్చరిక
అమలాపురం టౌన్: శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదు. ఎన్నికల సజావుగా సాగేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా జిల్లా అంతటా ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న దృష్ట్యా అయిదుగురి కంటే ఎక్కువ మంది ఓ చోట గుమికూడితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది, మాజీ ఆర్మీ ఉద్యోగులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనలను మరోసారి గుర్తు చేశారు. ఓటర్ల సెల్ఫోన్లను పోలింగ్ బూత్ల్లోకి అనుమతించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వచ్చినవారు తప్ప ఇతరులెవరూ ఉండకూడదు. వాహనాలకు కూడా అనుమతి లేదన్నారు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించుకునేందుకు అనుమతి ఉందని చెప్పారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం లేకుండా ఓటు హక్కు ప్రశాంతంగా వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలన్నారు. సోషల్ మీడియాలో పుకార్లు, అనవసరమైన వార్తలను వ్యాప్తి చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీధర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోవకు ఎన్నికల ఎఫెక్ట్
తుని రూరల్: లోవ దేవస్థానానికి వచ్చే భక్తులపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం తీవ్రంగా పడింది. సాధారణంగా ఆదివారం 10 వేల మంది వరకు భక్తులు లోవ దేవస్థానికి వచ్చి తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా సోమవా రం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ వారం లోవకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం ఉదయం నుంచి సా యంత్రం వరకు 4 వేల మంది భక్తులు తలుపుల మ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులి హోర ప్రసాదాలు, పూజా టికెట్లు, వసతి గదుల అద్దెలు, తదితర వివిధ విభాగాల నుంచి రూ. 1,71,283 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు.