మా ఊర్లోకి రావొద్దు | Sakshi
Sakshi News home page

మా ఊర్లోకి రావొద్దు

Published Mon, Mar 23 2020 2:12 AM

Corona Virus: Villagers blocked the two people from Dubai - Sakshi

లింగంపేట: విదేశాల నుంచి వస్తున్న వారికి పెద్ద సమస్య వచ్చిపడింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరిని, కర్ణాటక నుంచి వచ్చిన మరొకరిని గ్రామాల్లోకి రానివ్వడం లేదు. వివరాలు.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పొల్కంపేట గ్రామానికి చెందిన మహంకాళి రాములు ఆదివారం ఉదయం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాడు. అతడు ప్రైవేట్‌ వాహనంలో గ్రామానికి వస్తుండగా అడ్డుకున్నారు. దీంతో ఆయన లింగంపేట అంబేడ్కర్‌ చౌరస్తాలో బైఠాయించాడు. సమాచారం అందుకున్న అధికారులు రాములును ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అక్కడి సిబ్బంది వెనక్కు పంపించడంతో అతడు చౌరస్తాకు చేరుకోగా, అధికారులు ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పర్మళ్లకు చెందిన అనిల్‌కుమార్‌ కర్ణాటకలోని బళ్లారి నుంచి ఆదివారం గ్రా మానికి చేరుకోగా, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతడ్ని వైద్య పరీక్షల నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌కుమార్‌ 4 రోజుల క్రితం దుబాయ్‌ నుంచి రాగా, అతడ్ని కూడా స్థానికుల కోరిక మేరకు ఆదివారం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు.
 

Advertisement
Advertisement